సిద్దిపేట, నవంబర్ 27( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ హత్నూర, నవంబర్ 27 : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్ నాయకులు గులాబీ గూటికి చేరారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సమక్షంలో గురువారం హైదరాబాద్లో హత్నూర మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ జడ్పీటీసీ పొట్లచెర్వు ఆంజనేయులు, శరత్చంద్ర, మల్లేశం, నర్సింహారెడ్డి, అరవింద్బాబుతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ఆయన గులాబీ కండువాకప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ అంటేనే ‘నయవంచన’ అని ప్రతి వర్గాన్ని మోసంచేసిన చరిత్ర ఆ పార్టీదని ఆరోపించారు. రెండేళ్లుగా కాంగ్రెస్ పాలనలో ఏఒక్క ప్రాంతం అభివృద్ధ్దికి నోచుకోలేదని, ఏఒక్కరికి మేలు జరుగలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హాయంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ నేడు కాంగ్రెస్ పాలనలో తిరోగమనంలో పయనిస్తుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420హామీలు కేవలం ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికే అని ఆరోపించారు. వ్రుద్దులకు రూ.4వేల పెన్షన్, మహిళలకు మహాలక్ష్మీ పథకం, విద్యార్థులకు విద్యా భరోసా, నిరుద్యోగులకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీలు ఇలా అన్ని వర్గాలను రేవంత్రెడ్డి ప్రభుత్వం మోసంచేస్తుందన్నారు. రేవంత్రెడ్డి పాలనలో ‘కరెంటు నుండి కాంటాదాకా’ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. లోఓల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు కాలి పోతున్నాయని, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయన్నారు.
కొనుగోలు కేంద్రాలు సక్రమంగా లేక ధాన్యం దళారుల పాలవుతున్నదని మండిపడ్డారు. రైతుబంధు, రుణమాఫీ, పంటలబీమా, బోనస్ వంటి పథకాలన్నీ అటకెక్కాయని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసాలను బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రజలకు వివరించాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానేనని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించుకోవాలని హరీశ్రావు పిలుపునిచ్చారు.