HomeMedakCm Kcr Has Spent A Lot Of Funds For The Development Of Muslims And Minorities In The Gajwel Municipal Area And Given Them An Appropriate Place
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం, మైనార్టీల అభ్యున్నతి కోసం గజ్వేల్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు అధిక నిధులు వెచ్చించి వారికి సముచిత స్థానం కల్పించారు. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని మైనార్టీల సంక్షేమం కోసం నిధులు సమకూరేలా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టడంతో గజ్వేల్ మదీనామసీద్కు ప్రతినెలా ఆదాయం సమకూరుతున్నది.
రూ.1.80కోట్లతో గజ్వేల్లో షాపింగ్ కాంప్లెక్స్
రూ.75లక్షలతో ప్రజ్ఞాపూర్లో షాపింగ్ కాంప్లెక్స్
షాదీఖాన, ఈద్గాలకు రెండు ఎకరాల స్థలం
సంతోషం వ్యక్తం చేస్తున్న ముస్లిం, మైనార్టీలు
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన నేతలు
గజ్వేల్, జూన్ 25: ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం, మైనార్టీల అభ్యున్నతి కోసం గజ్వేల్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు అధిక నిధులు వెచ్చించి వారికి సముచిత స్థానం కల్పించారు. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని మైనార్టీల సంక్షేమం కోసం నిధులు సమకూరేలా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టడంతో గజ్వేల్ మదీనామసీద్కు ప్రతినెలా ఆదాయం సమకూరుతున్నది. దీంతో మసీద్ కమిటీ సంతోషం వ్యక్తం చేస్తున్నది. గజ్వేల్ అభివృద్ధిలో సీఎం కేసీఆర్ చెరగని ముద్ర వేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి సమప్రాధాన్యతను ఇవ్వడంతో గజ్వేల్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. గజ్వేల్లో మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను కల్పించారు. పట్టణ సమీపంలోని మినీస్టేడియం వద్ద రెండు ఎకరాల ప్రదేశాన్ని షాదీఖాన, ఈద్గాలకు కేటాయించడంతో అక్కడ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ.3.63కోట్లతో షాదీఖానాను అద్భుతంగా నిర్మించగా పక్కనే ఎకరం స్థలంలో ఈద్గాను సిద్ధం చేశారు.
ప్రభుత్వం పట్టణంలోని మదీనా మసీదు ముందుభాగంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని రూ.1.80కోట్లతో 23షెట్టర్ల తో నిర్మించి ప్రారంభించడంతో వాటిని మసీద్ కమిటీ ఆధ్వర్యంలో అద్దెకు ఇచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషి ఫలితంగా ప్రతినెలా మసీద్ కమిటీకి ఆదాయం వస్తుంది. అక్కడే కొత్తగా నిర్మించిన 23 షట్టర్ల వెనకభాగంలో మరో 11 నిర్మిస్తుండగా స్లాబ్లు పడ్డాయి. అవికూడా త్వరలోనే పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ పరిధిలోని మూట్రాజ్పల్లిలో రూ.15లక్షలతో మైనార్టీ గ్రేవ్యార్డుకు ప్రహరీని నిర్మించారు. ప్రజ్ఞాపూర్లోని జగదేవ్పూర్ మార్గంలో రూ.75లక్షలతో ఈద్గా వద్ద షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నారు. వీటితోపాటు మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం పలు అభివృద్ధి పనులను గడిచిన తొమ్మిదేండ్లలో మైనార్టీల సంక్షేమం కోసం చేపట్టింది.
ఆడబిడ్డలకు అండగా షాదీముబారక్..
సీఎం కేసీఆర్ ముస్ల్లిం ఆడబిడ్డలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన షాదీముబారక్ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తుంది. ఈ పథకం కింద పెండ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకూ ప్రభుత్వం రూ.లక్షా116లను అందజేస్తుంది. నిరుపేదలైన ప్రతి కుటుంబాన్ని ఈ పథకం ఎంతో ఆదుకుంటుంది. పేద, ధనిక తేడాలేకుండా పెండ్లిఅయిన ప్రతి మహిళకూ అందజేస్తున్నారు. పెండ్లి సమయంలో ఆర్థికంగా ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో గజ్వేల్లో షాదీఖానాను నిర్మించారు. ఇందులో సాధారణ రుసుం తీసుకోవడంతో ఎంతో మంది ఇక్కడే పెండ్లి చేసుకునేందుకు ముందుకొస్తున్నారు.
సీఎం కేసీఆర్ కృషితోనే అభివృద్ధి
గజ్వేల్లో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషి ఫలితంగానే అభివృద్ధి జరిగింది. మైనార్టీలను గుర్తించి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో నేడు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేసుకున్నాం. గడిచిన కొద్దిరోజుల్లోనే పనులు వేగవంతంగా పూర్తయ్యాయి. ముస్లింలకు అధిక ప్రాధాన్యతను కల్పించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– జకీయుద్దీన్, గజ్వేల్ మున్సిపల్ వైస్చైర్మన్
షాపింగ్ కాంప్లెక్స్తో మసీద్కు ఆదాయం
మదీనామసీద్ ఎదుట షాపింగ్ కాంప్లెక్స్కు ప్రభుత్వం నిధులు వెచ్చించి నిర్మించడంతో ప్రస్తుతం ప్రతినెలా ఆదాయం సమకూరుతున్నది. ప్రభుత్వం మంచిఉద్దేశంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడంతోనే కమిటీకి ఆదాయం వస్తున్నది. పెద్దల సహకారంతో షాదీఖానా నిర్మాణం పూర్తి చేసుకోవడంతో ఎంతోలాభం జరుగుతుంది.
– యూసూఫ్, మదీనా మసీద్ కమిటీ చైర్మన్
సీఎం కేసీఆర్తోనే మైనార్టీలకు న్యాయం
సీఎం కేసీఆర్తోనే మైనార్టీలకు న్యాయం జరుగుతున్నది. కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న షాదీముబారక్ పథకం ఎన్నో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నది. గజ్వేల్లో కోట్లాది రూపాయలతో షాదీఖానాను నిర్మించిన కేసీఆర్, మంత్రి హరీశ్రావులకు రుణపడి ఉంటాం. గత ప్రభుత్వాలు ముస్లింలను పట్టించుకున్న పాపానపోలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ముస్లింలకు సముచిత స్థానం కల్పించి సరైన న్యాయం చేస్తున్నది.
– నవాజ్మీరా, గజ్వేల్ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు