జనగామ, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ‘ప్రజలు నన్ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తే స్థానికంగా ఉంటూ ప్రణాళికాబద్ధంగా జనగామ సమగ్రాభివృద్ధి కృషి చేస్తా.. ప్రగతి పనులను పరుగులు పెట్టిస్తా..’ అని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, జనగామ, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ బొడకుంటి వెంకటేశ్వర్లు, ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్రెడ్డి, నాయకులు బండ యాదగిరిరెడ్డితో కలిసి పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామలో ఎన్నికల అధికారికి వేర్వేరుగా రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు వికాస్నగర్లోని క్యాంపు కార్యాలయంలో తొలుత ఆయన సోదరి సహా బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లు పల్లా నొదుట వీరతిలకం దిద్ది మంగళహారతులు పట్టగా వేదపండితులు, వివిధ మతపెద్దల ఆశీర్వాదం, సర్వమత ప్రార్థనల అనంతరం ఇంటి ప్రధాన గుమ్మం వద్ద దిష్టితీసి వాహనానికి గజమాల వేశారు. అక్కడి నుంచి గులాబీ శ్రేణులు బైక్ ర్యాలీగా ముందునడవగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకొని ఉదయం 11.30 గంటలకు మొదటి సెట్, తర్వాత రెండోసెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పల్లా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలో ఇప్పటివరకు చాలా అభివృద్ధి జరిగిందని, ఇంకా జరగాల్సిన పనులు ఉన్నాయన్నారు.
సీఎం కేసీఆర్ దీవెనలు.. ప్రజాశీర్వాదం, పెద్దల సహకారంతో జనగామలో ఘనవిజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాదనుకున్న జనగామ జిల్లాను ఇచ్చారు.. రాదనుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ వచ్చింది.. అద్భుతమైన సమీకృత కలెక్టరేట్ నిర్మించుకున్నాం.. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తా.. జనగామను అద్దంలా మారుస్తానని పల్లా హామీ ఇచ్చారు. ప్రజల సంపూర్ణ మద్దతు, ముఖ్యమంత్రి ఆశీస్సులు, వివిధ హోదాల్లో నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములైన పొన్నాల, ముత్తిరెడ్డి, బొడకుంటి సహకారంతో ఖచ్చితంగా జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందుతానన్న విశ్వాసం ఉందన్నారు. నాకు మాత్రం చాలా సంతోషం కలిగించిన విషయం ఏంటంటే మా ముత్తిరెడ్డి అన్న నిండు మనస్సుతో ఆశీర్వదించారని, మంత్రిగా జనగామకు సేవలందించిన పొన్నాల బలం తోడైందని, ఇక బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. జనగామకు పెద్ద పాలేరునై పనిచేస్తా అని చెప్పారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో ముందున్న ఈ ప్రాంతానికి ఏం కావాలో పెద్దసారు కేసీఆర్కు బాగా తెలుసన్నారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. ఆయన పాలనపై ప్రజలకు విశ్వాసం ఉందని తెలిపారు. ఎన్నికల్లో మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తరహాలో జనగామ అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ అంటేనే కేసీఆర్.. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని జనగామ ఎమ్మెల్యే, టీఎస్ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఒకప్పుడు ఢిల్లీలో తెలంగాణ అంటే అదెక్కడుంటుంది అనే వాళ్లు.. కేసీఆర్ రాష్ట్రం సాధించిన తర్వాత పరిపాలన దక్షతతో దేశానికే తెలంగాణ ఐకాన్గా మారిందన్నారు. ఒకనాడు బువ్వకు నోచుకోని.. జ్వరం వస్తేనో.. జేజేమ్మకు పెడితేనో తెల్లటి మెతుకులు దొరికేవని, ఇప్పుడు భారతదేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. జనగామను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి, మెడికల్ కాలేజీ మంజూరు చేసి, నిండుగా నీళ్లు ఇచ్చిన ఫలితంగానే ఈ ప్రాంతం సస్యశ్యామలమైందన్నారు. నాటి జనగామ ఎట్లుండే.. నేటి జనగామ ఎట్లుందో ప్రజల కండ్ల ముందున్నదని తెలిపారు.
మన రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలను పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్ ఎందుకు అమలు చేయడం లేదని రైతుబంధు సమితి చైర్మన్, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేయని పథకాలు.. తెలంగాణలో అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు మీ పాలనకు కేసీఆర్ పాలనకు పొంతన ఉందా? అని నిలదీశారు. ఉద్యమ సమయంలో ఊర్లు తిరిగిన సందర్భంలో రైతులకు దొంగరాత్రి కరెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. అది కూడా ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుం దో తెలియని పరిస్థితి, లోవోల్టేజీ కరెంట్తో మోటార్లు కాలి రైతులు ఆగమయ్యారని చెప్పారు. కరువు.. దుర్భ్రిక్షానికి ట్యాగ్లైన్ కాం గ్రెస్ పాలన అని ఎద్దేవా చేశారు.