సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 13: వైద్య వృత్తి అత్యంత ఉన్నతమైనదని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. విద్యార్థులు సబ్జెక్టులపై పూర్తి అవగాహన పెంచుకుని కష్టపడి చదవాలని, నైపుణ్యం గల వైద్యులుగా ఎదిగి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల పనుల పురోగతి, ప్రభుత్వ జనరల్ దవాఖానను సందర్శించారు. కళాశాల రెండో బ్లాక్లో నిర్మాణంలో ఉన్న హాస్టల్, పరిపాలన భవన పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా భవనాలను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్, ఆర్అండ్బీ అధికారులకు సూచించారు.
మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ దవాఖాన ప్రహరీ పూర్తి చేయాలని సూచించారు. వైద్య విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ డాక్టర్ వృత్తి గౌరవప్రదమైనదని తెలిపారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో అన్ని వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఓపీ, డయాలసిస్ సెంటర్, ఎంసీహెచ్, స్కానింగ్, రేడియాలజీ విభాగం, ల్యాబ్స్ తదితర విభాగాలను తనిఖీ చేశా రు. రోగులు, నవజాత పిల్లల తల్లులు, గర్భిణులతో కలెక్టర్ మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలు పట్టాలని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. దవాఖానకు ఇంకా ఏమైనా పరికరాలు అవసరమైతే ప్రతిపాదనలు అందిస్తే మంత్రి దృష్టికి తీసుకెళ్తామని అధికారులకు సూచించారు. కలెక్టర్వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వాణి, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్కుమార్, ఆర్అండ్బీ అధికారులు, తహసీల్దార్ తదితరులున్నారు.