Amarnath Yatra : అమర్నాథ్ యాత్ర శనివారం తిరిగి ప్రారంభమైంది. వాతావరణం అనుకూలించడంతో బల్తాల్ మార్గంలో యాత్రను తిరిగి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. గత నెలలో ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. అయితే, భారీ వర్షాలు, రోడ్లు దెబ్బతినడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వంటి కారణాల వల్ల యాత్రను శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ, శనివారం వర్షాలు తగ్గడం, వాతావరణం అనుకూలంగా ఉండటంతో యాత్రను తిరిగి ప్రారంభించారు.
ఇదే సమయంలో రోడ్లకు కూడా మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం బల్తాల్ మార్గంలో అమర్నాథ్ యాత్ర ప్రారంభమైందని, భక్తులను పవిత్ర మంచులింగాన్ని దర్శించుకునేందుకు అనుమతిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అయితే, పహల్గాం మార్గం నుంచి సాగే యాత్రను అధికారులు ఇంకా నిలిపివేశారు. ఈ మార్గంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడం, రోడ్ల మరమ్మతు పనులు సాగుతుండటంతో ప్రస్తుతానికి యాత్రను నిలిపివేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వల్ల జమ్మూ-శ్రీనగర్ హైవేను అధికారులు మూసివేశారు. ఇది 250 కిలోమీటర్ల దూరం కలిగిన జాతీయ రహదారి. కాశ్మీర్ను, దేశమంతా కలిపి ఉంచే రహదారి ఇదే.
ఈ రోడ్డు మార్గం దెబ్బతినడంతో భాగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి వెళ్లాల్సిన భక్తుల్ని కూడా అనుమతించడం లేదు. ఇంకా అక్కడి అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత నెల 3న ఈ యాత్ర ప్రారంభమైంది. ఇప్పటివరకు 4,50,000 మంది భక్తులు పవిత్ర గుహలోని మంచులింగాన్ని దర్శించుకున్నారు. ప్రతి ఏడాదికోసారి సాగే అమర్నాథ్ యాత్ర ఈ నెల చివరి వరకు కొనసాగనుంది.