నిజామాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులకు, రైతు కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచిన రైతు బీమా పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఏటా ఆగస్టు 14తో ముగిసే ప్రీమియం గడువును రిన్యూవల్ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఉత్సాహం చూపకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పథకానికి పురుడు పోశారు. రైతులకు ఎంతో మేలు చేకూరే విధంగా బీమా పథకాన్ని ప్రత్యేకంగా తీసుకు వచ్చారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చేంత వరకు దేశంలో మరెక్కడా రైతు బీమా మాదిరి స్కీమ్లు అమలు కాలేదు. వివిధ రాష్ర్టాలు ఈ పథకాన్ని కాపీ కొట్టి అమలు చేశాయి.
గొప్పదైన పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలకు దిగుతున్నట్లుగా తెలుస్తోంది. వ్యవసాయ శాఖలో ఈ మేరకు ఎలాంటి చలనం లేకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. లక్షలాది మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వమే పూర్తి స్థాయి ప్రీమియం చెల్లించి వారికి కొండంత ధైర్యాన్ని గత సర్కారు కల్పించింది. పంద్రాగస్టుతో నూతన ఏడాదిలో బీమా పథకం అమలులోకి రావాల్సి ఉండగా హడావిడి కనిపించడం లేదు. రైతుబీమాకు ఈ వార్షిక బడ్జెట్లో నిధులు కూడా కేటాయించలేదు. ఈ మేరకు పథకం నిలుపుదల తథ్యమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ గణాంకాల ఆధారంగా నిజామాబాద్ జిల్లాలో 2లక్షల 76వేల మంది, కామారెడ్డి జిల్లాలో 3లక్షల 9వేల మంది రైతులకు నష్టం వాటిల్లనున్నది.
రైతులు అకాల మరణం చెందితే వారి కుటుంబాలు ఓ వైపు అప్పు లు… మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యేవి. ఇలాంటి పరిస్థితుల్లో వారి ఆర్థ్ధిక సమస్యలను పరిష్కరించి, భరోసా కల్పించేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2018, పంద్రాగస్టు రోజున రైతుబీమా పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ప్రభుత్వమే ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించేది. కర్షకులపై నయాపైసా భారం పడకుండా ఉండేందుకు సర్కారే మొత్తం డబ్బులు కట్టింది. ఇలా ప్రతి ఏటా ఆగస్టు 14వ తేదీన ఎల్ఐసీకి ప్రభుత్వం నుంచి తన వాటా, రైతుల వాటాగా ప్రీమియం చెల్లింపులు ఠంచనుగా జరిగేది. రైతుల సంఖ్యను అనుసరించి ఎల్ఐసీకి రాష్ట్ర వ్యాప్తంగా రూ.1400 కోట్లు నిధులు మంజూరు చేసేది.
ఉమ్మడి జిల్లా వాటాగా రూ.100 కోట్లు వరకు ఉండేది. ప్రస్తుతం ఈ పథకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఎల్ఐసీకి ప్రీమియం చెల్లింపులు నిలిపి వేయడంతో ఈ దుస్థితి ఏర్పడింది. రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యంతో పాటు వివిధ కారణాలతో రైతులు అకాల మరణం పొందడం, ఆ తర్వాత పెద్ద దిక్కును కోల్పోవడం వారి కుటుంబాలు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులను చూసి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చలించి రైతుబీమాను తీసుకు వచ్చారు. 18-59 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ఉండి, తమ పేరుపై ఎంతో కొంత భూమి కలిగిన రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. పట్టాదారుపాసు పుస్తకంలో గుంట భూమితో పేరు నమోదై ఉంటే అర్హులుగా తేల్చారు. కుటుంబంలో ఎంత మందికి పట్టాదారు పాసుపుస్తకాలు ఉంటే వారికి రైతుబీమా అమలు చేశారు.
రైతుబీమా రద్దు చేయాలనే రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబాలకు ఈ పథకం ఎంతో అండగా ఉండేదని, ఇప్పుడు ఆ భరోసా కరువు అవుతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతున్నది. రైతుబీమా పథకం కింద అందే రూ.5లక్షలు పరిహారం ఆ కుటుంబానికి ఎంతో మేలు చేసిందని, ఆ సొమ్ముతో అప్పులు తీర్చడమో… పిల్లల్ని చదివించడమో… వారి పెళ్లిళ్లు చేయించడమో చేసే వారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఉన్నఫలంగా రైతుబీమా పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఆ భరోసా లేకుండా పోతుందనే ఆందోళనలో రైతులు ఉన్నారు.
కుటుంబ పెద్దను కోల్పోయామనే బాధతో పాటుగా మళ్లీ అప్పులు, ఆర్ధిక ఇబ్బందులు వెంటాడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇందిరమ్మ కుటుంబ బీమా మాటున రైతు బీమా పథకాన్ని రద్దు చేయడం ఎందుకు? అని ప్రభుత్వాన్ని కర్షకులు ప్రశ్నిస్తున్నారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంతో పాటు రైతుబీమా పథకాన్ని కూడా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు సర్కార్ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి రైతుల కోసం సంవత్సరానికి రూ.1400 కోట్లు ప్రీమియం చెల్లించడానికి ఖర్చు చేయలేదా? అని నిలదీస్తున్నారు. కేసీఆర్ అమలు చేసిన రైతుబీమా పథకంలో భాగంగా రైతులు ఏ కారణంతో మరణించినప్పటికీ ఆ రైతు కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ఎల్ఐసీ ద్వారా చెల్లించేలా ఏర్పాటు చేశారు. ఒకవేళా ఈ పథకం రద్దు చేస్తే కర్షక కుటుంబాలకు మళ్లీ కష్టాలు మొదలు కానున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబీమా పథకం సక్రమంగా అమలయ్యేది. దురదృష్టవశాత్తు రైతు మృతి చెందితే, వారం రోజుల్లోనే బీమా డబ్బులు నామినీ అకౌంట్లో జమ అయ్యేవి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. బీమా డబ్బులు రావడంలో తీవ్ర ఆలస్యం జరుగుతున్నది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో పాటు సకాలంలో ప్రీమియం డబ్బులు చెల్లింపులను బీమా కంపెనీకి చెల్లించకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది.
రైతు కుటుంబానికి ఆసరాగా ఉండాలనే గొప్ప సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన అద్భుతమైన పథకం రైతుబీమా పథకం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకం అమలులో విఫలమవుతున్నది. రైతు మరణిస్తే వచ్చే బీమా పైసలు రావడం లేదు. దీంతో చాలా కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇప్పటికే రైతులకు ఇచ్చిన హమీల అమలులో రేవంత్ ప్రభుత్వం విఫలమైంది. రైతుబీమా పథకాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తున్నది. రైతులపై నిర్లక్ష్యం వహిస్తే పోరాడుతాం.
– బోడ రాంచందర్, రైతు బోర్లం క్యాంపు తండా