కంది, జూన్ 19: తెలంగాణలో అమలుచేస్తున్న ప్రతి పథకంతో మంచి ఫలితాలు, అద్భుతాలు సాధించడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని టీఎస్ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. బృహత్తరమైన హరితహారం పథకంతో పచ్చదనం, అటవి సంపద పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కంది మండలం చేర్యాల్ గ్రామ శివారులో హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, పలు శాఖల అధికారులు, బీఆర్ఎస్ నాయకులతో కలిని చింతా ప్రభాకర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్టుతో ప్రతిఒక్కరికీ రుణానుబంధం ఉన్నదని, ఆక్సిజన్ ఇచ్చి ఆరోగ్యాలను కాపాడేది చెట్లేనని గుర్తుచేశారు. నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదన్నారు. హరితహారంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 8.70 కోట్ల మొక్కలు నాటారన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
పచ్చదనంతో ఆహ్లాదం: కలెక్టర్ శరత్
దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉన్నదని కలెక్టర్ శరత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితులు, వచ్చిన తర్వాత పరిస్థితులు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదన్నారు. నాడు హరితహారం లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కల్యాణలక్ష్మి లేదన్నారు. ప్రైవేట్ నర్సరీలు మాత్రమే ఉండేవని, అక్కడే మొక్కలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. జిల్లాలోని 647 పంచాయతీల్లో ప్రభుత్వ నర్సరీలు, 747 గ్రా మాల్లో పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. నాటిన మొక్కలు చెట్లై, రోడ్లకు ఇరువైపులా పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయన్నారు. హ రితోత్సవంలో భాగంగా సంగారెడ్డి జిల్లా లో 10 లక్షల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకున్నామని, మూడు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. చేర్యాల్లో 6వేల మొక్క లు నాటామని, వాటిని పరిరక్షించాలని సూచించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ సరళా పుల్లారెడ్డి, జడ్పీటీసీ కొండల్రెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ కంది మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, నాయకులు చేర్యాల ప్రభాకర్, విజయేందర్రెడ్డి, సర్పంచ్ శ్రవణ్కుమార్, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎఫ్వో శ్రీధర్, ఆర్డీవో రవీందర్రెడ్డి, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో విశ్వప్రసాద్, ఎంపీవో మహేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుదీర్రెడ్డి పాల్గొన్నారు.