‘మెదక్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా.. మైనంపల్లి ఎమ్మెల్యేగా గెలిచి మెదక్ ప్రజలకు చేసింది ఏమీ లేదు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి 13 ఏండ్లు పత్తా లేకుండా పోయాడు. ఇప్పుడు కొడుకును ఎమ్మెల్యేగా చేయాలనే స్వార్థం కోసం మెదక్ వచ్చాడు. మహిళలతో కలిసి తాను బతుకమ్మ ఆడితే అవహేళన చేస్తున్నారు. తెలంగాణ సంప్రదాయాలు తెలియని కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయాలా.. ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలి’ అని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం హవేళీఘనపూర్ మండలంలోని గాజిరెడ్డిపల్లి, బూరుగుపల్లి, రాజ్పేట్ తండా, పోచమ్మరాల్, పోచమ్మరాల్ తండా, సుల్తాన్పూర్, సుల్తాన్పూర్ తండా, చౌట్టపల్లి, చౌట్లపల్లి తండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
మెదక్ అర్బన్, నవంబర్ 23: మెదక్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు తనపై దండిగా ఉన్నాయని, తమ ఆడపడచుగా ఆదరిస్తున్నారని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం హవేళీఘనపూర్ మండలంలోని గాజిరెడ్డిపల్లి, బూరుగుపల్లి, రాజ్పేట్ తండా, పోచమ్మరాల్, పోచమ్మరాల్ తండా, సుల్తాన్పూర్, సుల్తాన్పూర్ తండా, చౌట్టపల్లి, చౌట్లపల్లి తండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మళ్లీ గెలుస్తానన్నారు. మెదక్ గడ్డ నా అడ్డా.. మైనంపల్లి ఎమ్మెల్యేగా గెలిచి మెదక్ ప్రజలకు చేసింది ఏమీ లేదని, గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి పత్తా లేకుండా పోయాడన్నారు. కొడుకును ఎమ్మెల్యేగా చేయాలనే స్వార్థం కోసం మెదక్ వచ్చారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి తెలంగాణ సంప్రదాయాలు తెలియదని, మహిళలతో కలిసి తాను బతుకమ్మ ఆడితే హేళన చేసి మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాల పండుగలను గౌరవిస్తూ మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన చీరలు సరఫరా కాగా.. మెదక్ ఎమ్మెల్యేగా నేను.. మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మైనంపల్లి ఒకే రకమైన చీరలు పంపిణీ చేశామని చెప్పారు. ఇక్కడ నాణ్యత లేని చీరలు పంపిణీ చేశారని మైనంపల్లి ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. మైనంపల్లి మల్కాజ్గిరిలో పట్టు చీరలు పంపిణీ చేశారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతున్నాడన్న భయంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారికి తిట్లు, ఝూటామాటలు తప్ప అభివృద్ధి చేయాలని ఆలోచన లేదన్నారు.
కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు మొదలవుతాయని, ఆలోచించి ఓటేస్తే అభివృద్ధి బాటలో పయనిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు గల్లీలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట ఉంటుందన్నారు. రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు మూడు, నాలుగు ఎకరాల ఉన్న వారేనని, కరెంటు మూడు గంటలు ఇస్తే చాలు అని రేవంత్రెడ్డి అంటుండగా.. మరో నాయకుడు ఉత్తమ్కుమార్రెడ్డి పంట పెట్టుబడి సాయం వద్దంటున్నారని ఆరోపించారు. రైతుబంధు, రైతు బీమా, షాదీముబారక్, కల్యాణలక్ష్మి తదితర పథకాలను సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రవేశపెట్టారన్నారు. ఈసారి అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తూ క్రయవిక్రయాలు చేసుకునేలా చట్టం తెస్తామన్నారు. రూ.400 గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికి కేసీఆర్ బీమా, రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయించనున్నట్లు చెప్పారు. ఆడబిడ్డగా ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో జడ్పీ వైస్చైర్పర్సన్ లావణ్యారెడ్డి, హవేళీఘనపూర్ ఎంపీపీ నారాయణరెడ్డి, జడ్పీటీసీ సుజాత, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు మాణిక్యరెడ్డి సాయిలు తదితరులు పాల్గొన్నారు.