– ఎన్నికలో పోటీ చేశారని రాజకీయ కక్ష సాధింపు
– బిజెపి రాష్ట్ర నేత మాదగోని శ్రీనివాస్ గౌడ్
నల్లగొండ రూరల్, ఆగస్టు 03 : నల్లగొండ మండలం దొనకల్లు గ్రామంలో గత సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిన కొత్తపల్లి స్వాతి – వెంకటేష్ కుటుంబం ఇంటి ముందు ఉన్న 70 గజాల గ్రామ కంఠం భూమిలో మహిళా సంఘ భవన నిర్మాణం చేపట్టి, ఉద్దేశపూర్వకంగా ఇంటికి దారిని అడ్డుకుంటున్నారని బీజేపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు సోమవారం దొనకల్లు గ్రామానికి వెళ్లి అట్టి స్థలాన్ని పరిశీలించి అనంతరం కలెక్టర్కు గ్రీవెన్స్ డే లో ఫిర్యాదు చేశారు. దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి జీవించే హక్కును కాలరాస్తూ, నివాస హక్కును భంగం కలిగిస్తూ రాజకీయ కక్ష సాధింపుతో మహిళా సంఘ భవన నిర్మాణానికి ఏర్పాటు చేయడం రాజకీయ దురుద్దేశమే అన్నారు.
గ్రామంలో ఇతర ప్రాంతంలో అనుకూలమైన ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ విశాలమైన భవన నిర్మాణానికి భూమి ఉన్నప్పటికీ కేవలం ఎన్నికల్లో పోటీ చేశారని రాజకీయ కక్ష సాధింపుతో వారి ఇంటికి వెళ్లకుండా దానికి అడ్డంగా సంఘ భవనం నిర్మాణానికి ప్రయత్నం చేయడం రాజకీయ కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. దళితుల మధ్య విద్వేషాన్ని తనపై స్వల్ప మెజార్టీతో గెలిచిన సర్పంచ్ తో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే కుట్ర అని తెలిపారు. ఈ విషయంలో నిష్పక్షపాత విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. తమ పార్టీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటే సహించేది లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.