మిరుదొడ్డి, జూలై 4: ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన వరి ధాన్యంలో సీఏ చేతి వాటం ప్రదర్శించింది. దీంతో 109 క్వింటాళ్ల వరి ధాన్యం మాయమైన సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాలలో చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామ రైతులు గ్రామ పంచాయతీ వద్ద శనివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా తడిసి మొలకెత్తిన, నల్లబడిన ధాన్యం పేరిట రైతులను భయబ్రాంతులకు గురి చేసి అధిక మొత్తంలో ధాన్యాన్ని సేకరించి రహస్యంగా దాచారన్నారు.
ముగ్గురు కౌలు రైతుల పేర్లను నమోదు చేసి చెప్యాల క్రాస్ రోడ్డులోని చందన రైస్ మిల్లులో బిల్లు చేయించారన్నారు. అనంతరం విక్రయించిన 109క్వింటాళ్ల 20 కిలోల ధాన్యానికి రూ.2,58 లక్షల వే బిల్లు రసీదులు అందినట్లు తెలిపా రు. తమకు సంబంధం లేని ధాన్యానికి వే బిల్లులు ఎలా ఇస్తారంటూ ఆయా కౌలు రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐకేసీ సీఏ చేతివాటం ప్రదర్శించడంతో ధాన్యం పక్కదారి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ట్రక్ షీట్లు ఏర్పాటు చేసిన ఐకేసీ సీఏ మానస 109 క్వింటాళ్ల వరి ధాన్యానికి చెందిన డబ్బులను స్వాహా చేసేందుకు ప్రయత్నించారని రైతులు ఆరోపించారు. నకిలీ ట్రక్ షీట్లు సృష్టించి ఆరుగాలం కష్టపడి పనిచేసిన రైతులను నిలువునా దోచుకున్నారని మండిపడ్డారు. రైతులను ముంచిన సీఏ మానసను కాపాడేందుకు కొందరు నాయకులు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కొన్నేండ్లుగా గ్రామంలో ఇదే తరహాలో దోపిడీ జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇదే విషయమై జిల్లా పీడీ జగదేవ్ఆర్యకు ఫోన్ ద్వారా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. పీడీ వెంటనే స్పందిస్తూ ఈ విషయం తన దృ ష్టికి వచ్చిందని, విచారణ చేసి బాధ్యు లపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మార్కెట్ డీపీఎం విద్యాసాగర్ మిరుదొడ్డి ఏపీఎం లక్ష్మీనర్సమ్మతో కలిసి అల్వాల గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు పూర్తి వివరాలు నివేదించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు వెల్లడించారు. రైతులకు న్యాయం జరిగే వరకు తాము ఆందోళన చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. బాధ్యులను విధుల నుంచి వెంటనే తొలిగించాలని డీపీఎం విద్యాసాగర్కు వినతి పత్రం అందజేశారు.