జహీరాబాద్, ఆగస్టు 6: రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మౌలిక సదుపాయలు కల్పించి, మోడల్గా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేసినట్లు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. ఆదివారం జహీరాబాద్ రైల్వే స్టేషన్లో ‘అమృత్ భారత్ స్టేషన్’ పనులకు ప్రధానమంత్రి మోదీ వర్చుల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడారు. అమృత్ భారత్ స్టేషన్గా ఎంపిక చేసి రూ.24.4 కోట్లు కేంద్రం మంజూరు చేయడంపై ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆధునిక హంగులతో రైల్వేస్టేషన్ పెద్ద భవనం, షాపింగ్ కాంప్లెక్స్, విశాలమైన వెయిటింగ్ హాళ్లు, దూర ప్రాంత ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక గదులు నిర్మించనున్నట్లు చెప్పారు. ఆహ్లాదాన్ని పంచే ఉద్యానవనాలు, స్వచ్ఛమైన తాగు నీటి సౌకర్యం కలిపిస్తారన్నారు. రైల్వేస్టేషన్లో దివ్యాంగులు, వృద్ధులకు కష్టాలు రాకుండా కొత్త లిప్ట్లు ఏర్పాటు చేస్తారన్నారు. ప్లాట్ఫాంలను అధునీకరణ చేస్తారన్నారు. ప్రయాణిలకు సరిపడా టికెట్ కౌంటర్లు, అల్పాహారం, భోజన శాలలు ఏర్పాటు చేస్తారన్నారు. స్టేషన్కు వచ్చేందుకు, వెళ్లేందుకు విశాలమైన రోడ్లు నిర్మిస్తారన్నారు.
ముంబాయి నుంచి హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. బీజేపీ నాయకులు అభివృద్ధికి సహకరించాలని కోరారు. జహీరాబాద్ రైల్వే స్టేషన్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అమృత్ భారత్ స్టేషన్గా ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడంతో నిధులు మంజూరు చేశారన్నారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, రైల్వే బోర్డు సభ్యుడు షేక్ ఫరీద్, జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాములు నేత, సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రెడ్డి, నాయకులు మురళీయాదవ్, జైపాల్రెడ్డి, జహీరాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ మాదవ్కృష్ణ, రైల్వే శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
స్టేషన్ అభివృద్ధికి ఎంపీ విశేష కృషి
జహీరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఎంపీ బీబీ పాటిల్ విశేషంగా కృషి చేస్తున్నారని రైల్వే బోర్డు సభ్యుడు షేక్ ఫరీదు తెలిపారు. స్టేషన్లో ఆధునిక సౌకర్యలు కల్పించాలని కేంద్ర రైల్వే మంత్రికి పలుమార్లు ఎంపీ బీబీ పాటిల్ విజ్ఞప్తి చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమృత్ భారత్ పథకంలో జహీరాబాద్ను ఎంపిక చేసేందుకు కృషి చేశారన్నారు. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యలు కలిపించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక గదులు, స్వచ్ఛమైన తాగు నీరు, రోడ్లు, మెరుగుపర్చనున్నామన్నారు. జహీరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ప్రధాన మంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.