హుస్నాబాద్, ఫిబ్రవరి 27: కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజాహిత యాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలతో రెచ్చిపోయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు బాహాబాహీకి దిగడంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం రాములపల్లిలో మంగళవారం ప్రారంభమైన యాత్ర ఉద్రిక్తతలకు దారితీసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. కాంగ్రెస్ కార్యకర్తలు బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. పోలీస్స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. అయోధ్యలోనే రాముడు పుట్టాడనే గ్యారెంటీ ఏమిటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తుండగా, ఇలా అనే వారు వారి తల్లికే పుట్టారనే గ్యారెంటీ ఏమిటి…? అని బండి సంజయ్ సోమవారం ప్రజాహిత యాత్రలో అన్న వ్యాఖ్యలు దుమారం లేపాయి. మంత్రి పొన్నంను అన్నాడని, పొన్నం తల్లిని అవమానించారని కాంగ్రెస్ వర్గాలు ఆందోళనకు దిగాయి.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో సోమవారం రాత్రి బసచేసిన ఓ పాఠశాలపై దాడి చేసేందుకు హుస్నాబాద్ తదితర ప్రాంతాల నుంచి మంగళవారం ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరిని పోలీసు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం హుస్నాబాద్ మండలం రాములపల్లికి బండి సంజయ్ యాత్ర చేరుకోవడంతో అక్కడే ఉన్న మరికొందరు కాంగ్రెస్ నాయకులు బండి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. యాత్రను అడ్డుకుంటున్న కాంగ్రెస్ కార్యర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగడంతో మోహన్ అనే కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మహ్మదాపూర్, నాగారం, పోతారం(ఎస్), హుస్నాబాద్, పందిల్ల, అక్కన్నపేట మండలం గోవర్థనగిరి, రామవరం, అక్కన్నపేట, కట్కూరు గ్రామాల ద్వారా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండకు యాత్ర చేరుకుంది. పోలీసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎలాంటి అవాంతరాలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.