సంగారెడ్డి, మే 1: రైతులకు ఇబ్బందులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగిరం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్ మాధూరితో కలిసి ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ధానం కొనుగోలు కేంద్రాలు, ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, ట్యాబ్ ఎంట్రీలు, కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, గన్నీబ్యాగుల లభ్యత, తేమ కొలిచే యంత్రాలు, రైతుల ఖాతాల్లో జమ అయిన చెల్లింపుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్యాక్స్ డీసీఎంఎస్, ఐకేపీలతో జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 175 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. అన్ని కొనుగోలు కేంద్రాలను తక్షణమే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సజావుగా ధాన్యం సేకరణ కొసాగించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.