సంగారెడ్డి, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు పటాన్చెరు మండలం రుద్రారం గీతం వర్సిటీలో జరిగింది. ఐదు అసెంబ్లీ స్థానాలకు సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. సంగారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్, జహీరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు, పటాన్చెరులో బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డి గెలుపొందారు. పటాన్చెరులో 7వేల పైచిలుకు మెజార్టీతో మహిపాల్రెడ్డి విజయం సాధించారు. మూడు నియోజవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపొందడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకొన్నారు. చింతా ప్రభాకర్, మాణిక్రావు, మహిపాల్రెడ్డి గెలుపొందినట్లు తెలియగానే కౌంటింగ్ కేంద్రాల వద్దనే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చడంతో పాటు మిఠాయిలు పంచిపెట్టి విజయోత్సవ సంబురాలు నిర్వహించుకున్నారు.
నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణు లు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాయి. అసెం బ్లీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు నేతలు మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావుల ఆశీర్వాదం, ప్రజల మద్దతుతో తాము గెలుపొందినట్లు తెలిపారు. తమ నియోజకవర్గ ప్రజలు ఆశీస్సుల వల్లే తాము ఎమ్మెల్యేలుగా గెలుపొందామని, రాబోయే రోజుల్లో వారి కోసం చిత్తశుద్ధ్దితో పనిచేస్తామని గెలిచిన ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్, మాణిక్రావు, మహిపాల్రెడ్డి తెలిపారు. గెలిచిన ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి హరీశ్రావును కలిశారు. ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్,మాణిక్రావు, మహిపాల్రెడ్డిని మంత్రి హరీశ్రావు అభినందించారు. కాంగ్రె స్ అభ్యర్థి కాటా శ్రీనివాస్గౌడ్ రీ కౌంటింగ్ పట్టుబట్టారు. దీంతో పటాన్చెరులో మహిపాల్రెడ్డి గెలుపు ప్రకటనపై జాప్యం నెలకొంది. అందోలు అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ, నారాయణఖేడ్లో కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి గెలుపొందారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మె ల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ విజయం సాధించారు. 9297 ఓట్ల మెజార్టీతో చింతా ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ ఆధిక్యంలో కొనసాగారు. మొదటి రౌండ్ నుంచి సమీప కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డిపై చింతాప్రభాకర్ అధిక్యతను ప్రదర్శిస్తూనే వచ్చారు. 4, 5వ రౌండ్లో కొంత వెనకబడినా ఆతర్వాత ప్రతి రౌండ్లో చింతా ప్రభాకర్ స్పష్టమైన మెజార్టీ సాధిస్తూ వచ్చారు. 18 రౌండ్లపాటు ఓట్ల లెక్కింపు జరగగా చింతా ప్రభాకర్ 9297 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 1,89,979 ఓట్లు పోల్కాగా, చింతా ప్రభాకర్ 82,614 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డికి 73,317 ఓట్లు వచ్చాయి. 9297 ఓట్ల మెజార్టీతో చింతాప్రభాకర్ విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజ యం సాధించిన చింతాప్రభాకర్ను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభినందనలతో ముంచెత్తారు. కౌంటింగ్ కేంద్రం నుంచి సంగారెడ్డి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలో చింతాప్రభాకర్ పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి ప్రజల సంపూర్ణ మద్దతు, పార్టీ శ్రేణుల కృషితోనే తాను ఎమ్మెల్యేగా గెలుపొందానని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన విజయం కోసం కృషిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్ రెండోమారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తాజాగా ఎన్నికల్లో మరోమారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లా నుంచి విజయం సాధించిన ఏకైక బీసీ ఎమ్మెల్యే ప్రభాకర్ కావడం గమనార్హం. ప్రభాకర్ స్వయంగా పార్టీ ముఖ్యనాయకులతో కలిసి రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద గెలుపొందినట్లు సర్టిఫికెట్ తీసుకున్నారు.
జహీరాబాద్ ఎమ్మెల్యేగా మాణిక్రావు రెండోసారి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన ఆయన 12,790 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,07,763 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో మాణిక్రావుకు 97,205 ఓట్లు వచ్చా యి. సమీప ప్రత్యర్థి చంద్రశేఖర్కు 84,415 ఓట్లు వచ్చాయి. 12,790 ఓట్ల మెజార్టీతో మాణిక్రావు రెండవమారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జహీరాబాద్ ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి మాణిక్రావు ప్రతిరౌండ్లో అధిక్యత ప్రదర్శిస్తూ వచ్చారు. మాణిక్రావు గెలుపొందినట్లు ప్రకటించగానే బీఆర్ఎస్ శ్రేణులు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద సంబరాలు జరుపుకున్నాయి. మాణిక్రావు స్వయంగా వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి గెలుపొందినట్లు సర్టిఫికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత పట్టణంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీశ్రావును కలిశారు.
పటాన్చెరులో బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో మహిపాల్రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్గౌడ్పై 7070 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నుంచి బీఆర్ఎస్ అభ్యర్తి మహిపాల్రెడ్డి ప్రతి రౌండ్లో అధిక్యం ప్రదర్శించారు. కాంగ్రెస్ పై 7070 ఓట్ల మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్గౌడ్ రీ కౌంటింగ్ పట్టుబట్టడంతో పటాన్చెరు రిటర్నింగ్ ఆఫీసర్ మహిపాల్రెడ్డి గెలుపొందినట్లు అధికారికంగా ప్రకటన చేయటంలో జాప్యం చేశారు. మహిపాల్రెడ్డి గెలుపు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాయి.
అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అందోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర్ గెలుపొందారు. అందోల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్కు 85677 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర్కు 113104 ఓట్లు వచ్చాయి. 28,193 ఓట్ల మెజార్టీతో దామోదర గెలుపొందారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డికి 84,515 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డికి 90281 ఓట్లు వచ్చాయి. 5766 ఓట్ల మెజార్టీతో సంజీవరెడ్డి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో బీజేపీ ఎక్కడా ప్రభావం చూపించలేక పోయింది.