స్వరాష్ట్రంలో తాగునీటి సమస్యకు సీఎం కేసీఆర్ చరమగీతం పాడారు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద ఆగస్టు 7, 2016న మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ట్యాంకులు, పైపులైన్లు పెద్ద ఎత్తున నిర్మించి గడపగడపకూ తాగునీటిని విజయవంతంగా అందిస్తున్నారు. మిషన్ భగీరథతో ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కార మార్గం చూపించింది. గజ్వేల్, దుబ్బాకనియోజకవర్గాల్లో 456 గ్రామాలకు రోజూ ఉదయం, సాయంత్రం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కాళేశ్వరం నీళ్లు ఇంటింటికీ నల్లాల ద్వారా అందుతున్నాయి. దీంతో రంది లేకుండా పోయింది.
– గజ్వేల్, జూలై 7
గజ్వేల్, జూలై 7 : బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపించింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల తాగునీటి సమస్యను మిషన్ భగీరథ పథకం ద్వారా తీర్చింది. కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అక్కడి ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు తీసుకున్న చొరవతో స్వరాష్ట్రం సాధించిన తర్వాత ప్రజల నీటికష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో ఈ పథకం కార్యరూపం దాల్చింది. సీఎం కేసీఆర్ మదిలో నుంచి వచ్చిన ఆలోచనతో అత్యంత ఎత్తులో ఉన్న గజ్వేల్ మండలం కోమటిబండ గుట్టను మిషన్ భగీరథ పథకానికి సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. దీంతో ఉన్నతాధికారులు పలుమార్లు కోమటిబండ గుట్ట ప్రాంతాన్ని పరిశీలించి సీఎం కేసీఆర్కు నివేదిక పంపండంతో జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టి అందుకు తగిన సంప్, ట్యాంకుల నిర్మా ణం పూర్తి చేయగా, ఆగస్టు 7, 2016న సీఎం కేసీఆర్ ఆశల స్వప్నం మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా రాష్ట్రంలోనే ప్రథమంగా ఇక్కడి నుంచి ప్రారంభించారు.
తర్వాత ఇక్కడ సక్సెస్ కావడంతో ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయడంతో నేడు ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటిని ప్రభుత్వం రోజూ అందిస్తున్నది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రజల మంచి నీటి కష్టాలను తీర్చేందుకు బృహత్తర ప్రణాళికతో కొత్త పథకాన్ని రూపొందించడంతో గజ్వేల్ మం డలం కోమటిబండ గుట్టపై మిషన్ భగీరథ పథకం పురుడుపోసుకున్నది. ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న బండపై మిషన్ భగీరథ పథకం పనులు ప్రారంభించుకోగా, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గల్లో 456 గ్రామాలకు రోజూ ఉదయం, సాయంత్రం సమయంలో తాగునీటిని అందించేందుకు కోటి 40లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన సంప్, రెండు ట్యాంకులను నిర్మించారు. కోమటిబండగుట్టపై నిర్మించిన సంప్, ఓహెచ్ఆర్ ట్యాంక్లు గ్రామాల్లో ఇంటింటికీ ఇచ్చిన నల్లా కనెక్షన్లతోపాటు గ్రామాల్లో ఓహెచ్ఆర్ ట్యాంకుల నిర్మాణానికి సుమారు రూ.400కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. అందరినీ ఆకట్టుకునే విధంగా చుట్టూ పచ్చని చెట్లు గుట్టపైకి తారు రోడ్డు, పైలాన్ చుట్టూ పచ్చదనంతో కూడిన మొక్కలు, గ్రాస్, నాలెజ్జ్ సెంటర్ను ఏర్పాటు చేశారు.
కోమటిబండ గుట్టపై మిషన్ భగీరథ సంప్తోపాటు నీటి సరఫరా చేసే విధానాన్ని తెలుసుకునేందుకు వివిధ రాష్ర్టాల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు ఇక్కడి ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఆ సమయంలో మిషన్ భగీరథ పథకం రూపకల్పనను వివరించేందుకు అధికారులు ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఫొటో గ్యాలరీ కోసం ప్రత్యేకంగా అద్దాల నిర్మాణంతో నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. నాలెడ్జ్ సెం టర్ అందుబాటులోకి రావడంతో ఇక్కడికి వచ్చే అధికారులను పథకం అమలవుతున్న తీరుతెన్నులను తెలుసుకోవడం సులభతరం అవుతుంది. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా అధికారులు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ప్రతివ్యక్తికీ 100లీటర్ల చొప్పున మంచినీటిని ఉదయం, సాయంత్రం సరఫరా చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఉదయం నీటిని పంపిణీ చేస్తుండగా, మరికొన్ని గ్రామాల్లో రెండుపుటలా నీటిని పంపిణీ చేస్తున్నారు. స్వరాష్ట్రంలో తాగునీటి కష్టాలు తీరాయి. గతంతో పోల్చితే నేటి పరిస్థితులను చూసి ప్రజలు సీఎం కేసీఆర్ పాలనను దీవిస్తున్నారు.
పర్యాటక ప్రాంతంగా కోమటిబండగుట్ట..
మిషన్ భగీరథ పథకం కోమటిబండ గుట్టపైన పురుడుపోసుకోవడంతో ఇక్కడికి సెలవుదినాల్లో ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. పథకం పనితీరును తెలుసుకునేందుకు సాధారణ ఇంజినీర్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వరకు వస్తుంటారు. రాష్ట్రంలో పలు సందర్భాల్లో పర్యటనకు వచ్చే ఇతర రాష్ర్టాల ఉన్నతాధికారులు కూడా పథకం అమలుతీరును తెలుసుకునేందుకు వస్తారు. చుట్టూ అటవీ ప్రాంతం ఉండడంతో వాతావరణం పచ్చదనంతో ఆకట్టుకునే విధంగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా కాళేశ్వరం నుంచి నీటి సరఫరా అయ్యే విధానాన్ని ఇక్కడికి వచ్చిన వారందరూ ఫొటో గ్యాలరీ ద్వారా తెలుసుకుంటున్నారు. పర్యాటక ప్రాంతంగా కోమటిబండ గుట్ట మారుతుండడంతో ఆదివారం ఇతర ప్రాంతాలకు చెందిన వారు వస్తున్నారు. రెండు నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన ప్రజాప్రతినిధులు మిషన్ భగీరథ పథకం గురించి తెలుసుకునేందుకు వచ్చారు. మిషన్ భగీరథకు సంబంధించిన రాష్ట్రస్థాయి సమీక్షలు ఇక్కడే జరుగుతాయి.
చుట్టూ అడవి మధ్యలో మిషన్ భగీరథ..
కోమటిబండ గుట్ట విస్తీర్ణం 80 ఎకరాల వరకు ఉండగా, ఐదెకరాల విస్తీర్ణంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా సంప్, ట్యాంకులు, కార్యాలయ గదులు, నాలెడ్జ్ సెంటర్, పైలాన్లను నిర్మించారు. చుట్టూ అటవీ ప్రాంతం మధ్యలో మిషన్ భగీరథ పథకం రూపకల్పన జరిగింది. పచ్చదనంతో అటవీ ప్రాంతం కనిపించడంతో అక్కడికి వచ్చే వారిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కోమటిబండ గ్రామం నుంచి గుట్టపైకి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడంతో ఎంతో అందంగా కనిపిస్తున్నది. వందలాది ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ప్రస్తుతం పచ్చదనంతో పరిఢవిల్లుతుంది. భగీరథ పథకాన్ని చూసేందుకు వచ్చే వారు ఇక్కడి వాతావరణాన్ని చూసి ఎంతో సంబురపడుతున్నారు.