మెదక్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కట్టుదిట్టమైన భద్రతతో ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గట్టి భద్రత మధ్య ఓట్ల లెకింపు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచామని ఆయన వెల్లడించారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలంలోని వైపీఆర్ కళాశాలలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో 274 పోలింగ్ కేంద్రాలు, 14 టేబుల్స్, 20 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు, 14 టేబుల్స్, ఈవీఎం పోస్టల్తో దాదాపు 22 రౌండ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా నియోజకవర్గాల నుంచి ఓట్ల లెకింపు కేంద్రమైన వైపీఆర్ కళాశాలకు ఈవీఎంలు తరలించి జాగ్రత్తగా సరిచూసుకుని, స్ట్రాంగ్ రూంలలోకి ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా క్రమపద్ధతిలో అమర్చామన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.
స్ట్రాంగ్ రూమ్ల వద్ద సాయుధ బలగాలతో పహారా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా స్ట్రాంగ్రూంలతోపాటు వాటి పరిసరాలను అనుక్షణం పరిశీలించేందుకు వీలుగా సీసీ కెమెరాలను అమర్చి, మానిటర్ల ద్వారా పర్యవేక్షణ జరిపిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం ఉదయం 6.00 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఓట్ల లెకింపు కేంద్రాల్లోకి ఇతరులెవరూ లోనికి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. అన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెకింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది రాకపోకలకు, అభ్యర్థులు, ఏజెంట్ల రాకపోకల కోసం వేర్వేరు మార్గాలతో ఏర్పాటు చేసిన బారికేడ్లను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, కౌంటింగ్ టేబుల్స్, ఇతర అన్ని ఏర్పాట్లను నిశితంగా పరిశీలన చేశారు. ఆయనవెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్ ఆర్వో రాజేశ్వర్, ఎన్నికల అధికారులు, ఎన్నికల సిబ్బంది ఉన్నారు.