సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో వేగంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఫ్లైఓవర్ల కింద సబ్స్టేషన్ల నిర్మాణానికి అనువైన స్థలాల పరిశీలన మొదలుపెట్టారు. సోమవారం టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ ముషీరాబాద్ బస్డిపో సమీపంలోని నాయని నర్సింహారెడ్డి స్టీల్బ్రిడ్జి కింద పిల్లర్ నంబర్ 63-64 మధ్య ప్రతిపాదిత 33/11కేవీ ఇండోర్ సబ్స్టేషన్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు.
ప్రతిపాదించిన స్థలంతో పాటు సబ్స్టేషన్ లే అవుట్, 33కేవీ ఇన్కమింగ్ సరఫరా, 11కేవీ అవుట్గోయింగ్ ఫీడర్లు, అండర్గ్రౌండ్ కేబుల్ మార్గాలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై అధికారులతో సీఎండీ సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్లో ైఫెఓవర్ల కింద సబ్స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్ శివాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఈ సబ్స్టేషన్ల నిర్మాణ విధానం, నిర్వహణ, భద్రత, సాంకేతిక అనుకూలత తదితర అంశాలను అధ్యయనం చేస్తున్నదని తెలిపారు. నగరంలో స్థలం అందుబాటులో లేని స్థలాల్లో అనువైన ప్రదేశాలను గుర్తించే ప్రక్రియను సంస్థ చేపట్టిందని, ముషీరాబాద్లో ప్రతిపాదిస్తున్న ఇండోర్ సబ్స్టేషన్ను రెండు 8ఎంవీఏ పవర్ట్రాన్స్ఫార్మర్లతో ఏర్పాటుచేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.
సబ్స్టేషన్లో మొత్తం 8నంబర్ల 11కేవీ ఫీడర్లకు అవసరమైన ఇండోర్ స్విచ్గేర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, తొలిదశలో నాలుగు 11కేవీ ఫీడర్లను అనుసంధానించడంతో పాటు భవిష్యత్లో పెరిగే విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో నాలుగు 11కేవీ ఫీడర్లకు అవసరమైన అవకాశం కల్పిస్తామని సీఎండీ చెప్పారు. ఈ స్థల పరిశీలనలో మెట్రో సీఈ కరుణాకర్బాబు, ఎస్ఈ రమేశ్, డీఈలు శ్రీనాథ్, వినోద్కుమార్, ఏడీఈ సంజయ్, కర్మాకర్రెడ్డి, నాగేశ్వర్రావు, శ్రీనివాస్, ఏఈలు భవాని, కౌశిక్, శేఖర్, శ్రీధర్, సిద్దార్థ, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.