జాగ్రత్తలు పాటించాలి
వ్యవసాయశాఖ నుంచి అనుమతి పొందిన దుకాణాల్లోనే రైతులు విత్తనాలు, ఎరువులు, మందులు కొనుగోలు చేయాలి. ప్రభుత్వంతో ఒప్పదం కుదుర్చుకున్న సంస్థల నుంచి సర్టిఫైడ్ అయిన వాటినే ఎంచుకోవాలి. కొనుగోలు చేసిన వాటికి బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. బిల్లుపై రైతు చిరునామా, గడువు తేదీ, సంస్థ పేరు, లేబుల్, పరిమాణం, ధర, అమ్మిన వారి సంతకం వంటి వివరాలు తప్పనిసరిగా ఉండాలి. పంట చేతికి వచ్చే వరకు రైతులు బిల్లులు భద్రపర్చుకోవాలి. సంచులు, డబ్బాలపై ఉత్పత్తి, విక్రయదారుడి పేరు, చిరునామా లాట్ నెంబర్ పరీక్షించుకోవాలి. విత్తనాలు, ఎరువులు కొన్న వెంటనే మొలక శాతం పరీక్షించుకోవాలి. నమూనా వివరాల కోసం పంటపంట కోతకు వచ్చే వరకు సంచులను దాచుకోవాలి. ఏవైనా సమస్యలుంటే వ్యవసాయాధి కారులు, విస్తరణ అధికారులను సంప్రదించాలి.
– లావణ్య, వ్యవసాయాధికారి, న్యాల్కల్ మండలం
న్యాల్కల్, మే 21: పంటల సాగులో అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులను ఎంచుకోవడం ఎంతో కీలకం. ఆయా భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సమీప వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని, కృషి విజ్ఞాన కేంద్రాన్ని లేదా వ్యవసాయాధికారులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకుని కొనుగోలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఆధీకృత విత్తన డీలర్ల వద్దనే విత్తనాలు, ఎరువులు, మందులు కొనుగోలు చేయడం ఉత్తమం. ఇలా కొనడం ద్వారా పంట నష్టం జరిగినప్పడు రైతులు వ్యవసాయ ఉన్నతాధికారులను సంప్రదించి నష్టపరిహారం పొందవచ్చు. వానకాలం (ఖరీఫ్) సాగుకు సమయం దగ్గర పడుతుండడంతో విత్తనాలను నాటేందుకు రైతులు ట్రాక్టర్లు, ఎద్దులతో పొలాల్లో దుక్కులు దున్నుతున్నారు. ఈ సారి పత్తి, కంది, సోయాబీన్, పెసర, మినుము తదితర పంటలపైనే రైతులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. వ్యవసాయశాఖ ద్వారా రాయితీ విత్తనాలు వస్తున్నప్పటికీ తక్కువ ధరతో ఎక్కువ దిగుబడి వస్తుందని దుకాణ నిర్వాహకులు చెబుతుండడంతో కొంత మంది రైతులు ప్రైవేటు దుకాణాల్లో విత్తనాలు కొనేందుకు సిద్ధమవుతున్నారు.
దీంతో అనేక మంది రైతులు నకిలీల బారిన పడి నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు తయారుచేసిన విత్తనాలు నోటిఫైడ్ పేరుతో మార్కెట్లోకి వస్తాయి. ఈ విత్తనాల నాణ్యత, పంపిణీ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే ఉత్పత్తిదారులు, పంపిణీదారులపైన ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వానకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను కొనుగోలు చేసేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం…
విత్తనాలు కొనుగోలులో…
* వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన ఆధీకృత డీలర్ నుంచి విత్తనాలను కొనుగోలు చేయాలి.
* బిల్లులో విత్తన రకం నంబర్, గడువు, కొనుగోలు తేదీలు, డీలర్ సంతకం, రైతు సంతకం బిల్లులో ఉండే విధంగా చూసుకోవాలి.
* లూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాలు, గడువు దాటిన విత్తనాలను కొనుగోలు చేయొద్దు.
* బిల్లులో విక్రయదారుడి
పేరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకపు నంబర్ ఉండాలి.
* విత్తనాల ప్యాకెట్, డబ్బా, సంచులపై సీలు ఉందా లేదా నిర్ధారించుకోవాలి.
* విక్రయదారుడు ఇచ్చే కరపత్రాలలో పేర్కొన్న అంశాలను సరిచూసుకోవాలి.
* కొనుగోలు బిల్లును పంటకాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
* విత్తనాలు సాగు చేసిన అనంతరం మొలకెత్తే దశలో, పూత దశలో లోపాలు కనిపిస్తే వ్యవసాయాధికారులను సంప్రదించాలి.
ఎరువుల కొనుగోలులో..
* లైసెన్స్ ఉన్న డీలర్ వద్దనే ఎరువులు కొనుగోలు చేయాలి.
* బిల్లును పంటకాలం పూర్తి ఆయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
* ఎరువుల సంచులు మిషన్ కుట్టుతో ఉన్న వాటినే కొనుగోలు చేయాలి.
* ఎరువుల ప్రామాణిక పోషకాల వివరాలు, ఉత్పత్తి సంస్థ పేరు, ఉత్పత్తిదారుని పేరు ఉందా లేదా తప్పని సరిగా చూసుకోవాలి.
* నాణ్యతపై అనుమానం వస్తే ఎరువులను వ్యవసాయాధికారులకు చూపించి పరీక్షకు పంపాలి.
* అన్య పదార్థాలు కనిపిస్తే ఆ ఎరువులను కల్తీలుగా గుర్తించాలి.
పురుగు మందులు…
* వ్యవసాయ, ఉద్యానవన, శాస్త్రవేత్తలు సూచించిన మందులను మాత్రమే కొనుగోలు చేయాలి.
* అవసరానికి మించి మందులను కొనుగోలు చేయొద్దు.
* పురుగు మందుల డబ్బాలపై వజ్రాకారంలో రేటింగ్ తెలుపుతూ రంగులు ఉంటాయి
* అత్యంత విషపూరితమైతే నీలం, స్వల్ప విషపూరితమైతే అకుపచ్చ రంగు గుర్తులు ఉంటాయి.
* చీడ పురుగులను నివారణకు రెండు, మూడు రకాల మందులు కలిపి వాడొద్దు.
* వాడిన డబ్బాలు, సీసాలను ఖాళీ అయిన తర్వాత ధ్వంసం చేయాలి, లేదా గుంతలో పూడ్చి వేయాలి.