హవేళీఘనపూర్, నవంబర్ 24: రాష్ట్రంలో అన్ని కులాల ప్రజలు తమ కులవృత్తులను చేసుకుంటూ అభివృద్ధి చెందాలనే దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నాడని సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని కూచన్పల్లి శివారులోని చెక్డ్యాం వద్ద చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కుంటుపడిన కులవృత్తులకు జీవం పోస్తున్నారన్నారు.
ప్రాంతంలోని మత్స్యకారులకు కేవలం వరిసాగు లాంటివే కాకుండా ఫిష్ఫాడ్స్పై కూడా అవగాహన కల్పిస్తే వారికి మంచి జీవనోపాధి లభిస్తుందన్నారు. కూచన్పల్లి శివారులో నిర్మించిన చెక్డ్యామ్ వల్ల మత్స్యకారులకు చేపలు పట్టుకునేందుకు వీలు కల్పించడం, భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి కూడా అవసరపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మత్స్యశాఖ ఏడీఏ రజిని, సర్పంచ్లు యామిరెడ్డి, లక్ష్మీనారాయణ, గోపాల్రెడ్డి, శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు.