ఝరాసంగం, మార్చి 21: తాను జహీరాబాద్ బిడ్డనని, తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే కష్టసుఖాల్లో తోడుంటానని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తానని బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తంతో కలిసి గురువారం ఝరాసంగంలోని వాసవి కల్యాణ మండపంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గ్గొన్నారు. ఆయనకు మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాణిక్రావు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను అనిల్కుమార్ను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా రాత్రింబవళ్లు కష్టపడి తనకు ఎలా విజయాన్ని అందించారో, అలాగే ఎంపీ ఎన్నికల్లోనూ గాలి అనిల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్కు కానుకగా అందించాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, రైతుబిడ్డ గాలి అనిల్కుమార్తో జహీరాబాద్ స్థానంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ… మతం, కులం పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కొన్ని పార్టీలు చూస్తున్నాయని, బీఆర్ఎస్ అన్ని మతాలను, కులాలను సమానంగా ఆదరిస్తుందని తెలిపారు. సమావేశం అనంతరం ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో మండల అధ్యక్షుడు వెంకటేశం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొగ్గుల సంగమేశ్, నర్సింహగౌడ్, జగదీశ్, హఫీజ్, అజీమ్, నరేశ్, రాజు, ప్రభు పటేల్, నర్సింహులు, వెంకట్రెడ్డి, శంకర్ పాల్గ్గొన్నారు.
అల్లాదుర్గం, మార్చి 21: అల్లాదుర్గంలోని వేంకటేశ్వరాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో రెండో రోజైన గురువారం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శుక్రవారం కార్యక్రమానికి గురువానంద పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతి స్వామి రానున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ ఉత్సవాల్లో పాల్గ్గొన్నారు. వీరితో వేదపండితుడు ప్రవీణ్శర్మ ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిల్కుమార్రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడు కాశీనాథ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు, ఎంపీటీసీ దశరథ్, మాజీ సర్పంచ్ అంజియాదవ్, బీఆర్ఎస్ నాయకులు పవన్, సూర్యకుమార్, శివరాం రాథోడ్ పాల్గొన్నారు.