‘కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి కథానాయకులు.. వచ్చే ఎన్నికల్లో అద్భుత మెజార్టీ వచ్చేలా అందరూ సమష్టిగా కృషి చేయాలి’. అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. రాయికోడ్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీతో కలిసి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, మన దగ్గర అమలవుతున్న పథకాలు దేశ ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. మాయమాటలు చెప్పి మోసం చేసే వారందరూ ఒకవైపు ఉంటే, అద్భుతాలు సృష్టించే ముఖ్యమంత్రి కేసీఆర్ మనవైపు ఉన్నారని తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలన్నారు.
– రాయికోడ్, మే 11
రాయికోడ్, మే11: బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులని, వచ్చే ఎన్నికల్లో పార్టీకి అద్భుత మెజార్టీ వచ్చేలా కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలని అందోల్ ఎమ్యెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ప్రతిపక్షాల చౌకబారు మాటలకు సమాధానాలు చెప్పాలని, వారి కుట్రలను తిప్పికొట్టాలన్నారు. సీఎం కేసీఆర్ మున్ముందు దేశ రాజకీయాల్లో రాణించబోతున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి చర్చించుకోవడంతో పాటు పార్టీ కార్యకర్తలందరినీ ఆత్మీయంగా కలుసుకొని వారి సాధకబాధకాలు తెలుసుకునేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాయికోడ్ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా స్థానిక మార్కెట్ యార్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నేటి బీఆర్ఎస్ అవతరణ వరకు ఎన్నో విజయాలు, అపజయాలు చవిచూసిన ప్రయాణంలో పార్టీకి కార్యకర్తలే కథానాయకులని స్పష్టం చేశారు. తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ బొమ్మరిల్లులా తీర్చిదిద్దుతున్నాడన్నారు.
దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్..
దేశ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతు న్న సంక్షేమ పథకాలు వారికి కావాలని కోరుకుంటున్నారని, సీఎం కేసీఆర్ మున్ముందు దే శ రాజకీయాల్లో రాణించబోతున్నారన్నాని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. దేశంలో అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచించే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ అని ఉద్ఘాటించా రు. బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే మన రాష్ట్రం అన్నిరంగాల్లో ముందున్నదన్నారు. మాయ మాటలు చెప్పి మోసం చేసే వారందరూ ఒకవైపు ఉంటే అభివృద్ధి కార్యక్రమాలతో అద్భుతాలు స్పష్టించే మన సీఎం కేసీఆర్ మనవైపు ఉండి పని చేస్తున్నారన్నారు. అలాంటి ప్రభుత్వంపై అడ్డుగోలుగా అడ్డం, పోడుగు మాట్లాడే ప్రతిపక్ష పార్టీల విమర్శలను కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు వంటి పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈ యేడాది మొత్తం ఎన్నికల సంవత్సరమని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహం తో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయమన్నారు.
అవినీతి రహిత పాలనే లక్ష్యం
– సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి
అవినితీ రహితపాలనే సీఎం కేసీఆర్ లక్ష్యమని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీవారు స్వప్రయోజనాల కోసం ప్రజలను వాడుకుంటారు తప్ప ఉపయోగపడే పని ఒక్కటీ చేయరన్నారు. గతంలో ఏ ఊరికి వెళ్లినా మహిళలు ఖాళీ బిందెలతో, రైతులు కాలిన మోటర్లు, ఎండిన పంటలతో నిరసన తెలిపేవారని, ఇప్పుడు అలాంటివి మచ్చుకైనా కనబడడం లేదన్నారు. కార్యకర్తలు సైనికులుగా పని చేసి మూడో సారి సీఎం కేసీఆర్కు పట్టం కట్టాలన్నారు. అనంతరం కార్యక్రతలతో భోజనాలు చేశారు. సమావేశంలో అందోల్ మున్సిపాల్ చైర్మన్ మల్లయ్య, వట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రజనీకాంత్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సిద్ధన్నపాటిల్, రాష్ర్ట బీఆర్ఎస్ నాయకులు చంటి ఉదయ్కిరణ్, జైపాల్రెడ్డి, సాయికుమార్, నాజీం పాటిల్, చంద్రన్న, ప్రశాంత్పాటిల్, ఎంపీపీ మమత అశోక్కుమార్, జడ్పీటీసీ మల్లికార్జున్పాటిల్, సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్పాటిల్, ఆత్మ కమిటీ చైర్మన్ విఠల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బస్వరాజుపాటిల్, వరం చైర్మన్ వీరారెడ్డి, వైస్ చైర్మన్ తుకారం, ఏఎంఎస్ వైస్ చైర్మన్ మారుతి, బీఆర్ఎస్ మండల కార్యదర్శి శంకర్, యువజన సంఘం అధ్యక్షుడు అంజి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు.