అమీన్పూర్, అక్టోబర్ 9: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 24 కాలనీల్లో ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన రక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, రూ.100 కోట్లతో 10 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో 5 భారీ రిజర్వాయర్లు నిర్మించడం జరిగిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పీజేఆర్ కాలనీ, బీరంగూడ గుట్టపై రూ.22 కోట్లతో నిర్మించిన 3 రిజర్వాయర్లను ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం చక్రపురి కాలనీలో రూ.5 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు, బందం కొమ్ము నుంచి అమీన్పూర్ వరకు రహదారి విస్తరణలో భాగంగా రూ.4.80 లక్షల హెచ్ఎండీఏ నిధులతో చేపడుతున్న విద్యుత్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వాణీ నగర్లో రూ.80 లక్షలతో చేపట్టనున్న యూజీడీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథ మహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకు సీఎ కేసీఆర్ అపర భగీరథుడయ్యారన్నారు. ఉమ్మడి పాలకుల పాలనలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో బిందెడు తాగునీటి కోసం వేల రూపాయలను ఖర్చు చేసి, ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసే పరిస్థితులు ఉండేవని గుర్తుకు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం అమీన్పూర్ మున్సిపాలిటీని ఏర్పాటు చేయడంతోపాటు తాగునీటి సమస్య పరిష్కారానికి మున్సిపల్ వ్యాప్తంగా 5 భారీ రిజర్వాయర్లు నిర్మించి ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కిందన్నారు. దేశంలోనే మొదటిసారిగా రూ.43,91 కోట్ల బడ్జెట్తో రూ.1.30 లక్షల కిలోమీటర్ల పైప్లైన్ సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ మహత్తర పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా హెచ్ఎండబ్ల్యూఎస్, గ్రామీణ నీటి పారుదల శాఖ విభాగాల ద్వారా ప్రతి ఇంటికీ, పాఠశాలలు, కళాశాలలకు కూడా తాగునీరు అందిస్తున్నామన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తాగునీటి పైప్లైన్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.
ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించాలన్న లక్ష్యంతో చక్రపురి కాలనీలో రూ.5 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయితే సుమారు 20 కాలనీలకు పైగా ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అమీన్పూర్ చెరువు కట్ట నుంచి బందం కొమ్ము మీదుగా చందానగర్ వరకు రహదారిని ప్రభుత్వం విస్తరిస్తుందని, ఇందు కు అనుగుణంగా విద్యుత్ పనుల కోసం ప్రభుత్వం ఇటీవల హెచ్ఏడీఎం నుంచి సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, సం క్షేమం, అభివృద్ధి మరింత ముందుకు కొనసాగాలం టే బీఆర్ఎస్కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం బీరంగూడ గోశాల ఎదుట విద్యాభారతి సంస్థ ఆధ్వర్యంలో సరస్వతీ విద్యాపీఠం పాఠశాల భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశా రు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాం డురంగారెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, విద్యుత్శాఖ డీఈ రమేశ్చంద్ర, హెచ్ఎండబ్ల్యూఎస్ సీజీఎం శ్రీధర్, జీఎం నారాయణ, బీఆర్ఎస్ నాయకుడు బాల్రెడ్డి, సీనియర్ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.