నర్సాపూర్, నవంబర్ 15: ఆడబిడ్డ సునీతమ్మను నిండు మనుసుతో ఆశీర్వదించి, గెలిపించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు. నర్సాపూర్ పట్టణంలో నేడు (గురువారం) నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే మదన్రెడ్డి, నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రైతులు, మహిళలు, యువకులు, గిరిజనులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని గిరిజనులకు ఎమ్మెల్యే మదన్రెడ్డి పట్టుబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి రెండు ప్యాకేజీలు తీసుకొచ్చారన్నారు. మొదటి ప్యాకేజీగా రూ.56 కోట్లు, రెండో ప్యాకేజీగా రూ.146 కోట్లు తీసుకొచ్చారన్నారు. ఈ ప్యాకేజీలతో గిరిజన తండాలకు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేయించారని గుర్తుచేశారు.
గిరిజనులకు అంత డబ్బు రావడం నర్సాపూర్ చరిత్రలోనే ఇది మొదటిసారని తెలిపారు. గిరిజనుల కోసం 10 శాతం రిజర్వేషన్, అధికారికంగా సేవాలాల్ జయంతి, లంబాడీలకు అత్యధిక సీట్లు ఇచ్చామన్నారు. గతంలో కాంగ్రెస్ గిరిజనులను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాలుగు నెలల నుంచి నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారని, 250 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు తెలంగాణలో ఆత్మహత్యలు లేవన్నారు. ఉద్యమాన్ని, పాలనను ముఖ్యమంత్రి కేసీఆర్ నీతి, నిజాయితీ, నిబద్దతతో కొనసాగించారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నీతి, నిజాయితీ లేదని విమర్శించారు. రైతుబంధు కింద 11 విడతల్లో రూ.72 వేల కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఖాతాలో వేశారన్నారు. సగటున 2 ఎకరాలు ఉన్న రైతులకు రైతుబంధు కింద రూ.లక్షా 6 వేలు నేరుగా ఖాతాలో జమ చేశామన్నారు.