నీరు మనిషి మనుగడకు మూలాధారం. కానీ, అదే నీరు కలుషితమైతే ప్రజల జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది. ‘నీరు ఉంటేనే జీవితం’ అనే మాట.. వీరన్నపల్లి, బొంతపల్లి, దోమడుగు పారిశ్రామిక ప్రాంత ప్రజల పరిస్థితిని చూస్తే అక్షరాలా నిజమని తెలుస్తోంది. పరిశ్రమల మధ్య నివసిస్తున్న ఈ ప్రాంత ప్రజలు, తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కప్పుడు భూగర్భ జలాలపై ఆధారపడిన ఇక్కడి ప్రజలు, నేడు మిషన్ భగీరథ నీటికోసం ఎదురు చూస్తున్నారు. బోర్లు వేసినా తాగునీరు కాకుండా అధిక స్థాయిలో లవణాలు, రసాయనాల మిశ్రమంతో కూడిన నీరే రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథే నీరే వీరికి ఏకైక ఆధారం. మిషన్ భగీరథ నీటి సరఫరాలో తరచూ అంతరాయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గుమ్మడిదల, ఆగస్టు 10: సంగారెడ్డి జిల్లా బొంతపల్లి, దోమడుగు పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కడ బోరువేసినా టోటల్ డిసాల్వ్సాలిడ్స్ (టీడీఎస్) సాయిల్ సుమారు 4వేల వరకు నమోదవుతున్నాయి. సాధారణంగా తాగునీటికి అనువైన ప్రమాణాల కంటే ఇది చాలా ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ నీటిని తాగడం దూరంగా ఉంచితే, ఇంటి అవసరాలకు, స్నానానికి, బట్టలు ఉతకడానికి కూడావినియోగించలేని పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్నిచోట్ల దుర్వాసనతో కూడిన నీరు వస్తోందని, చేతులతో తాకినా అసౌకర్యంగా అనిపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల మధ్య నివస్తున్న ప్రజలకు ప్రస్తుతం మిషన్ భగీరథ నీరే ఏకైక ఆధారంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులకు కూడా బోరు నీటికి బదులు మిషన్ భగీరథ నీరే తాగించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. స్థానిక భూగర్భ జలాలు వాడితే ఇంటి నిర్మాణ నాణ్యత దెబ్బతింటుందనే ఆందోళనతో చాలామంది మిషన్ భగీరథ నీటినే ఉపయోగిస్తున్నారు.
బొంతపల్లి, దోమడుగు పారిశ్రామిక ప్రాంతాల్లో పదుల సంఖ్యలో రసాయన పరిశ్రమలు ఉన్నాయి. కానీ, భూగర్భ జలాల కాలుష్యంపై సమగ్ర అధ్యయనం, శుద్ధిచర్యలు, శాశ్వత పరిష్కారాలపై ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భూగర్భ జలాలు ఎందుకు ఈ స్థాయిలో కలుషితమయ్యాయి? వాటిని శుద్ధిచేసే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మిషన్ భగీరథ సేవలను కొనసాగిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి 8 నెలలుగా వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో సంబంధిత సంస్థ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతోందని సమాచారం. వేతనాలు లేకపోవడంతో సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
బొంతపల్లి, అన్నారం, దోమడుగు, వీరన్నగూడెం పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. భూగర్భ జలాల నాణ్యతపై శాస్త్రీయ పరీక్షలు నిర్వహించడం, కాలుష్యానికి కారణాలను గుర్తించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం, మిషన్ భగీరథ ద్వారా నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేయడం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలను విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘దాహం తీర్చే నీళ్లు అందితేనే గ్రామాలు బతుకుతాయి.. తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
భూగర్భ జలాలు కలుషితం కావడంతో పారిశ్రామిక ప్రాంతంలో నివస్తున్న ప్రజలు వినియోగించలేక పోతున్నారు. కేవలం మిషన్ భగీరథ నీరే ఇక్కడి ప్రజలకు సంజీవనీ. కానీ, మిషన్ భగీరథ నీటిని సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మిషన్ భగీరథ నీరు రావడానికి చక్రియాల్ నుంచి నర్సాపూర్కు రావాలని, అక్కడి నుంచి నల్లవల్లిలో మిషన్ భగీరథ సంపునకు రా వాలి. కరెంట్ కోతలు, పైప్లైనకి లీకేజీల వంటి కారణాలతో సిబ్బంది సరైన సమయంలో మిషన్ భగీరథ నీరు సరఫరా చేయడం లేదు. దీనికి వల్ల ప్రతిరోజూ తా గు నీటి ట్యాంకులకు నీరు రాకపోవడంతో తాగునీటి సమస్య జటిలంగా మారుతున్నది. ప్రభుత్వం తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలి.
– సురభి కుమార్గౌడ్, కౌన్సిలర్, గుమ్మడిదల బల్దియా