సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 22: ప్రజాపాలన లక్ష్యాలు చేరుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం అన్ని శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులతో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన సమగ్ర నివేదికలను శాఖల వారీగా సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలును పర్యవేక్షించి, సమీక్షించేందుకు జిల్లా ప్రత్యేకాధికారిగా కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ క్రిష్టినా జడ్ చోంగ్తు నియమితులయ్యారన్నారు. జిల్లాకు వచ్చి ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖలు తమ పరిధిలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, వార్డులు, మున్సిపల్ పట్టణాల్లో నిర్వహించిన గ్రామ సభలు, ప్రత్యేక సమావేశాలు, అవగాహన కార్యక్రమాల పూర్తి వివరాలను సమగ్రంగా సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, అన్ని శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.