పుల్కల్, అక్టోబర్ 31: తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన దమ్మున్న నేత, సీఎం కేసీఆర్ అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బస్వాపూర్ ఏఎస్ గార్డెన్లో దళితుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. కార్యక్రమాకి అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ, ఎన్నికల పరిశీలకుడు ఫరూఖ్ హుస్సేన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డప్పు వాయించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపగా, కళాకారుల నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ తెలంగాణలో నూతనంగా నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా, అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ దళితులకు సముచిత స్థానం కల్పించి, గౌరవం ఇస్తున్నదన్నారు. మన నియోజకవర్గంలో రెండు మండలాలకు దళితులనే పార్టీ అధ్యక్షులుగా నియమించుకున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద టేక్మాల్ మండలం అసమ్మద్పల్లిలో 56 కుటుంబాలకు, బుడ్డాయిపల్లిలో 45 కుటుంబాలకు దళిత బంధును ఇప్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
త్వరలోనే మన నియోజకవర్గంలోని 5 వేల దళిత కుటుంబాలకు దళిత బంధును ప్రకటించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అన్ని గ్రామాల్లోని దళిత వాడల్లో సీసీ రోడ్లను వేయించామన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు దళిత వాడల్లో ఎలాంటి దీన పరిస్థితుల్లో రోడ్లు ఉండేవి, ఇప్పుడు ఎలాఉన్నాయో గుర్తించుకోవాలన్నారు. మళ్లీ అలాంటి అవస్థలు మనకు అవసరమా అని ఎమ్మెల్యే ప్రశ్నించడంతో అక్కడ ఉన్నవారందరూ వద్దు మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కడుతామని ముక్తకంఠంతో తెలిపారు. ఎప్పటికీ మీతోనే ఉండే క్రాంతి కిరణ్ కావాలా? మూడు నాలుగు నెలలకొకసారి వచ్చే కాంగ్రెసోళ్లు కావాలలో మీరే ఆలోచించుకోవాలని ఎమ్మెల్సీ, ఎన్నికల పరిశీలకుడు ఫరూఖ్ హుస్సేన్ అన్నారు. మన చంటి లోకల్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఉమ్మడి మండల పరిధిలోని లింగంపల్లి, చక్రియాల్, మిన్పూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీకి చెందిన మాజీ వార్డు మెంబర్లు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె సంజీవయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చంటి రాహుల్ కిరణ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ మెంబర్ కాశపాగ ఇమ్మయ్య, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల పోచయ్య, విష్ణయ్య, మధుసూదన్, దళిత సంఘాల నాయకులు తదితలు పాల్గొన్నారు.