మెదక్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈ నెల 29లోగా బియ్యం పట్టని మిల్లుల యజమానులపై ఆర్ఆర్ యాక్ట్ కింద స్థిర, చర ఆస్తులు జప్తు చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. జిల్లాలో అధిక శాతం సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల యజమానులతో మిల్లుల వారీగా శుక్రవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెలలు గడుస్తున్నా మిల్లర్లు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, దీనిని తీవ్రంగా పరిగణమిస్తామన్నారు. సీఎంఆర్ కేటాయింపులపై కూలంకషంగా చర్చించారు. రైతుల నుంచి కొనుగోలు చేసి సేకరించిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ చేసి నెలాఖరులోగా నిర్దేశిత కోటాను భారత ఆహార సంస్థకు చేరవేయాలని రైస్ మిల్లర్లకు సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని తేల్చిచెప్పారు.
సీఎంఆర్ కేటాయింపుల్లో జాప్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నందున, మిల్లర్ల అలసత్వాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అవసరమైతే ధాన్యాన్ని కొనుగోలు చేసి అయినా నిర్ణీత గడువులోగా లక్ష్యానికి అనుగుణంగా సీఎంఆర్ డెలివరీ చేయాలని మిల్లర్లకు తేల్చి చెప్పారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని రైస్ మిల్లుల్లో పూర్తిస్థాయి సామర్థ్యానికి అనుగుణంగా కస్టమ్ రైస్ మిల్లింగ్ జరుపుతూ, ఈ నెలాఖరులోగా ఎఫ్సీఐకి నిల్వలు చేరవేయాలని తెలిపారు. సమావేశంలో సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, డీసీఎస్వో బ్రహ్మారావు, రైస్ మిల్లర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.