మెదక్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రసంగించారు. మెదక్ సమితి అధ్యక్షుడిగా పని చేసిన తన తండ్రి స్వర్గీయ శేరి విఠల్రెడ్డి తనకు వందల ఎకరాల భూమి ఉన్నప్పటికీ వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో మొత్తం పడావు పెట్టారన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో గ్రామాల్లోని సాధారణ రైతు కూడా లాభసాటిగా వ్యవసాయం చేస్తున్నారన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరగడంతో గోదాంలు, రైస్ మిల్లులు లేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ప్రతి జిల్లాలో గోదాంలు, రైస్ మిల్లులు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. టీఎస్ సీడ్స్ సంస్థ మెదక్లో గిడ్డంగులు మంజూరు చేశారని, కానీ ఇంకా నిర్మాణం మొదలు కాలేదన్నారు. వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని ఎమ్మెల్సీ కోరారు.