నారాయణఖేడ్, అక్టోబర్ 30: బీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టి మళ్లీ హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ కాబోతున్నారని, నారాయణఖేడ్లోనూ గులాబీ జెండా ఎగరడం ఖాయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. గడపగడపకూ చేరిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రజల దీవెనలతో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమన్నారు. ఎడారి లాంటి నారాయణఖేడ్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడంతోపాటు మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, కొత్తగా ఎనిమిది చెరువులను మంజూరు చేసి నియోజకవర్గంలో సాగునీటి వనరులను అందుబాటులోకి తెచ్చిన సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. నీటి సమస్యతో కిలోమీటర్లు నడిచి నీరు తెచ్చుకునే పరిస్థితి ఉండగా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాలతో ప్రజల కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. విద్య విషయానికి వస్తే ఎనిమిది గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడంతోపాటు మన ఊరు- మన బడి ద్వారా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించామని చెప్పారు.
నారాయణఖేడ్లో 150 పడకల దవాఖానను నిర్మించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపర్చేందుకు కల్హేర్, కరస్గుత్తిలలో 30 పడకల దవాఖానలను ఏర్పాటు చేశామన్నారు. 17 కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నామన్నారు. ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజనూ కొనుగోలు చేస్తుండగా, పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన రైతులు సైతం నారాయణఖేడ్లో ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. అంబులెన్స్లు సైతం పోలేని తండాలు, గ్రామాలకు బీటీ రోడ్లు ఏర్పాటు చేసి రవాణా సదుపాయాన్ని మెరుగుపర్చినట్లు చెప్పారు. రూ.100 కోట్లతో నారాయణఖేడ్-మాసాన్పల్లి డబుల్లేన్ రోడ్డు ఏర్పాటు చేయాలని, రూ.80 కోట్ల నిధులతో నల్లవాగు ప్రాజెక్టు ఎల్లప్పుడు నిండుకుండలా ఉండి రెండు పంటలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరందే విధంగా ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలని, నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాలను దృష్టిలో ఉంచుకుని నాలుగు బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, సీఎం కేసీఆర్ను విజ్ఞప్తి చేశారు.
నారాయణఖేడ్లో సోమవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహారెడ్డి భూపాల్రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. సౌమ్యుడిగా, భేషజాలు లేకుండా ఎల్లప్పుడు ప్రజల మధ్య ఉంటూ బ్రహ్మాండగా అభివృద్ధి సాధించిన హీరో భూపాల్రెడ్డి అని కితాబిచ్చారు. తనకు ఎప్పుడు కలిసినా వ్యక్తిగత సమస్యలు చెప్పకుండా ఎప్పుడూ ప్రజావసరాల కోసమే అభ్యర్థించి కొత్త మండలాలు, ఇతర అభివృద్ధి పనులు మాత్రమే అడిగారన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, చిమ్నిబాయి గురించి ప్రస్తావించి గతంలో ఇక్కడి నీటి సమస్యతో ప్రజలు పడ్డ బాధలను గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్రెడ్డి, పార్టీ సంగారెడ్డిత జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ రుబినాబేగం నజీబ్, వైస్ చైర్మన్ ఆహీర్ పరశురామ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పట్టణ, మండలాల పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.