గృహోపకార గ్యాస్ సిలిండర్ ధరను రూ.50కి పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీరని భారం వేసిందని టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అందోళన వ్యక్తం చేశారు.గ్యాస్ ధరలకు నిరసనగా గురువారం సంగారెడ్డి జిల్లాకేంద్రంలో ప్రభుత్వ అతిథిగృహం నుంచి కొత్త బస్టాండ్ వరకు మోదీ శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళలు ప్లకార్డులతో ప్రధాని మోదీ డౌన్డౌన్ అంటూ భారీగా నినాదాలతో బస్టాండ్ ప్రాంతం రహదారిపై హోరెత్తించారు. రోడ్డుపై కట్టెల పొయ్యితో వంట చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, బీఆర్ఎస్ నాయకులు చింత సాయికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎనిదేండ్ల క్రితం.. అంటే 2014లో దేశంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంటే ప్రస్తుతం ఆ ధరలు మోదీ పాలనలో నాలుగు రెట్లు అధికమైందన్నారు. గత ఏడాదిలో పలుమార్లు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారన్నారు. కొత్త సంవత్సరం 2023 వచ్చి రెండు నెలలు గడవక ముందే రెండు సార్లు సిలిండర్ల ధరలు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం చమురు కంపెనీలతో లోపాయికార ఒప్పందమేనన్నారు. మూడు రాష్ర్టాల ఎన్నికలు ముగియగానే సిలిండర్ ధరలపై అస్త్రం ప్రయోగించారన్నారు. వాణిజ్య సిలిండర్పై రూ.350 పెంచి చిరు వ్యాపారాల జీవితాలను ఛిన్నాభిన్నం చేశారన్నారు. నిరసన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్పర్సన్ లత, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కంది ఎంపీపీ సరళ, సదాశివపేట వైస్ చైర్మన్ చింత గోపాల్, కౌన్సిలర్లు స్రవంతి, జీవీ వీణ, విజయలక్ష్మి, మంజులత, దిడ్డి విజయలక్ష్మి, ఉమామహేశ్వరి, వడ్ల మహేశ్వరి, ఇంద్రమోహన్గౌడ్, ఆకుల శివతోపాటు భారీసంఖ్యలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ సంస్థలన్నిటినీ అమ్ముతూ, ప్రైవేటీకరణ చేస్తూపోతే చివరికి దేశానికి మిగిలేది ఏముంటుందని… నీ పతనానికి నాంది అని ప్రధాని మోదీపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను పెంచినందుకు నిరసనగా పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మెదక్ జిల్లాకేంద్రంలోని పోస్టాఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ రాష్ట్రాలకు ఏదైనా ఇబ్బంది ఉంటే చేయూతనిచ్చేలా కేంద్రం ఉండాలన్నారు. కేంద్రం పేదల నడ్డి విరిచేలా గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఐసీ లాంటి సంస్థను ప్రైవేటీకరణ చేయడం ద్వారా 40 వేల ఉద్యోగాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ, అంబానీ కావాలా? వారు సంపాదించే సొమ్ములో వాటా కావాలా..? అంటూ మోదీని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. కేసీఆర్ రూ.2 వేల పెన్షన్ ఇస్తే దాంట్లో రూ.1200 గ్యాస్ సిలిండర్కు పోతున్నదని, దీంతో పేద ప్రజలకు ఇబ్బంది ఎదురవుతుందన్నారు. మోటార్ల కాడ మీటర్లు పెట్టకపోవడంతో 30 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఆపిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఎం.లావణ్య రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, బీఆర్ఎస్ హవేళీఘనపూర్ మండల అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు జయరాజ్, సమీయొద్దీన్, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఉమర్, పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, మెదక్, హవేళీఘనపూర్ మండల వైస్ ఎంపీపీలు ఆంజనేయులు, రాధాకృష్ణ కిషన్ యాదవ్, ఏఎంసీ డైరెక్టర్ సాప సాయిలు, నాయకులు రాగి అశోక్, ప్రభురెడ్డి, మధు, సతీశ్రావు, బాలయ్య, సుదర్శన్, మోహన్, సాయిలు, వెంకటేశ్, మహమ్మద్, సిద్దిరాములు, సర్పంచులు రాజేందర్ రెడ్డి, చిన్నాగౌడ్, యామిరెడ్డి, మహిళలు పాల్గొన్నారు.