సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని హుస్సేల్లి గ్రామ రహదారి ఇది. హరితహారం కార్యక్రమంలో భాగంగా అవెన్యూప్లాంటేషన్ కింద గ్రామ చౌరస్తా నుంచి గుంజేట్టికి వెళ్లే ఆర్అండ్బీ రహదారికి ఇరువైపులా రెండేండ్ల కింద 650 మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీ సిబ్బంది నీళ్లు పోస్తూ సంరక్షించడంతో మొక్కలు ఇలా రోడ్డుకు పచ్చని చెట్టే తోరణాలుగా మారి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఆ చెట్లకు పూసిన ఎరుపు రంగు పూలతో రోడ్డు అందాలను పరుచుకున్నది.
– న్యాల్కల్, జూన్ 18
తల్లి తెలంగాణ ఆకుపచ్చని చీర చుట్టింది..! జనమంతా మానవహారమై పచ్చలహారాన్ని సమర్పించారు. ‘వానర సేవ వనానికి.., వానలు పుడమికి’ వస్తున్నాయి. అడవుల శాతం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా విడతల వారీగా నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రం ఆకుపచ్చగా మారుతున్నది. ‘వృక్షో రక్షితి రక్షితః’ అన్న పెద్దల మాటను నిజం చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో చేయిచేయి కలిపి ముందుకు సాగుతున్నారు. మొక్కలు నాటి పల్లెలకు, పట్టణాలకు పచ్చని తోరణాలు
కడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేస్తున్నారు. నర్సరీల్లో పండ్లు, నీడనిచ్చే మొక్కలు పెంచుతున్నారు. బాదం, వేప, కానుగు, చింత, మామిడి, జామ, ఉసిరి, నిమ్మ, దానిమ్మ, గులాబీ, మందార, మల్లె తదితర మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు నర్సరీల్లో మొక్కలను క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్నారు.