కులవృత్తులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలోని వయోలా గార్డెన్లో బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆదివారం కులవృత్తుల ప్రోత్సాహం కోసం రూ. లక్ష గ్రాంట్ చెకుల పంపిణీకి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని 300 మంది లబ్ధిదారులకు చెకులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల్లో బ్యాంకు లింకేజీ పేరిట బీసీలు ఇబ్బందులు పడ్డారన్నారు. ఇవ్వాళ సీఎం కేసీఆర్ షరతులు, డాక్యుమెంట్స్ లేకుండా నేరుగా గ్రాంట్ రూపంలో రూ.లక్ష అందిస్తున్నారని చెప్పారు. అన్నివర్గాలను అభివృద్ధి పర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని గుర్తుచేశారు. రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
– సిద్దిపేట, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వివిధ కుల వృత్తులను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేసి వృత్తిపైన ఆధారపడిన వారందరికీ ప్రోత్సాహకంగా లక్ష రూపాయలను అందించడం జరుగుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఇది నిరంతర ప్రక్రియ, దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తామన్నారు. స్వయం ఉపాధి పొందేలా సీఎం కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వయోలా గార్డెన్లో ఆదివారం బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కులవృత్తులను ప్రోత్సాహం కోసం లక్ష రూపాయల గ్రాంట్ చెకుల పంపిణీకి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని 300 మంది లబ్ధిదారులకు చెకులను జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సుడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ… గత ప్రభుత్వాలు బ్యాంకు లింకేజీ పేరిట బీసీలకు ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ ,బ్యాంకు 40 శాతం, బ్యాంకు 40 శాతం ఉంటే ప్రభుత్వం 60 శాతం పెడుతూ బ్యాంకు కాన్సెప్ట్ తదితర కొర్రీలతో ఎన్నో లింకులు ఉండేవన్నారు. ఆ రుణాల కోసం షూరిటీ కావాలని తిరిగి తిరిగి చెప్పులరిగేవన్నారు. అయినప్పటికీ లోన్ వచ్చేది కాదన్నారు.
ఇవ్వాళ మన సీఎం కేసీఆర్ ఇవేమి షరతులు, డాక్యుమెంట్స్ లేకుండా నేరుగా గ్రాంట్ రూపంలో లక్ష రూపాయలు మీకు అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను, అన్ని విధాలుగా అభివృద్ధి పర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న విశ్వబ్రాహ్మణులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గీత కార్మికులకు లైసెన్స్ ఆటో రెన్యువల్ సిస్టం తీసుకొచ్చామని, అలాగే వైన్స్లో రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. సిద్దిపేట మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు చేపలు ఎగుమతి చేసేంతగా మత్స్య సంపద పెరిగిందని, చాలా సంతోషంగా ఉన్నదన్నారు. లారీల కొద్దీ చేపలు, రొయ్యలు ఆంధ్రా విజయవాడ, పశ్చిమ బెంగాల్, కలకత్తా, మహారాష్ట్ర, చందలాపూర్, హైదరాబాద్ తదితర ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 300 బీసీ రెసిడెన్షియల్ హాస్టళ్లు వచ్చాయని, వారం రోజుల్లో సిద్దిపేటకు డిగ్రీ బీసీ రెసిడెన్షియల్ తేబోతున్నట్లు చెప్పారు. యాదవ, కుర్మ కులస్తులకు గొర్రెల యూనిట్లు అందించి తెలంగాణ ప్రభుత్వం వారి కులవృత్తిని ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. దసరా, బతుకమ్మ పండుగ చేనేత చీరలు అందరికీ అందించి చేనేత వృత్తికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. అన్ని కులాల్లో అర్హులైన వారందరికీ దశల వారీగా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, పారదర్శకంగా ఈ పథకానికి అర్హులను ఎంపిక చేశామని, ప్రభుత్వం అందించే లక్ష రూపాయల గ్రాంట్ స్వయం ఉపాధి కోసం వినియోగించి ఆర్థికంగా ఎదగాలని మంత్రి చెప్పారు.
“సీఎం కేసీఆర్ అందించిన లక్ష రూపాయలను సద్వినియోగం చేసుకోండి..ఇది బతుకుదెరువు, ఉపాధి కోసం ఇచ్చింది. ఏదో ఒక పని పెట్టుకొని ఆపనిలో రాణించాలి.మీరు పెట్టిన షాపును ఫొటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఇటి డబ్బులను పుట్నాలకో, ప్యాలాలకో, దాబాకో కాదు ..దండం పెడతా దయచేసి ఏదో ఒకటి మీకు తోచినది..మీకు నచ్చిన పని, నచ్చిన చోట పెట్టుకోండని” మంత్రి హరీశ్రావు కోరారు.గ్రామం, పట్టణం ఎక్కడైనా పెట్టుకొని పని చేసుకోండి. మీరు ఒక మెట్టు ఎక్కడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేయూత ఇవ్వాలని ఈ ఆర్థిక సాయం అందిస్తున్నారని చెప్పారు. మీరు దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కులవృత్తి పై ఆధారపడిన అన్ని కులాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మీ దీవెనలు, ఆశీర్వాదాలు కావాలని మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు.
బీసీ రుణాల కోసం 21 వేల అప్లికేషన్లు
– సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
లక్ష రూపాయల రుణం కోసం బీసీల నుంచి సిద్దిపేట జిల్లాలో 21 వేల అప్లికేషన్స్ వచ్చాయని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రాధాన్యత ప్రకారం లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగిందన్నారు. డబ్బులు ఉట్టిగా రావంటూ ప్రభుత్వం కల్పించిన ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ కులవృత్తులను కాపాడుకోవాలని, మీ వ్యాపారం పెంచుకోవాలని లబ్ధిదారులను కలెక్టర్ కోరారు.