ప్రజాభద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చేందుకు పోలీసు శాఖలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్లో డీఎస్పీ కార్యాలయాలు, పాత పోలీసుస్టేషన్లను ఆధునీకరించడంతో పాటు కొత్తగా ఐదు స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పెట్రోలింగ్ కోసం 328 ఇన్నోవా వాహనాలను అందజేసింది. మొత్తం నాలుగు షీ టీమ్లను నియమించిన అధికారులు, 300కుపైగా అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 7091 సీసీ కెమెరాల ద్వారా నిఘా కట్టుదిట్టం చేశారు. మెదక్ జిల్లాలో ఐదు నూతన స్టేషన్లు మంజూరయ్యాయి. షీ టీమ్ ఆధ్వర్యంలో 2022లో 26 కేసులు, 2023 లో10 కేసులు నమోదుచేశారు. సైబర్ మోసగాళ్ల వలకు చిక్కకుండా గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
– సంగారెడ్డి (నమస్తేతెలంగాణ)/ మెదక్ అర్బన్, జూన్ 3
సంగారెడ్డి, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజాభద్రతను అప్పటి ప్రభుత్వాలు విస్మరించాయి. ఫలితంగా సంగారెడ్డి జిల్లాలో నేరాల సంఖ్య పెరగటంతోపాటు ప్రజలు భయంగా బతకాల్సిన పరిస్థితి నెలకొంది. 2014 తర్వాత తెలంగా రాష్ట్ర అవతరణ, సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వాత శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఫలింతగా గత తొమ్మిదేళ్లలో సంగారెడ్డి జిల్లాలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది.
తగ్గిన నేరాలు.. రోడ్డు ప్రమాదాలు
2014కు ముందు సంగారెడ్డి జిల్లాలో పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునేవి. జిల్లాలోని 65 నెంబరు జాతీయ రహదారి, నాందేడ్ రహదారితోపాటు ప్రధాన రహదారుల్లో ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం నిర్థిష్టమైన చర్యలు చేపట్టింది. జిల్లాలో ప్రస్తుతం సంగారెడ్డి, పటాన్చెరులో ట్రాఫిక్ పోలీస్టేషన్లు ఉన్నాయి. మరో ట్రాఫిక్ పోలీస్టేషన్ను ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనుంది.
సంగారెడ్డి జిల్లాలో పోలీసుల పనితీరు ఇలా…
పాలనాదక్షతతో సంపూర్ణ భద్రత
2 సబ్ డివిజన్లు : జహీరాబాద్, నారాయణఖేడ్
5 కొత్త పోలీస్టేషన్లు : అమీన్పూర్, గుమ్మడిదల, వట్పల్లి, కల్హేర్, నాగల్గిద్ద
2 సర్కిళ్లు : జిన్నారం, కంగ్టి
సంగారెడ్డిలో రెండు సబ్ డివిజన్లు.. ఐదు కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు
సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా రెండు సబ్డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. గతంలో సంగారెడ్డి, రామచంద్రాపురం డివిజన్ కార్యాలయాలు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నారాయణఖేడ్, జహీరాబాద్ డీఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. కొత్తగా జినానరం, కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం జిల్లాలో కొత్తగా అమీన్పూర్, గుమ్మడిదల, వట్పల్లి, కల్హేర్, నాగల్గిద్ద పోలీస్టేషన్లను ఏర్పాటు చేసింది. జిల్లాలో పోలీసుశాఖలో నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. జిల్లాలో కొత్తగా 711 మంది కానిస్టేబుళ్లను ప్రభుత్వం నియమించింది. ఇటీవలే ప్రభుత్వం కొత్తగా ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల కోసం రాత పరీక్షలు నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లను ఆధునీకరించింది. ప్రభుత్వం ప్రతి పోలీస్టేషన్కు కొత్త వాహనాలను అందజేసింది. పెట్రోలింగ్ కోసం జిల్లాకు ప్రభుత్వం 328 ఇన్నోవా వాహనాలను అందజేసింది.
మెదక్ జిల్లాలో తగ్గిన నేరాలు
మెదక్ అర్బన్, జూన్ 3: ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాకేంద్రం మెదక్ అయినప్పటికీ పాలనా వ్యవహారాలన్నీ సంగారెడ్డి నుంచే సాగేవి. అధికారులు, కార్యాలయాలన్నీ అక్కడే. జిల్లా ఎస్పీ కార్యాలయం కూడా సంగారెడ్డిలోనే ఉండేది. సీఎం కేసీఆర్ నూతన జిల్లాలను ఏర్పాటు చేయడంతో మెదక్ జిల్లాకేంద్రలోనే ఎస్పీ కార్యాలయం ఏర్పాటయింది. ఫలితంగా ప్రజలకు పోలీసులు మరింత త్వరతగతిన సేవలు అందించే వీలు కలుగుతున్నది. జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు.
జిల్లాలో పెరిగిన పోలీసు స్టేషన్లు…
మండలాల పునర్విభజనలో భాగంగా జిల్లాలో 21 మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2016లో నూతనంగా ఐదు మండలాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు 32 మండలాలు ఉండేవి. పునర్విభజనలో నూతనంగా హవేళీఘనపూర్, నిజాంపేట్, చిలిపిచేడ్, మనోహరాబాద్, నార్సింగి మండలాలు ఏర్పాటయ్యాయి. ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ చొప్పున ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో రెండు డివిజన్లలో షీ టీమ్స్ సేవలు కొనసాగుతున్నాయి. ఒకటి మెదక్ డివిజన్ కాగా, మరొకటి తూప్రాన్ డివిజన్ పరిధిలో ఉంది. జిల్లావ్యాప్తంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో 2022 సంవత్సరంలో 10 ఎఫ్ఐఆర్లు, 16 సాధరణ కేసులతోపాటు 40 మందికి పోలీసులు కౌన్సిలింగ్లు నిర్వహించారు. 2023లో జనవరి నుంచి మే నెల వరకు మూడు ఎఫ్ఐఆర్లు, 7 సాధారణ కేసులతో పాటు 20 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. జిల్లాలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో 2022లో రెండు డివిజన్లలో కలిపి 527, 2023లో 182 అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
మహిళలకు భద్రత
ప్రభుత్వం మహిళలపై నేరాలు అరికట్టేందుకు భరోసా కేంద్రం, షీటీమ్లను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లాలో నాలుగు డివిజన్లలో నాలుగు షీటీమ్లను ఏర్పాటు చేసింది. ఒక్కో షీటీమ్లో ఐదుగురు సభ్యులు ఉంటారు. షీటీమ్ల ద్వారా మహిళలకు 300కుపైగా అవగాహన సదస్సులు నిర్వహించారు. షీటీమ్ బృందాలు జిల్లాలో 565 హాట్స్పాట్లను గుర్తించి ఆకతాయిలు మహిళలను ర్యాగింగ్ చేయకుండా చర్యలు చేపట్టారు. భరోసా కేంద్రాల ద్వారా మహిళా సమస్యలను వెంటనే పరిష్కరించారు. జిల్లాలో నమోదైన 330 ఫోక్సో, అత్యాచార కేసుల్లో కౌన్సిలింగ్, మెడికోలీగల్ సేవలను భరోసా కేంద్రాల ద్వారా అందజేశాఉ. భాదిత మహిళలకు రూ.71 లక్షల పరిహారం అందజేలా చేశారు.