నారింజ వాగుపై చెక్డ్యాం
మహీంద్రా అండ్ మహీంద్రా సీఎస్ఆర్ నిధులతో బుచినెల్లి శివారులో నిర్మాణం
రూ.25 లక్షలతో భారీ చెక్డ్యాం .. జోరుగా పనులు
బుర్థిపాడు, బుచినెల్లి, సత్వార్, చెరాగ్పల్లి శివారులో సర్వే
జహీరాబాద్, మే13: ప్రతి నీటి చుక్కను నిల్వ చేసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం చెక్డ్యాంలు నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా కర్ణాటక సరిహద్దులోని బుచినెల్లి శివారులో నారింజ వాగుపై భారీ చెక్డ్యాం నిర్మాణానికి పునాదులు పడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ‘సీఎస్ఆర్’ నిధులతో రూ.25 లక్షలతో చెక్డ్యాంను నిర్మిస్తున్నారు. నారింజ వాగుపై చెక్డ్యాంలు లేకపోవడంతో వరద నీరు వృథాగా కర్ణాటక వైపు పరుగులు తీస్తున్నది. బుర్థిపాడు, బుచినెల్లి, సత్వార్, చెరాగ్పల్లి శివారులోని నారింజ వాగుపై భారీ చెక్డ్యాంలు నిర్మిస్తే బొట్టుబొట్టును ఒడిసి పట్టేందుకు అవకాశం ఉంటుందని భావించి, నీటివనరుల శాఖ సర్వే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. నిధులు మంజూరు కాగానే పనులు చేసేందుకు సర్వే చేసి సిద్ధం చేశారు.
భారీ చెక్డ్యాం నిర్మాణం
బుచినెల్లి శివారులోని కర్ణాటక సరిహద్దులో వరద నీటిని నిల్వ చేసేందుకు రోడ్డు ప్రక్కన చెక్డ్యాం నిర్మాణం చేస్తున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా సీఎస్ఆర్ నిధులతో రూ.25 లక్షలతో భారీ చెక్డ్యాంను నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల పర్యవేక్షణ ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. చెక్డ్యాం నిర్మాణంతో బోర్లు, బావుల్లో భారీగా నీటి మట్టిం పెరిగే అవకాశం ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది భారీ వర్షాలు పడితే జహీరాబాద్, కోహీర్ వైపు నుంచి వచ్చే వరద నీరు వృథాగా కర్ణాటకలోని కరెంజ్లో చేరుతున్నది. దీంతో వరద నీటిని నిల్వ చేసి వ్యవసాయనికి మేలు చేసేందుకు సర్కారు కృషి చేస్తున్నది.
3 టీఎంసీల వరదనీరు..
ప్రతి ఏడాది నారింజ వాగు నుంచి 3 టీఎంసీల వరద నీరు కర్ణాటక వైపు వెళ్తున్నదని నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారు. కనీసం 2 టీఎంసీల నీటిని చెక్డ్యాంల ద్వారా నిల్వ చేసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వరద నీటిని నిల్వ చేయడంతో జహీరాబాద్, న్యాల్కల్ మండలాల్లోని కొత్తూర్, బుచినెల్లి, బుర్థిపాడు, సత్వార్, చెరాగ్పల్లి, తూంకుంట, మిర్జాపూర్(బి), మెటల్కుంటతో పాటు కర్ణాటకలోని పలు గ్రామాల రైతులకు మేలు కలుగుతుంది. మహీంద్రా అండ్ మహీంద్రా యాజమాన్యం రైతు సంక్షేమం కోసం సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేయడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.