కాకతీయుల కాలంలో నిర్మితమైన గొలుసు కట్టు చెరువుల విధ్వంసానికి ఉమ్మడి పాలకుల కుట్రలు వరుస కట్టాయి.. పడావుగా మారిన పంటభూముల్లో పల్లేర్లు మొలిచాయి. శ్రమైక్య జీవనం సాగించిన పల్లెల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. సమైక్య రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా జరిగిన విధ్వంసంతో మెతుకుసీమ బతుకు ఆగమైంది. పరాయి పాలకుల కుట్రల కత్తులతో ఈ ప్రాంత ప్రజల జీవితం ఛిద్రమైంది. ఊళ్లకు ఊతమిచ్చిన చెరువుల్లో పూడిక నిండినా, తూములు శిథిలమైనా, కాల్వలు కనుమరుగైనా గత పాలకులు పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. సీఎం కేసీఆర్ చిన్ననీటి వనరుల పునరుద్ధరణకు పెద్దపీట వేశారు. మిషన్ కాకతీయ’ అనే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తద్వారా చెరువులు నీటితో తొణికిసలాడుతూ గలగల నాదాలు వినిపిస్తున్నాయి. వలస పక్షులన్నీ సొంతగూటికి చేరడంతో పల్లెలు పాడిపంటలతో కళకళలాడుతున్నాయి.
-మెదక్/సంగారెడ్డి, జూన్ 7 (నమస్తే తెలంగాణ)
మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. ఎండకాలంలో సైతం చెరువుల్లో నిండుగా నీళ్లు ఉంటున్నాయి. చెరువులు కింద పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలు, రొయ్యలను వదులుతున్నది. చేపల పెంపకం ద్వారా జిల్లాలోని మత్స్యకారులు లాభాలను ఆర్జిస్తున్నారు. రజకుల కోసం పలుచోట్ల ధోబీ ఘాట్లను ప్రభుత్వం నిర్మించింది. చెరువుల సుందరీకరణ పనులు చేపట్టింది. దీంతో చెరువులకు కొత్త కళ వచ్చింది. బతుకమ్మలను వదిలేందుకు వీలుగా ప్రభుత్వం చెరువుల వద్ద ప్లాట్ఫామ్లు నిర్మించి, లైట్లు ఏర్పాటు చేసింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చెరువులు, కుంటలను పునరుద్ధరణ చేయడంతో ఉభయ జిల్లాల్లోని పల్లెలు పాడిపంటలతో కళకళలాడుతున్నాయి.
మెదక్ జిల్లాలో చెరువులకు పూర్వవైభవం
మెదక్, (నమస్తే తెలంగాణ)/ పాపన్నపేట, జూన్ 7: రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టడంతో మెదక్ జిల్లాలో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం నాలుగు విడుతలుగా చెరువుల అభివృద్ధి, కాలువల మరమ్మతుల పనులకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఫలితంగా జిల్లాలో 2014 నుంచి 2023 వరకు భూగర్భ జలాలు సరాసరి 0.72 మీటర్ల (ఎండా కాలంలో) నుంచి 8.91 మీటర్ల (వర్షాకాలం తర్వాత) గణనీయంగా పెరిగాయి.
మెదక్ జిల్లాలో చెరువుల అభివృద్ధి ఇలా…
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో 4 విడుతలుగా చెరువుల అభివృద్ధి, కాలువల మరమ్మతులు, నిర్మాణం తదితర 1870 పనులకు రూ.445.07 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు రికార్డు స్థాయిలో శరవేగంగా చేపట్టడమైంది. మెదక్ నియోజకవర్గంలోని 484 చెరువులు/కాలువల అభివృద్ధికి రూ.164.48 కోట్లు, నర్సాపూర్ నియోజకవర్గంలోని 590 చెరువులు/కాలువల అభివృద్ధికి రూ.133.33 కోట్లు, గజ్వేల్ నియోజకవర్గంలోని 223 చెరువులు/కాలువల అభివృద్ధికి రూ.27 కోట్ల 60 లక్షలు, దుబ్బాక నియోజకవర్గంలోని 157 చెరువులు/కాలువల అభివృద్ధికి రూ.29.28 కోట్లు, అందోల్ నియోజకవర్గంలోని 310 చెరువులు/కాలువల అభివృద్ధికి రూ.68.11 కోట్లు, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 96 చెరువులు/కాలువల అభివృద్ధికి రూ.22.27 కోట్లు మంజూరు చేసి పనులు పూర్తి చేశారు.
మత్స్యకారులకు ఉపాధి…
మెదక్ జిల్లాలో 1614 చెరువులున్నాయి. జిల్లావ్యాప్తంగా 16,200 మంది మత్స్యకారులు ఉండగా, మరో 4600 మందికి నూతనంగా సభ్యత్వం కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సహకార సంఘాలు 273 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నామమాత్రంగా చేపల పెంపకం కొనసాగేది. ఇప్పడు ప్రతి చెరువులో చేప పిల్లలను వదులుతున్నారు. గతంలో ఉత్పత్తిలో 5472 మెట్రిక్ టన్నులు ఉండగా, తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఇది 68 వేల 402 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. అప్పట్లో చెరువుల ద్వారా వచ్చే చేపల ఆదాయం 32.83 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.65.60 లక్షల ఆదాయం సమకూరుతున్నది.
నేడు ఊరూరా చెరువుల పండుగ…
ఊరూరా చెరువుల పండుగను గురువారం జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించనున్నారు. ప్రతి గ్రామంలోని అందరూ సాయంత్రం చెరువు దగ్గర జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మత్స్యకారులు వలలను అలంకరించుకొని, బోనాలతో వచ్చి మైసమ్మకు పూజలు చేస్తారు. సహపంక్తి భోజనాలు చేస్తారు. జిల్లాస్థాయిలో మెదక్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభిస్తారని మత్స్యశాఖ ఏడీ రజిని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ నెల 9, 10 తేదీల్లో ద్వారకా గార్డెన్లో ఫిష్ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో రూ.427 కోట్లతో చెరువుల పునరుద్ధరణ
సంగారెడ్డి, జూన్ 7 (నమస్తే తెలంగాణ): మిషన్ కాకతీయతో సంగారెడ్డి జిల్లాలోని చెరువులకు పూర్వవైభవం వచ్చింది. జిల్లావ్యాప్తంగా 2458 చెరువులకు మిషన్కాకతీయ పూడికతీతలు, మరమ్మతులు చేపట్టారు. రూ.427.04 కోట్ల వ్యయంతో మిషన్ కాకతీయలో భాగంగా 1804 చెరువుల పూడికతీత, మరమ్మతులు చేపట్టిన చెరువులకు పూర్వవైభవం తీసుకువచ్చారు. 654 చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టారు.
మంత్రి హరీశ్రావు కృషితో చెరువుల్లో జల కళ…
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు గత ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో సంగారెడ్డి జిల్లాలోని చెరువులకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో చెరువుల పూడికతీతలు, మరమ్మతులు జరిగేలా చూశారు. మిషన్ కాకతీయ ద్వారా మొదటి విడుతలో రూ.98.71 కోట్లతో 384 చెరువులు, రెండో విడుతలో రూ.151.91 కోట్లతో 495 చెరువుల పూడికతీత పనులు చేపట్టారు. మూడో విడుతలో రూ.98.92 కోట్లతో 448 చెరువులు, నాలుగో విడుతలో రూ.77.50 కోట్లతో 477 చెరువుల పూడికతీత పనులు చేపట్టారు. చెరువుల్లో పూడికతీతతో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. గ్రామాల్లో భూగర్భ జలమట్టాలు పెరిగాయి. 2014కు ముందు భూగర్భ జల మట్టాలు 17.60 మీటర్ల లోతులో ఉంటే మిషన్ కాకతీయ పనులు చేపట్టిన తర్వాత జిల్లాలో భూగర్భ జల మట్టాలు 7.69 మీటర్లపైకి వచ్చాయి. మిషన్ కాకతీయ పనులకు ముందు సంగారెడ్డి జిల్లాలో చెరువుల నీటి నిల్వ సామర్థ్యం 6230.73 ఎంసీఎఫ్టీ ఉండగా, మిషన్ కాకతీయ పనులు చేపట్టిన తర్వాత చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం 8748.36 ఎంసీఎఫ్టీకి చేరుకుంది. దీంతో చెరువుల కింద ఆయకట్టు గణనీయంగా పెరిగింది. 2014లో చెరవులు కింద 73,137 ఎకరాల ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం చెరువుల కింద 1,36,896 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.
కొత్త చెరువుల నిర్మాణం…
రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో కొత్త చెరువుల నిర్మాణాల చేపడుతున్నది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 11 కొత్త చెరువుల నిర్మాణం పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.56.49 కోట్ల నిధులు విడుదల చేసింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 11 కొత్త చెరువుల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. కొత్త చెరువుల నిర్మాణం ద్వారా 1819 ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
చిన్న నీటి వనరులకు నిర్వహణ నిధులు…
చిన్ననీటి పారుదలకు సంబంధించి ప్రభుత్వం నిర్వహణ నిధులను మంజూరు చేస్తోంది. సంగారెడ్డి జిల్లాలో 2021-22 సంవత్సరానికి రూ.5.98 కోట్లు, 2022-23 సంవత్సరానికి రూ.3.89 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఉమ్మడి పాలనలో చెరువుల కట్టలు తెగినా, చెరువులకు గండిపడినా నిర్వహణ నిధులు లేకపోవడంతో నీటిపారుదల సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టేవారు కాదు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహణ నిధులు అందజేస్తుండడంతో ఎక్కడైనా చెరువులకు గండి పడినా, తూముల మరమ్మతులు ఉన్నా నీటిపారుదల శాఖ వెంటనే పనులు చేపడుతున్నది.
చెరువుల పండుగను విజయవంతం చేయాలి..
– బాలగణేశ్, నీటిపారుదలశాఖ డిప్యూటీ ఇంజినీర్ సంగారెడ్డి
సంగారెడ్డి, జూన్ 7: రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 351 చెరువులకు మిషన్ కాకతీయ-1, 2, 3, 4లలో 275 చెరువుల మరమ్మతులకు రూ.83 కోట్ల నిధులు ఖర్చు చేసి పునరుద్ధరించింది. దీంతో చెరువుల పూడిక తీత అనంతరం నీటి నిల్వ సామర్థ్యం 1980 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నుంచి ఏకంగా 3,462.5 మిలియన్ క్యూబిక్ ఫీట్లకు పెరిగింది. 20,775 ఎకరాల సాగు అవుతుంది. సదాశివపేట్ ఊబ చెరువును మినీట్యాంక్ బండ్గా తీర్చిదిద్దారు. సంగారెడ్డి పట్టణంలోని బొబ్బిలికుంట నుంచి మహబూబ్ సాగర్ చెరువు వరకు కాలువ పనులు చేయడంతో నాల్సాబ్గడ్డ, రిక్షా కాలనీ, సోమేశ్వరవాడ కాలనీలు వర్షపు నీటి వరద నుంచి విముక్తి కలిగించారు. మంజీరా నదిపై ఫసల్వాది గ్రామ శివారులో చెక్డ్యామ్ నిర్మాణంతో 24 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీటి నిల్వతో 720 ఎకరాలకు సాగునీటి సరఫరా అందించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ చెరువుపై పండుగ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు మంత్రి హరీశ్రావు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్, కలెక్టర్ శరత్కుమార్ ముఖ్య అతిథిలుగా హాజరుకానున్నారు.డ రైతులు, మత్స్యకారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలి.
చెరువుల పండగను జయప్రదం చేయాలి
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మృగశిర కార్తె రోజు నిర్వహిస్తున్న ఊరూరా చెరువుల పండుగను జయప్రదం చేయాలి. కార్యక్రమంలో మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలి. చేపల్లో మంచి పోషక విలువలు ఉంటాయి. వీలైనంతగా చేపలు తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
-రజిని, మత్స్యశాఖ ఏడీ, మెదక్