దుబ్బాక / దుబ్బాక టౌన్, నవంబర్ 20: ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం దుబ్బాకలో మంత్రి పర్యటించారు. ఈ నెల 26న జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లపై స్థానిక నాయకులకు పలు సూచనలు చేశారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెట్టాలంటే కొత్త ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకపై సీఎం కేసీఆర్కు ఎంతో ప్రేమ ఉన్నదన్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కోరికమేరకు వంద పడకల దవాఖాన మంజూరు చేస్తే నేడు పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది నాయకులు కొబ్బరికాయ, కత్తెర పట్టుకొని రిబ్బన్ పెట్టుకొని తిరుగుతుండడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. దుబ్బాక బస్స్టాండ్ నిర్మిస్తే తామే చేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే గత ఉప ఎన్నికలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే మురికి కాలువల్లో వేసినట్టేనన్నారు. దుబ్బాకకు ఎమ్మెల్యేగా చేతల మనిషి కావాలా.. మాటల మనిషి కావాలా ప్రజలే తేల్చుకోవాలని కోరారు.
దుబ్బాకలో 26న జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దుబ్బాకకు రానుండటంతో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరనున్నాయని, నియోజకవర్గ ప్రజలు కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. దుబ్బాక దుంపలపల్లి రోడ్డులో జరిగే ప్రజాఆశీర్వాద సభ, హెలీప్యాడ్ స్థలాన్ని స్థానిక నాయకులతో కలిసి మంత్రి పరిశీలించారు. దుబ్బాక చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఆశీర్వాద సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలో కత్తిపోట్లకు గురైన బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొంటారన్నారు. యువకులు, విద్యార్థులు, రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి, రాష్ట్ర నాయకులు మనోహర్రావు, రొట్టె రాజమౌళి, కౌన్సిలర్లు ఆస యాదగిరి, స్వామి, స్థానిక నాయకులు బండి రాజు, వంశి, భూంరెడ్డి, నరేశ్, రాజలింగంగౌడ్, రామస్వామిగౌడ్, సురేశ్, సంజీవరెడ్డి పాల్గొన్నారు.