బయ్యారం, జూలై 26 : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన ఓ ఎరువుల వ్యాపారి రూ. 3 కోట్లకు ఐపీ పెట్టినట్లు సమాచారం. మండలంలోని ఏజెన్సీ గ్రామానికి చెందిన సదరు వ్యాపారి గంధంపల్లిలో ఎరువులు, పురుగు మందుల షాపు నిర్వహిస్తున్నాడు. గత యాసంగిలో సాంబతండా, లక్ష్మీపురం, సుద్దరేవు, మిర్యాలపెంట తదితర గ్రామాలకు చెందిన రైతుల వద్ద మకలు కొనుగోలు చేసిన వ్యాపారి డబ్బులు ఇవ్వకుండా పలు మార్లు వాయిదా పెట్టాడు.
దీంతో అనుమానం వచ్చిన రైతులు 20 రోజుల క్రితం వ్యాపారిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సదరు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని వ్యాపారి ఐపీ పెట్టిట్లు ప్రచారం జరుగుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కంబాలపల్లిలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రం మిర్యాలపెంట, సాంబతండా గ్రామాలకు దూరం కావడంతో వ్యాపారికి విక్రయించినట్లు తెలిసింది. పోలీసులు స్పందించి తమ మక్కల డబ్బులు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.