మిషన్ భగీరథతో పాటు అనేక పథకాలకు సిద్దిపేటలో చేసిన పనులే స్ఫూర్తిని ఇచ్చాయని సీఎం కేసీఆర్ అన్నారు. చింతమడకలో చిన్ననాట తనతల్లికి ఆరోగ్యం బాగా లేకుంటే ముదిరాజ్ తల్లి తనకు చనుబాలు ఇచ్చి సాకిన విషయాన్ని గుర్తుచేశారు. అంతటి సంబంధం ఈ గడ్డతో ఉందని పేర్కొన్నారు. ఎక్కడ ఎన్నికల్లో నిలబడినా.. కోనాయపల్లి వేంకటేశ్వరస్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు పెట్టే వెళ్తానని మీ అందరికీ తెలుసన్నారు. అంతటి పెనువేసుకున్న బంధం మనది అని, ఆరడుగుల బుల్లెట్ హరీశ్ను మీకిచ్చానని, హరీశ్ స్థానంలో తానున్నా సిద్దిపేటను ఇంతలా అభివృద్ధి చేసేవాన్ని కానేమో? అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సిద్దిపేటకు ఒక్క గాలిమోటరు తప్పా అన్నీ చేసుకున్నామన్నారు. గత మెజార్టీని తిరగరాసేలా హరీశ్కు భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
భూమిపుత్రుడి రాకతో సిద్దిపేట పులకించింది. తన ముద్దుబిడ్డ రావడంతో పట్టణానికి పండుగ వచ్చింది. మంగళవారం పట్టణంలో గులాబీ జాతర సాగింది. ఎటుచూసినా జనం..గులాబీ ప్రభంజనాన్ని తలపించింది. సిద్దిపేటలో మంగళవారం నిర్వహించిన ప్రజా ప్రగతి ఆశీర్వాద సభ విజయవంతమైంది. పల్లె, పట్నం అనే తేడాలేకుండా నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష మందికి పైగానే జనం తరలివచ్చారు. లెక్కకు మించి జనం తరలిరావడంతో సభా ప్రాంగణం నిండిపోయింది. ఈలలు, కేరింతలతో హోరెత్తింది. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని జనం ఆసక్తిగా విని చప్పట్లతో బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. అంతకు ముందు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పట్టణంలో గులాబీ జెండాలు పట్టుకొని బైక్ ర్యాలీలు తీశారు. సభలో మిట్టపల్లి సురేందర్ ఆటపాట అలరించాయి. జానపద గాయని కనకవ్వ సందడి చేశారు. గులాబీ జెండాలమ్మ పాట మార్మోగింది.
-సిద్దిపేట ప్రతినిధి/సిద్దిపేట/సిద్దిపేట అర్బన్/రూరల్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ)
‘జననీ జన్మభూమిచ్చ.. స్వర్గాదపీ గరీయసీ.. ఈ మాట అన్నది సాక్షాత్తూ భగవంతుడైన శ్రీరామచంద్రుడు. జన్మభూమిని మించిన స్వర్గం లేదు.. స్వర్గం కంటే కూడా నాజన్మభూమి గొప్పది. సిద్దిపేట పేరు విన్నా, సిద్దిపేటకు వచ్చినా.. సిద్దిపేట గురించి ఆలోచన వచ్చినా నా మనసులో కలిగే భావన ఇది. ఈ సిద్దిపేట గడ్డ నన్ను సాధింది, నన్ను పెద్ద చేసింది, నాకు చదువు చెప్పింది, నాకు రాజకీయ జన్మనిచ్చింది, నన్ను నాయకుడిని చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ సిద్దిపేట అని గర్వంగా చెబుతున్నా’.
– సిద్దిపేటలో సభలో సీఎం కేసీఆర్
సిద్దిపేట ప్రాంతంలో నాకు ఎంతోమంది ఆత్మీయ మిత్రులు ఉన్నారు. కొండంరాజుపల్లి మాదన్న, మా నవాబ్ సాబ్, నాకు డిపాజిక్ కట్టే తోర్నాల చంద్రారెడ్డి బావ. ఏ ఊరికి పోయినా వంద నుంచి రెండు వందల మంది పేర్లు పెట్టి పిలిచేంత అభిమానం కలిగిన గడ్డ ఈ సిద్దిపేట గడ్డ అని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది.
-ముఖ్యమంత్రి కేసీఆర్
కరీంనగర్ ఎంపీగా గెలిచిన నాడు ఢిల్లీకి పోయేందుకు సిద్దిపేటలో మీటింగ్ పెట్టి అందరమూ ఏడ్చినం. అనంతరం సిద్దిపేటకు ఆరడుగుల బుల్లెట్ను మీకు అప్పగించిన. బ్రహ్మాండంగా నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు హరీశ్రావు పనిచేసి మీ గౌరవాన్ని నిలబెట్టిండు. ఆయన స్థానంలో నేను ఉన్నా ఇంతగా పనులు చేయకపోతుంటిని. సిద్దిపేటకు అన్నీ సాధించిండు. ఒకటే తక్కువైంది, అది గాలిమోటర్. సిద్దిపేటను వజ్రపు తునకలా మారుస్తున్నడు హరీశ్.గత మెజార్టీని తిరగరాసేలా హరీశ్కు భారీ మెజార్టీ ఇవ్వాలి.
-ముఖ్యమంత్రి కేసీఆర్