అప్పుడెట్లుండే…
సమైక్య రాష్ట్రంలో ఏరోడ్డు మీద ప్రయాణమైనా నరకయాతన తప్పలేదు. అడుగడుగునా గుంతలు.. తారులేచిన రోడ్లు.. సింగిల్ రోడ్లతో నిత్యం ప్రమాదాలు.. లింక్ రోడ్లు లేక దూరభారం.. వాన కురిసి వాగులకు వరదలొస్తే నిలిచిపోయే రాకపోకలు. పల్లె నుంచి పట్నం పోవాలన్నా, పట్నం నుంచి రాజధానికి రాకపోకలు సాగాలన్నా గంటల కొద్దీ సమయం పట్టేది. ఆపత్కాలంలో త్వరగా దవాఖానకు పోవడానికి సౌలత్ లేక ఎన్ని ప్రాణాలు గాలిలో కలిశాయో ఆ భగవంతుడికే ఎరుక. ఇక అగ్నిప్రమాదాలు జరిగిన చోటుకు అధ్వాన రోడ్ల కారణంగా సకాలంలో ఫైరింజన్ రాలేక జరిగిన నష్టం అంతా ఇంత కాదు.
ఇప్పుడెట్లున్నది…
నేడు స్వరాష్ట్రంలో రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. పల్లెపల్లెకూ బీటీ రోడ్డు సౌకర్యం కలిగింది. సింగిల్ రోడ్లు డబుల్గా మారినయి. లింక్ రోడ్లు, వంతెనల నిర్మాణంతో వెతలు తీరాయి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లు, రెండు వరుసల రోడ్లు నాలుగు లేన్లుగా మారాయి. డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, ఆహ్లాదం కలిగించే మొక్కలు కనిపిస్తున్నాయి. ఏ రూట్లో చూసినా ప్రయాణ సమయం బాగా తగ్గింది. జర్నీ సాఫీగా సాగుతున్నది. రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. గతంలో 40కి మించి స్పీడ్తో వెళ్లడానికి అనువుగా లేని రోడ్లు.. నేడు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా అభివృద్ధి చెందాయి.
ఏండ్లనాటి ‘దారి’ద్య్రం తొలగిపోయింది. తరబడి గతుకులు, అతుకుల దారులతో కష్టాలు పడ్డ రోజులకు రాష్ట్ర ప్రభుత్వం చరమగీతం పాడింది. ఉమ్మడి రాష్ట్రంలో రహదారుల నిర్మాణాలకు పట్టిన శని స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వదిలించారు. ఇప్పుడు రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో ఫోర్లేన్, మండల కేంద్రాల్లో డబుల్ రోడ్లను నిర్మించిన బీఆర్ఎస్ ప్రభుత్వం వాటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణానికి ఎక్కడా ఆటంకాలు కలుగకుండా, వాహనాలు మైలేజీ ఎక్కువ వచ్చేలా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వాహనాల్లో స్పీడ్ మెరుగడంతోపాటు ప్రయాణికల వృథా సమయం తగ్గింది. మెరుగైన రవాణా వ్యవస్థతో అత్యవసర అన్ని రంగాలకు ఎంతో తోడ్పాటు లభిస్తున్నది.
సంగారెడ్డి, మే 17 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో రహదారుల విస్తరణ, అభివృద్ధి ఫలితంగా వాహనాల ప్రయాణ వేగం ఊహించని విధంగా పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి నుంచి సంగారెడ్డి మీదుగా హైదరాబాద్కు చేరుకోవాలంటే 5 గంటలకు పైగా సమయం పట్టేది. ప్రస్తుతం 4 గంటల్లో చేరుకోగలుగుతున్నారు. ఈ రూట్లో వాహనాల వేగం 60 నుంచి 80 కిలోమీటర్లకు పెరిగింది. ఫలితంగా త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడంతో పాటు మైలేజ్ కలిసి వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి నియోజకవర్గ కేంద్రాలకు కొత్త రహదారులు, బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మించింది. జిల్లాలోని ప్రధాన రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానం చేసింది. ఫలితంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి, రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు వాహనదారులు వేగంగా వెళ్లగలుగుతున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి 66.85 కోట్లతో రహదారుల విస్తరణ, మరమ్మతులు చేపట్టింది. సింగిల్ రోడ్లను డబుల్ లేన్గా అభివృద్ధి చేసింది. రూ.76.45 కోట్లతో ప్రభుత్వం డబుల్ లేన్ రోడ్ల నిర్మాణం చేపట్టింది. రూ.69.24 కోట్లతో 42 అవసరమైన చోట హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టింది.
ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలోని రహదారులను పట్టించుకున్న వారు లేరు. దీంతో రోడ్లు గుంతలు పడి వాహనదారులు, ప్రయాణికులకు నరకం కనిపించేంది. గమ్యం చేరుకునేందుకు గంటల సమయం పట్టేది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సంగారెడ్డి జిల్లాలో రూ.300 కోట్లకుపైగా నిధులతో రహదారులను నిర్మించారు. సంగారెడ్డి జిల్లా గుండా 65వ నెంబరు హైవే లింగంపల్లి నుంచి బీదర్ వరకు వెళ్తున్నది. హైవే 161 నాందేడ్-అకోలా జాతీయ రహదారి ఉంది. ఈ రెండు హైవేలను కలిపేలా రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత రహదారులను నిర్మించింది. జాతీయ రహదారుల శాఖ నుంచి రాష్ట్ర ఆర్అండ్బీకి బదిలీ అయిన కంది-శంకర్పల్లి రహదారిని రాష్ట్ర ప్రభుత్వం రూ.52.92 కోట్లతో విస్తరించింది. దీంతో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్తున్నాయి. జహీరాబాద్-బీదర్ వరకు 15 కిలోమీటర్ల రహదారిని ప్రభుత్వం రూ.2.69 కోట్లతో అభివృద్ధి చేసింది. అల్లాదుర్గం-బీదర్ వెళ్లే 26 కిలోమీటర్ల రహదారిని ప్రభుత్వం రూ.9.78 కోట్లతో కొత్తగా బీటీ వేయడంతో పాటు మరమ్మతులు చేపట్టింది. పటాన్రు నియోజకవర్గంలో ఐడీఏ పాశమైలారం నుంచి రింగ్రోడ్డును కలిపేలా ప్రభుత్వం రూ.25 కోట్లతో నాలుగులేన్ల రహదారిని నిర్మించింది. దీంతో ఆయా రహదారులపై వాహనాల వేగం పెరిగి ప్రయాణికులు తక్కువ సమయంలో తమ గమ్యస్థానం చేరుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న కంది-శంకర్పల్లి రోడ్డు తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఫోర్లైన్గా మారింది. గతంలో సింగిల్ రోడ్డు, అడుగడుగునా గుంతలతో ప్రయాణం గంటకు పైగానే సమయం పట్టేది. ప్రస్తుతం 35 నిమిషాల్లో ప్రయాణం ముగుస్తున్నది. ఈ రోడ్డుపై గతంలో 40కి మించి వేగంగా వెళ్తే, ఇప్పుడు 80 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్తో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
రూ.70 కోట్లతో ఫోర్లైన్ రోడ్డు నిర్మాణం..
రాష్ట్ర ప్రభుత్వం 2018లో రూ.70 కోట్లతో కంది-ఎద్దుమైలారం శివారు వరకు ఆర్అండ్బీ ఆధ్వర్యంలో 12.5 కిలోమీటర్ల ఫోర్లైన్ రోడ్డు నిర్మించింది, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. దీంతో ప్రజలకు ఈ రహదారి సౌకర్యవంతంగా మారింది. శంకర్పల్లి, హైదరాబాద్, చేవెళ్ల, షాద్నగర్ నుంచి నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి.
జహీరాబాద్, మే 17: తెలంగాణ రాష్ట్రం వచ్చాక రోడ్లు అభివృద్ధి చెందాయి. రాష్ట్ర ప్రభుత్వం జహీరాబాద్ నుంచి కర్ణాటకలోని చించోళి రోడ్డును రెండు లైన్లుగా అభివృద్ధి చేసింది. జహీరాబాద్-తాండూరు రోడ్డును రెండు వరుసలుగా నిర్మాణం చేసి రవాణా సౌకర్యం మెరుగు పరించింది. మెంటల్కుంట-అల్లాదుర్గం రోడ్డు నుంచి ముంగి చౌరస్తా నుంచి న్యాల్కల్ మండల కేంద్రానికి రెండు లేన్ల రహదారి నిర్మాణం పూర్తయ్యింది. కోహీర్, ఝరాసంగం మండల కేంద్రాలకు రెండు లేన్ల రహదారి నిర్మాణం చేయడంతో ప్రయాణంగా వేగవంతమైంది.
మొగుడంపల్లి-జహీరాబాద్కు మెరుగైన రోడ్డు..
జహీరాబాద్ నుంచి మొగుడంపల్లి చించోళి రోడ్డును రెండు వరుసలుగా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. గతంలో సింగిల్గా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదురుగా వాహనాలు వస్తే రోడ్డు దిగేందుకు డ్రైవర్లు ఇబ్బంది పడి ఘర్షణ పడిన సంఘటనలున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జహీరాబాద్ నుంచి మొగుడంపల్లి-చించోళి రోడ్డును కర్ణాటక సరిహద్దు వరకు రెండు లేన్లుగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయగలుగుతున్నారు.
ముంగి చౌరస్తా నుంచి న్యాల్కల్ వరకు..
ముంగి చౌరస్తా నుంచి న్యాల్కల్ వరకు ప్రయాణం చేయాలంటే డ్రైవర్లు చుక్కలు చూసేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రెండు వరులస రోడ్డు నిర్మించి అందుబాటులోకి తీసుకురావడంతో తక్కువ సమయంలో రాకపోకలు సాగిస్తున్నారు.
లింక్ రోడ్ల నిర్మాణం..
సంగారెడ్డి జిల్లాలో 65వ జాతీయ రహదారి నుంచి బుర్థిపాడు చౌరస్తా నుంచి తూంకుంట, బుర్థిపాడు, కొత్తూర్(బి)కి వెళ్లేందుకు లింక్ రోడ్డు, తూంకుంట శివారులో వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తిచేసింది. భారీ వర్షాలు పడితే వాగుపై రాకపోకలు నిలిచిపోయేవి. బ్రిడ్జి నిర్మాణంతో ఇప్పుడు ఆ బాధలు లేవు. బుర్థిపాడు, కొత్తూర్(బి) రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం చేయడంతో దూరం తగ్గింది.
గతంలో శంకర్పల్లికి గంట పట్టేది..
ఫోర్లైన్ నిర్మాణంతో రోడ్డు సౌకర్యవంతంగా ఉంది. గతంలో సంగారెడ్డి నుంచి శంకర్పల్లి వెళ్లాలంటే గంటకు పైగా సమయం పట్టేది. బస్సు నడపాలంటేనే నరకం కనిపించేంది. ప్రస్తుతం 35 నిమిషాల్లో సులభంగా ప్రయాణికులను చేరవేస్తున్నాం. ఫోర్లైన్ రహదారి నిర్మాణంతో అరగంటకో బస్సు నడుస్తున్నది. ఎక్కువ సార్లు గేర్లు మార్చడం, క్లచ్ తొక్కడం వంటి ఇబ్బంది లేకుండా పోయింది.
– చెన్నయ్య, ఆర్టీసీ డ్రైవర్ సంగారెడ్డి
తెలంగాణ వచ్చినంకనే రోడ్లు బాగైనయి..
గతంలో ఈ రోడ్డుపై ఆటో నడపాలంటే నరకయాతన పడ్డాం. గుంతల రోడ్డుతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవారు. 20 ఏండ్లుగా ఆటో నడుపుతున్నా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోడ్లన్నీ బాగుపడ్డాయి. ఫోర్లైన్ రహదారితో మంచి జీవనోపాధి, ఆటో రిపేరింగ్లు తగ్గి మైలేజ్ సైతం పెరిగింది.
– సీహెచ్ రవి, ఆటోడ్రైవర్ సంగారెడ్డి
వేగంగా రాకపోకలు..
ఫోర్లైన్ రహదారి నిర్మాణంతో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంది. విశాలమైన రహదారితో వేగంగా ప్రయాణం సాగుతున్నది. ఈ దారిలో ప్రయాణం చేస్తే విదేశాల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రహదారులు అభివృద్ధి చెందాయి.
– రాము, వాహనదారుడు సంగారెడ్డి
జల్ది వెళ్లగలుగుతున్నాం..
జహీరాబాద్ నుంచి మొగుడంపల్లి వెళ్లేందుకు గతంలో ఇబ్బందులు పడేవాళ్లం. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక రోడ్డును రెండు వరుసలుగా ప్రభుత్వం డెవలప్ చేసింది. దీంతో తక్కువ సమయంలో, డ్రైవింగ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకుంటున్నాం. సీఎం కేసీఆర్ గ్రామీణ రోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఇప్పుడు రోడ్లు అద్దంలా మారాయి.
– ఈశ్వర్రెడ్డి, మన్నాపూర్ సర్పంచ్, మొగుడంపల్లి మండలం