అది ఊరుమ్మడి పండుగైనా, ప్రత్యేకంగా కొన్ని సామాజిక వర్గాలు నిర్వహించే వేడుకైనా కుస్తీ పోటీలు ఉండాల్సిందే! వివిధ ప్రాంతాల నుంచి పేరు మోసిన మల్లయోధులు రావాల్సిందే.. ఊరు ఊరంతా ఒక్కచోట చేరి చూడాల్సిందే!! ఔను, అంత గొప్పగా నిర్వహిస్తుంటారిక్కడ కుస్తీ పోటీలను. అందుకే మల్లయుద్ధానికి సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలు పెట్టింది పేరు. తరతరాలుగా ఈ ఆటను ఆదరిస్తున్నాయి ఈ పల్లెలు. ముఖ్యంగా పెద్దశంకరంపేట మండలంలోని చీలపల్లి, మఖ్త లక్ష్మాపురం, భూర్గుపల్లిల్లో ఏటా గ్రామదేవతల జాతరలను ఘనంగా జరుపుకొంటారు. జాతర చివరి రోజు జరిగే కుస్తీ పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
పెద్దశంకరంపేట, మే 20: పల్లెల్లో యుద్ధం జరుగుతున్నది. విజయం కోసం హోరాహోరీ పోటీ నడుస్తున్నది. గ్రామ దేవతల జాతరలో భాగంగా గ్రామాల్లో కుస్తీ పోటీల సందడి పెరిగింది. జాతర పల్లెల్లో పండుగ వాతావారణం నెలకొన్నది. ఈ సందర్భంగా నిర్వహించే కుస్తీ పోటీల్లో మల్లయోధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కుస్తీమే సవాల్ అంటూ వివిధ రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్నారు.
గ్రామాల్లో కుస్తీ పోటీలంటే ఆట కాదు. అదో పండుగ. గ్రామ దేవతలకు బోనాలు, మొక్కులు తీర్చుకునేందుకు జాతరలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందుకోసం పాలకవర్గం విరాళాలు సేకరించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. గ్రామంలో చాటింపు వేయించి కుస్తీ పోటీల తేదీని ప్రకటిస్తారు. రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికతో ఇంటర్నెట్, మోబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్న యువత సైతం అవన్నీ పక్కనబెట్టి కుస్తీ పోటీలను తిలకిస్తున్నారంటే ఈ క్రీడలకు గ్రామాల్లో ఉన్న క్రేజ్ ఏంటో వేరే చెప్పక్కర్లేదు! దూర ప్రాంతాల నుంచి సైతం ఈ కుస్తీ పోటీలను తిలకించడానికి తరలివస్తారు.
అప్పుడే దున్ని చదును చేసిన నల్లరేగడి నేల చుట్టూ వేలాది మంది జనం, జనం మధ్యలో ఎదురెదురుగా నిక్కర్లు తొడుక్కున్న ఇద్దరు వ్యక్తులు ఒకరిని చూసి ఒకరు జబ్బలు తొడలు చరుచుకుంటున్నారు. అంతలో విజిల్ మోత! పరస్పరం కలియపడ్డారు. కిందా, మీదా పడుతూ బల ప్రదర్శన చేస్తున్నారు. వేసవి కాలంలో ఈ ప్రాంతంలో చాలా గ్రామాల్లో కుస్తీ పోటీలు నిర్వహిస్తుంటారు. కుస్తీ పోటీలకు నానాటికీ జనం ఆదరణ పెరుగుతున్నది.
బాజాభజంత్రీల చప్పళ్లు. నువ్వా.. నేనా అంటూ సవాళ్లు. ప్రేక్షకులకు చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఉర్రూతలూగించే ఆట కుస్తీమే సవాల్ కుస్తీ పోటీలు. క్రికెట్, పుట్బాల్స్, బాక్సింగ్ వంటి ఆటలకు టీవీలకు అతుక్కుపోయే నేటి రోజుల్లో కుస్తీ పోటీలకు పల్లెల్లో క్రేజ్ తగ్గలేదు. ఏ మారుమూల గ్రామంలో కుస్తీ పోటీలు జరిగినా మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వెళ్లి కుస్తీ పోటీల్లో పాల్గొంటూ కుస్తీ పోటీలను తిలకిస్తారు. తెలంగాణ రాష్ర్టానికి ఆనుకొన్ని ఉన్న పక్క రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్లయోధులు వచ్చి పాల్గొంటారు.
పల్లెల్లో ప్రతి ఏడాది వేసవి కాలంలో జాతర్లు జరుగుతాయి. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని చీలపల్లి, మఖ్త లక్ష్మాపురం గ్రామాల్లో ఏడాదికోసారి జాతర, మరికొన్ని గ్రామాల్లో రెండేళ్లకోసారి జాతర, భూర్గుపల్లి గ్రామంలో ఐదేళ్లకోసారి కోటమ్మ జాతర నిర్వహిస్తుంటారు. ఈ జాతరలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం, బండ్ల ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆఖరు రోజు కుస్తీ పోటీలు నిర్వహిస్తుంటారు. ఊళ్లో జాతర ఉందంటే గ్రామంలోని బంధు బలగాన్ని పిలుచుకొని ప్రతి ఇల్లూ కళకళలాడుతూ కనిపిస్తుంటుంది. చిన్నా, పెద్దా ఆడ, మగ తేడా లేకుండా జాతరలో సామగ్రి, తినుబండారాలు కొనుగోలు చేస్తుంటారు. ఉత్సాహంగా కుస్తీ పోటీలను తిలకిస్తుంటారు.
కుస్తీ.. ఇది ఆట కాదు. ఇక్కడి పల్లెల్లో నిర్వహించే పండుగ! ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంతంలో ఎన్నో తరాలుగా ఆనవాయితీగా నిర్వహిస్తున్న సంప్రదాయ వేడుక. మల్లయుద్ధం అన్ని ప్రాంతాల్లో కనిపించే ఆటే అయినా ఈ ఆట గురించి చర్చించుకునేటప్పుడు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల్లో నిర్వహించే తీరు ప్రత్యేకంగా అనిపిస్తుంది. అది ఊరుమ్మడి పండుగైనా, ప్రత్యేకంగా కొన్ని సామాజిక వర్గాలు నిర్వహించే వేడుకైనా కుస్తీ పోటీలు ఉండాల్సిందే! వివిధ ప్రాంతాల నుంచి పేరు మోసిన మల్లయోధులు రావాల్సిందే.. ఊరు ఊరంతా ఒక్కచోట చేరి చూడాల్సిందే!! ఔను, అంత గొప్పగా నిర్వహిస్తుంటారిక్కడ కుస్తీ పోటీలను. అందుకే మల్లయుద్ధానికి సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలు పెట్టింది పేరు. తరతరాలుగా ఈ ఆట ఆదరిస్తున్నాయి ఈ పల్లెలు. జిల్లాలో నిర్వహించే పలు జాతర్ల సందర్భంగా ఏర్పాటుచేసే కుస్తీ పోటీల్లో సరిహద్దు జిల్లా కామారెడ్డిలోని జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ నుంచే కాకుండా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి మల్లయోధులు ఉత్సాహంగా పాల్గొంటుండడం విశేషం. యువకులతో సమానంగా అమ్మాయిలు కూడా కుస్తీ మే సవాల్ అంటూ కాలు దువ్వడం ఇక్కడ కొత్తేం కాదు. అమ్మాయిలు కుర్రాళ్లతో తలపడి వెండి కడియాలు గెలుచుకున్న సందర్భాలు అనేకం.
కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు స్థానికులతోపాటు కర్నాటక, మహారాష్ట్ర నుంచి మల్లయోధులు తరలివస్తుంటారు. కొబ్బరికాయ కుస్తీతో ప్రారంభమయ్యే ఈ కుస్తీ ప్రోత్సాహక బహుమతి కింద రూ.10 నుంచి రూ.10 వేల దాకా అందజేస్తారు. చివరి కుస్తీ పోటీలో గెలుపొందిన విజేతలకు రూ.5 వేలు, రూ.10 వేలు, వెండి కడియాలను బహూకరిస్తారు. కుస్తీ పోటీలో పాల్గొనే వారు అక్కడ గీచే బరిలో కూర్చుంటారు. పేరు గాంచిన మల్లయోధులు తలపడుతుంటే రెప్ప వాల్చకుండా తిలకిస్తారు.