సమైక్య రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో మనకు తరతరాలుగా జరిగిన అన్యాయం నుంచి పుట్టుకొచ్చింది తెలంగాణ ఉద్యమం. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక రాష్ర్టాన్ని పోరాడి సాధించుకున్నాం. ఈ క్రమంలో ఎన్నో త్యాగాలు చేశాం. స్వరాష్ట్రం సిద్ధించాక ఈ ప్రాంత ప్రజల మనసెరిగి పాలన సాగిస్తున్నారు సీఎం కేసీఆర్. మన నిధులు మనకే ఖర్చు చేస్తూ అభివృద్ధి చేస్తున్నారు. కొత్తగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టి బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తుండడంతో క‘న్నీటి’ కష్టాలు దూరమయ్యాయి. ఇక కీలకమైన సర్కారు కొలువుల భర్తీలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా కొత్త జోనల్ విధానాన్ని తెచ్చారు. దీనిద్వారా స్థానికులకే 95శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. దశాబ్దాలుగా జరిగిన అన్యాయం కొత్త విధానంతో రూపుమాపనుంది.
– సిద్దిపేట, మార్చి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో మెదక్ జిల్లాలో సంబురాలు మిన్నంటాయి. నిరుద్యోగులు, విద్యార్థులు, కాంట్రాక్టు ఉద్యోగులు, వివిధ సంఘాలు, టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకుని వేడుకలు జరుపుకొన్నారు. బుధవారం అసెంబ్లీలో సీఎం ప్రసంగం ప్రారంభమవగానే ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు. పలువురు సెల్ఫోన్లో లైవ్ను వీక్షించారు. ఉద్యోగ ప్రకటన వెలువడిన వెంటనే జయహో కేసీఆర్.. జై జై కేసీఆర్ అంటూ చిన్నా, పెద్ద నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మెదక్, కొల్చారం, వెల్దుర్తి, పాపన్నపేటతో పాటు అన్ని మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. హవేళీఘనపూర్లో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరిసుభాశ్రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. మెదక్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు
తెలిపారు. – మెదక్ జిల్లా నెట్వర్క్, మార్చి9
సిద్దిపేట, మార్చి 09(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎవరూ ఊహించని విధంగా పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో 90 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువతకు గుడ్న్యూస్ చెప్పారు. నిజంగా మార్చి 9 ఒక చారిత్రాత్మక దినం. ఇది నిరుద్యోగులకు ఒక శుభదినంగా చెప్పవచ్చు. బుధవారం సరిగ్గా ఉదయం 10 గంటలకు టీవీల ముందు నిరుద్యోగ యువత, వారి తల్లిదండ్రులు, కాంట్రాక్టు ఉద్యోగులు.. ఇలా అందరూ కూర్చుండి సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించారు. సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయగానే నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వీరంతా హర్షం వ్యక్తం చేస్తూ జిల్లావ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచుతూ సంబురాల్లో మునిగిపోయారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగల భర్తీకి ప్రకటన వెలువడలేదని విద్యావేత్తలు, మేధావులు అంటున్నారు. మొన్నటి వరకు 310 జీవో మీద రాద్ధాంతం చేసిన ప్రతిపక్షాల విమర్శలకు సీఎం కేసీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
ఇక వయో పరిమితి దాటిన వాళ్లకు సైతం సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఓసీలకు 44 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు 49 ఏండ్లకు వయోపరిమితిని పెంచడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏండ్లనుంచి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధ్దీకరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో వారంతా సంబురాల్లో మునిగితేలారు. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
ఇక నుంచి కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ జూనియర కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు సిద్దిపేట జిల్లాలో 172, మెదక్ జిల్లాలో 126, సంగారెడ్డి జిల్లాలో 133 మంది, మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో 431 మంది పనిచేస్తున్నారు. వీరు కాకుండా వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తూ జిల్లావ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు.
స్థానిక అభ్యర్థులు తమ సొంత జిల్లా, జోన్ , మల్టీ జోన్లలో 95శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాకుండా ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలో 5 శాతం ఓపెన్ కోటాలో ఉద్యోగాలకు పోటీపడే అవకాశం ఉంది. స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా కేడర్ పోస్టులకు తమజోన్లోని క్యాడర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు. సీఎం కేసీఆర్ కృషితో ప్రభుత్వ ఉద్యోగాల్లో దిగువ స్థాయి క్యాడర్ నుంచి ఉన్నత స్థాయి వరకు (అటెండర్ నుంచి ఆర్డీవో దాకా) స్థానిక అభ్యర్థులకు 95శాతం రిజర్వేషన్ అమలు కావడంపై స్థానిక నిరుద్యోగ యువత , వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ విజయం అని చెప్పవచ్చును. కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ శాతం పెరగడమే కాకుండా స్థానిక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా బాగా పెరిగింది. గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీవో, సీటీవో, ఆర్టీవో, డిస్ట్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితర గ్రూప్-1 ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఇవన్నీ లోకల్ రిజర్వేషన్ పరిధిలోకి తీసుకువచ్చారు.
ఏ జిల్లాలో ఎన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేస్తున్నామో బుధవారం శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలో 1,178 పోస్టులు, మెదక్ జిల్లాలో 1,149 పోస్టులు, సంగారెడ్డి జిల్లాలో 1,243 పోస్టులు, మొత్తం ఉమ్మడి జిల్లాలో 3,570 ఉద్యోగాల భర్త్తీకి నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. వీటితో పాటు జోన్ పోస్టుల్లో జిల్లా వాళ్లు పోటీపడవచ్చు. రాజన్న జోన్ -3లో సిద్దిపేట, మెదక్ జిల్లాలు వస్తాయి. ఈ జోన్ పరిధిలో 2,403 ఉద్యోగాలకు, చార్మినార్ జోన్-6లో సంగారెడ్డి జిల్లా వస్తుంది. దీనికింద 5,297 పోస్టులకు నోటిఫికేసన్ను ప్రభుత్వం వెలువరించింది. ఇవి కాకుండా మల్టీ జోన్ పరిధిలోకి వచ్చే పోస్టులను చూస్తే… మల్టీ జోన్ -1లో 6,800, మల్టీజోన్ -2 పరిధిలో 6,370, మొత్తం 13,170 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. దీంతో మల్టీజోన్ -1లో సిద్దిపేట, మెదక్ జిల్లా వాళ్లు, మల్టీజోన్-2లో సంగారెడ్డి జల్లా అభ్యర్థులు పోటీపడవచ్చు.
ఏటా ఉద్యోగాల ఖాళీలను భర్త్తీ చేసేందకు ఉద్యోగ క్యాలెండర్ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ భర్తీ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం ఖాళీలను సిద్ధ్దం చేస్తారు. ఏ ఏటా ఖాళీలను ఆ ఏడాది నోటిఫికేషన్ల జారీకోసం నియామక సంస్థలకు సమాచారం ఇవ్వనున్నారు. నిరుద్యోగులు అన్ని నియామక పరీక్షలో పోటీపడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్ష నియామకాల్లో పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియమాకాల్లో గరిష్ట వయో పరిమితిని పదేండ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వేలాది నిరుద్యోగులుగా వరంగా మారింది. వయో పరిమితి కోల్పోయిన వారందరికి 10 ఏండ్లు పొడిగించడంతో వారందరికీ అవకాశం లభించింది. ఓసీలకు 44, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లకు, దివ్యాంగులకు 54 ఏండ్లకు గరిష్ట వయోపరిమితి అవకాశం లభిస్తుంది.
కొత్త జోనల్ వ్యవస్థ విధానంతో పాత వ్యవస్థ పూర్తిగా రద్దయింది. ఇన్నాళ్లు ఉన్న జోనల్ వ్యవస్థ ద్వారా జిల్లానుంచి రాష్ట్రస్థాయి కేడర్ వరకు స్థానికేతరులు భారీగా పోస్టులు తన్నుకొని పోయేవారు.ఇది వరకు ఉన్న విధానం ప్రకారం చూస్తే జిల్లా కేడర్లో 80:20, ఉండేది. అంటే వంద పోస్టులు పడితే, అందులో 80 పోస్టులు స్థానికులకు, 20పోస్టులు స్థానికేతర రిజర్వేషన్లగా పరిగణించి భర్తీచేసే వారు. అలాగే జోనల్ కేడర్లో 70:30 శాతం, బహుళ జోన్లో 60:40 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కొత్త విధానం ద్వారా ఈ వ్యవస్థ పూర్తిగా మారిపోయి స్థానికులకు ప్రయోజనం కలుగుతుంది. జిల్లా, జోనల్, బహుళ జోన్ పరిధిలో జరిగే ప్రత్యక్ష నియామకాల్లో 95శాతం పోస్టులు స్థానికులకే దక్కుతాయి. ఆ లెక్కన గతంలో జరిగిన భర్తీ విధానంతో పోల్చి చూస్తే జిల్లా స్థాయి పోస్టుల్లో అదనంగా 15శాతం పోస్టులు స్థానికులకు దక్కుతాయి.అలాగే జోనల్ కేడర్లో 25శాతం, బహుళ జోన్ పరిధిలో 35 శాతం పోస్టులు స్థానికులకు దక్కనున్నాయి. జిల్లా, జోనల్, బహుళ జోన్ పరిధిలో కేవలం ఐదుశాతం మాత్రమే స్థానికేతర రిజర్వేషన్లు ఉంటాయి. ఇందులోనూ మన స్థానిక నిరుద్యోగులు పోటీ పడవచ్చు.
1) మల్టీజోన్ -1, జోన్ -3 రాజన్నలో : కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు
2) మల్టీజోన్ -2, జోన్-6 చార్మినార్లో : మేడ్చల్- మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇంత భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ప్రకటన చేయడం చారిత్రాత్మక ఘట్టం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 1,33,942 ఉద్యోగాలను భర్తీ చేశారు. నూతనంగా 80,039 ఉద్యోగాల నోటిఫికేషన్కు ప్రకటన జారీ చేసి, 11,139 కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేశారు. జిల్లా స్థాయిలో నియమించే ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకు ఇవ్వాలని నిర్ణయించారు.
-సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి
సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇవ్వడం చాలా సంతోషకరం. నేను గత 14 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్గా పని చేస్తున్నాను. ప్రస్తుతం శివ్వంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోధిస్తున్నా. సీఎం కేసీఆర్ రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇవ్వడంతో నా కల నెరవేరింది. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
-పోతరాజు కరుణాకర్, కాంట్రాక్ట్ లెక్చరర్
ఉద్యోగాలు భర్తీ ప్రకటన హర్షణీయం. నేను ఎంఏ.బీఈడీ చదివాను. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు కేసీఆర్ సార్ ఉద్యోగం కోసం దరఖాస్తులు పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నాకు ఉద్యోగం వస్తే కష్టాలు తీరినట్టే. మాలాంటి ఎంతో మందికి ఇది శుభవార్త. టీఆర్ఎస్ హయాంలోనే ఉద్యోగ భద్రత లభి స్తుంది.ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాం.
-ఎం.మంజుల, గిరిజన తండా రామాయంపేట
నిరుద్యోగ యువతీ, యువకులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తీపి కబురు అందించారు. ప్రభుత్వ శాఖల్లో పెద్దఎత్తున్న ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. వయోపరిమితిని కూడా పదేండ్లకు పెంచడం నిరుద్యోగులకు వరం.
-శరణయ్యస్వామి, ఉపసర్పంచ్, మామిడ్గి, న్యాల్కల్ మండలం
రాష్ట్రంలో ఎనభైవేల ఉద్యోగాల కోసం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివిన యువతీ, యువకులు సీఎం కేసీఆర్ ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. వయోపరిమితి పెంచడం శుభపరిణామం. 95 శాతం స్థానిక యువతకు ఉద్యోగాలు రానుండడంతో యువత తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్కు జేజేలు పలుకుతున్నారు.
-సప్పటి మహేశ్, బొంతపల్లి, గుమ్మడిదల మండలం