సంగారెడ్డి, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ సోమ, మంగళవారాల్లో రెండురోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి భారీ కాన్వాయ్తో షోలాపూర్ బయలుదేరుతారు. ఇదే క్రమంలో పటాన్చెరు, సంగారెడ్డి, కంకోల్, జహీరాబాద్ మీదుగా వెళ్తారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పెద్దసంఖ్యలో వెళ్లనున్నారు. ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు, జిల్లా ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మహిపాల్రెడ్డి, భూపాల్రెడ్డి, మాణిక్రావు తదితరులు షోలాపూర్ సభకు తరలివెళ్లనున్నారు. సభ అనంతరం సీఎం కేసీఆర్ మంగళవారం మహారాష్ట్రలోని ప్రసిద్ధ దేవాలయాలు పండరీపూర్లోని విఠోబారుక్మిణి ఆలయం, తుల్జాపూర్లోని భవానీమాత ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేయనున్నారు.
సోమవారం సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా మీదుగా షోలాపూర్ వెళ్లనున్న నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులు జాతీయ రహదారి 65పై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో 100 కిలోమీటర్లకుపైగా సీఎం కేసీఆర్ కాన్వాయ్ ప్రయాణించనున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు జాతీయ రహదారికి ఇరువైపులా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తూ, సీఎం వాహనాలు వెళ్లే సమయంలో ట్రాఫిక్ నియంత్రించనున్నారు. జిల్లా ఎస్పీ రమణకుమార్ స్వయంగా బందోబస్తును పర్యవేక్షించారు. బందోబస్తులో సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్ డీఎస్పీలతో పాటు 20 మంది సీఐలు, 50 మంది ఎస్లు, 200 మంది, మొత్తం 300 మందికిపైగా పోలీసు సిబ్బంది పాల్గొనున్నారు.
సీఎం కేసీఆర్కు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారా సంగారెడ్డి జిల్లా నుంచి షోలాపూర్ వెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పటాన్చెరు నుంచి రాష్ట్ర సరిహద్దులోని చెరక్పల్లి వరకు జాతీయరహదారిపై కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, చంటి క్రాంతికిరణ్, మాణిక్రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ సోమవారం ఉదయం 11 గంటలకు గణేశ్గడ్డ వద్ద సీఎం కేసీఆర్కు స్వాగతం పలకనున్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సీఎంకు స్వాగతం పలికే కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు.