‘కాంగ్రెస్, బీజేపీలు తమ పాలన ఉన్న రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తారా..? అనవసరమైన విమర్శలు మాని రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రామాయంపేట పట్టణంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కావాలని రైతులు అడిగితే లాఠీచార్జీలు చేసి జైళ్లలో పెట్టారని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి పెద్దపీట వేసి రూ.12వేల కోట్లతో విద్యుత్ కొనుగోలు చేసి రైతన్నలకు 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. బాయికాడ మోటార్లకు మీటర్లు బిగిస్తేనే రాష్ర్టానికి రావాల్సిన రూ.30వేల కోట్ల నిధులు ఇస్తామంటూ కేంద్రం ఇబ్బందులు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయంపేట అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్ కోసం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. పేదల కోసం 304 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించామని, మరో 200 ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
-రామాయంపేట, ఏప్రిల్ 20
రామాయంపేట, ఏప్రిల్ 20 : ‘బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బలం.. బలగం. రామాయంపేట నాకు జీవితాన్ని ఇచ్చింది. ఓ కోడలిగా ఇతర జిల్లా నుంచి వచ్చిన నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్నది. తనను మొదట జడ్పీటీసీగా గెలిపించి అనంతరం రామాయంపేట ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా డిప్యూటీ స్పీకర్గా నాకు రాష్ట్రంలో హోదాను కల్పించింది. అలాంటి రామాయంపేటను నా శాయశక్తులా అభివృద్ధి చేస్తా. ప్రజల కోరిక మేరకు రామాయంపేటకు డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్ కోసం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు దగ్గకు వెళ్లి తీసుకువస్తా’. అని ఆత్మీయ సమ్మేళనంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని మధురాగార్డెన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పద్మాదేవేందర్రెడ్డిని పట్టణం ప్రజలు డప్పు చప్పుళ్లతో బాజాభజంత్రీలతో ఆహ్వానించారు. ముందుగా సిద్దిపేట చౌరస్తా వద్ద ఉన్న వివేకానందస్వామి విగ్రహానికి పూలమాల వేసి ప్రజలకు అభివాదం చేశారు. అక్కడి నుంచి తెలంగాణ తల్లి, అంబేద్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి రామాయంపేట బీఆర్ఎస్ నాయకులు క్రేన్ద్వారా గజమాలను వేశారు. అక్కడి నుంచి గిరిజన మహిళలతో ర్యాలీగా వచ్చి నృత్యాలు చేశారు.
అనంతరం పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ భారీ బైక్ ర్యాలీతో కిలోమీటర్ మేర జన సమీకరణతో ఆత్మీయ సమ్మేళన వేదికకు పాదయాత్రగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చేరుకున్నారు. ముందుగా సీఎం కేసీఆర్ సందేశాన్ని చదివి వినిపించారు. 70 ఏండ్లుగా పరిపాలన చేసిన సమైక్యవాదులు తెలంగాణను అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. గతంలో కరెంటు కోసం రైతులు రోడ్డుపై రాస్తారోకో చేస్తే లాఠీచార్జి చేసి జైల్లో పెట్టిన ఘనత సమైఖ్యవాద పార్టీలకే దక్కిందన్నారు. కరెంటు కోసం రైతు బతకాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రూ.12 వేల కోట్లు ఖర్చుపెట్టి నిరంతరం విద్యుత్ ఉండేలా చేసుకున్నామన్నారు. దేశంలోనే ఒక్క తెలంగాణలోనే 24 గంటల కరెంటును ఇస్తున్న ఘనత కేసీఆర్కు దక్కిందన్నారు. కాంగ్రెస్, బీజేపీల చేతనైతే, మీ రాష్ర్టాల్లో ఉచిత విద్యుత్ ఇవ్వండి. అనవసర విమర్శలు మాని రైతులను ముందు ఆదుకోవాలని సూచించారు. పేదలను మంచి కోరే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. బీఆర్ఎస్ పథకాలను ఇకనుంచి అన్ని రాష్ర్టాలకు వర్తింపజేస్తామన్నారు.
పేదోడి కడుపును రోడ్డున పడేస్తున్న ప్రధాని ఇక ఎంతో కాలం నిలబడరన్నారు. గ్యాస్, పెట్రో, డీజిల్ ధరలను పెంచి పేదోడు బతకకుండా నడ్డి విరిచేలా చేస్తున్నారని విమర్శించారు. రామాయంపేట అభివృద్ధికి గతంలోనే రూ.9 కోట్లు నిధులు ఇచ్చామన్నారు. ఇంకా మలివిడతగా నా సొంతూరుకు మరో రూ.10 కోట్లు తీసుకువస్తానని తెలిపారు. పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతున్నంత సేపు ప్రజలంతా జై పద్మక్క,జైజై కేసీఆర్ అనడంతో ఎమ్మెల్యే భావోద్వేగానికి గురై కంటనీరు పెట్టారు. ఇప్పటికే రామాయంపేటలో 304 డబుల్బెడ్ రూమ్లను కట్టించానని మున్సిపల్ చైర్మన్, పట్టణాధ్యక్షుడు, మండలాధ్యక్షుల కోరిక మేరకు పట్టణంతో పాటు గ్రామాల్లో కూడా మరిన్ని నిధులు తీసుకువచ్చి నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్,పీఏసీఎస్ చైర్మన్ బాదెచంద్రం,అందెకొండల్రెడ్డి, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, ఎంపీపీ భిక్షపతి, వైస్ ఎంపీపీ స్రవంతి, మండల, పట్టణాధ్యక్షులు మహేందర్రెడ్డి, గజవాడ నాగరాజు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
2001 సంవత్సరం నుంచి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడితో మాకు అనుబంధం ఉన్నది. రెండు సార్లు రామాయంపేట ఎంపీపీగా, ఒకసారి మున్సిపల్ వైస్ చైర్మన్గా అవకాశం కల్పించిన ఘనత ఆమెదే. వారిని మా జీవితంలో మర్చిపోం. 23 ఏండ్లుగా బీఆర్ఎస్లో ఉంటూ ఏ ఇబ్బంది వచ్చినా ఒకరికి ఒకరం సహకరించుకుంటున్నాం.
-పుట్టి విజయలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కొత్తకొత్త పథకాలు పెట్టడమే కాకుండా అర్హులైన వారికి పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలతో అందరి అభిమానాన్ని పొందుతున్నారు. మేము ఎప్పటికీ సీఎంగా కేసీఆర్ను, ఎమ్మెల్యేగా పద్మక్కను గెలిపించుకుంటాం.
-లంబాడీ బిక్కి ,కోమటిపల్లి
మాకు రాజకీయ జన్మనిచ్చింది రామాయంపేట అయితే ఉద్యమంలో పేరు తెచ్చిం ది సీఎం కేసీఆర్. 2001 నుంచి ఉద్యమంలో భాగస్వాములై ఇప్పటిదాకా కేసీఆర్ వెంటే ఉండి ఆయన ఆశీర్వాదంతో పదవులు పొంది అభివృద్ధి బాటలో రామాయంపేటను నడిపిస్తున్నాం. మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా పద్మాదేవేందర్రెడ్డి రామాయంపేట ఆడబిడే..
– దేవేందర్రెడ్డి , ఇఫ్కో డైరెక్టర్
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పద్మక్కను మెదక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుని తీరుతాం. ఎన్ని అడ్డకుంలు ఎదురైనా మా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించిన పద్మక్కను భారీ మెజార్టీతో గెలిపిస్తాం. మా మధ్యలో ఎలాంటి విభేదాలు లేకుండా అం దరం కలిసికట్టుగా ఉండి ఒకేతాటిపై నడిచి మా గ్రామాలు, పల్లెలను అభివృద్ధి దశలో నడిపించిన పద్మక్కే మా నాయకురాలు.
-మహేందర్రెడ్డి, మండలాధ్యక్షుడు
రామాయంపేటలో నిర్మించి 304 డబుల్ బెడ్ రూంలు సరిపోలేదు. ఇంకా నిరుపేదలు ఇండ్లు లేనివారు వందల సంఖ్యలో ఉన్నారు. మరో 200 ఇండ్లకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నిధులు కేటాయిస్తే, వారందరికీ ఇండ్ల్లు సమకూరుస్తాం.
-గజవాడ నాగరాజు, పట్టణాధ్యక్షుడు