సిద్దిపేట, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం నుంచి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నది. ఈనెల 15న హుస్నాబాద్ పట్టణంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమై, పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందించి ఎన్నికల నియమ నిబంధనలు తదితర అంశాలపై అభ్యర్థులకు వివరించి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అనంతరం హుస్నాబాద్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ సాయంత్రం నాలుగు గంటలకు హాజరవుతారు. హుస్నాబాద్ నియెజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఇది రాష్ట్రంలో ఈశాన్య ప్రాంతంలోఉంటుంది. ఇది కలిసి వచ్చే అంశం కావడంతో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఇక్కడే నిర్వహించాలని గులాబీ అధినేత సీఎం కేసీఆర్ సూచించారు.
2014, 2018 శాసనసభ ఎన్నికల్లో సైతం ఇక్కడి నుంచి ‘ప్రజా ఆశీర్వాద సభ’లతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తాజాగా ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనుండడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 17న సిద్దిపేటలో సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తారు. నవంబర్ 9న సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తారు. తన నామినేషన్ పత్రాలకు పూజలు చేయించిన అనంతరం గజ్వేల్ శాసనసభ స్థానానికి నామినేషన్ వేస్తారు.అక్కడి నుంచి కామారెడ్డికి వెళ్లి అక్కడ శాసనసభ స్థానానికి నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. అక్కడ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ప్రతి ఎన్నికల ముందు కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభను హుస్నాబాద్ నుంచి ప్రారంభించనుండడంతో సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్కుమార్తో కలిసి సభ విజయవంతం చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. తొలి సభ కావడంతో విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సభకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరానున్నారు. గత తొమ్మిదేండ్లలో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. ఆపనులు ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తి చేయించారు. ఇటీవలనే ట్రాయల్ రన్ సైతం నిర్వహించి, రిజర్వాయర్లోకి గోదావరి జలాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల గౌరవెల్లి రిజర్వాయర్ను ప్రారంభించుకోలేదు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో మున్సిపాలిటీతో పాటు హుస్నాబాద్ మండలం, అక్కన్నపేట, కోహెడ మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. కరీంనగర్ జిల్లాలో చిగురుమామిడి, సైదాపూర్, హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి, బీమదేవరపల్లి మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నది. ఈ సభకు జనసమీకరణ తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే సతీశ్కుమార్,స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై సభ ఏర్పాట్లు, జనసమీకరణ తదితర వాటిపై మంతి హరీశ్రావు చర్చించనున్నట్లు తెలిసింది.
సభలను విజయవంతం చేసేలా కార్యాచరణ
సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభలను విజయవంతం చేసేలా మంత్రి హరీశ్రావు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈనెల 15న హుస్నాబాద్, 17న సిద్దిపేటలో నిర్వహించనున్న సభలను విజయవంతం చేసి ప్రతిపక్ష పార్టీలను డైలమాలో పడేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభల ద్వారా బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ పెరగనున్నది. ఇప్పటికే హుషారుగా పనిచేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయనున్నారు. సీఎం కేసీఆర్ సందేశాన్ని గడపగడపకూ తీసుకుపోయేలా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది.