పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందజేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కొల్లూరులో నిర్మించిన డబుల్ ఇండ్ల రెండో విడత పంపిణీలో భాగంగా హైదరాబాద్లోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి ఎంపికైన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో పాటు ఆయా ఎమ్మెల్యేలతో కలిసి 4,800 మందికి మంత్రి కేటాయింపు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఇంటి అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న వారి కష్టాలను ముఖ్యమంత్రి తీరుస్తున్నాడని, లక్షలు విలువజేసే ఇంటిని రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఇస్తున్నారన్నారు. టౌన్షిప్లో అన్ని వసతులు కల్పిస్తామని, త్వరలోనే మున్సిపాలిటీగా మారుస్తామన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నందున ప్రతిపక్షాలు ఎన్నో ప్రలోభాలకు గురిచేస్తాయని, అలాంటి పార్టీలను ఓటుతో తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
-పటాన్చెరు/రామచంద్రాపురం, సెప్టెంబర్ 21
రాష్ట్ర ప్రభుత్వం మా సొంతింటి కలను నెరవేర్చింది. లంచా లు లేకుండా.. పైరవీలు లేకుండా పారదర్శకంగా డబు ల్ బడ్రూమ్ ఇల్లును ప్రభు త్వం కేటాయించింది. కొల్లూర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందని ఫోన్ రాగానే ఎంతో సంతోషం అనిపించింది. దివ్యాంగుడిని అయిన నేను టైలర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. ప్రతి నెలా రూ. 7వేలు ఇంటి కిరాయి కడుతున్నాను. సొంతిల్లు రావడంతో ఇప్పుడు మా బాధలు తప్పాయి. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– గుమ్మడి శ్రీకాంత్, దివ్యాంగుడు, శేరిలింగంపల్లి
పటాన్చెరు/రామచంద్రాపురం, సెప్టెంబర్ 21: ‘మాకు హైకమాండ్ ప్రజలే.. వారి అవసరాలు తీర్చడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం. మాకు గరీబోళ్ల మొహాల్లో ఆనందం చూడటమే ముఖ్యం. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి. హైదరాబాద్లోని గరీబుల కోసం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సీఎం కేసీఆర్ కట్టిస్తున్నారు. అర్హులందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా అందజేస్తున్నాం.’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో రెండో విడుత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని తొమ్మిది నియోజకవర్గాల ప్రజలకు కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారు. మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్గౌడ్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్రెడ్డి, కలెక్టర్ శరత్కుమార్లతో కలిసి రాన్డమైజేషన్ విధానంలో 4,800 ఇండ్లను కంప్యూటర్ లక్కీడ్రా ద్వారా తీశారు. ఈ సందర్భంగా రాన్డమైజేషన్ విధానంపై మంత్రి ప్రజలకు వివరించారు. పారదర్శకమైన విధానంలో భాగంగా ప్రాంతం, కులం, మతం, పార్టీ వంటివి పట్టించుకోకుండా కంప్యూటర్ డ్రా తీస్తుందన్నారు. మంత్రి ఇచ్చిన వివరణతో లబ్ధిదారులు చప్పట్లు కొట్టి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే కొల్లూరు టౌన్షిప్ పెద్దదని, ఇంతపెద్ద టౌన్షిప్ దేశంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రంలో కట్టించలేదన్నారు. సీఎం కేసీఆర్ నగరంలోని నిరుపేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాలనే ఉద్దేశంతో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్ వాసులకు అందిస్తున్నారన్నారు. కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఒక్క లబ్ధిదారు కూడా రూపాయి ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలే స్వయంగా లబ్ధిదారులను తీసుకువచ్చి వారికి ఇంటి పత్రాలు అందజేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని రోజూ తిడుతున్నది. కేసీఆర్ కిట్లు మంచివా.? కాంగ్రెస్ పార్టీ తిట్లు మంచివా? ప్రజలు నిర్ణయించుకోవాలి. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుపేదల సంక్షేమమే ఎజెండాగా తాము పనిచేస్తున్నామని మంత్రి అన్నారు. ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నామని, కల్యాణలక్ష్మీ, షాదీముబాకర్తో రూ.లక్ష సాయం ఇస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్లు, న్యూట్రీషన్ కిట్లు, ఆరోగ్యలక్ష్మి పథకం, బస్తీ దవాఖానలు, ఆరోగ్య మహిళా కార్యక్రమం అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రసవం జరిగిన తరువాత కేసీఆర్ కిట్టుతో పాటు డబ్బులు ఇస్తున్నామన్నారు.
బాలింతను ఇంటి వరకు క్షేమంగా వదిలేసే సంక్షేమం తమది అన్నారు. మహిళలకు ఆరోగ్య భరోసా కలిగించామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఒకప్పుడు 30శాతం కాన్పులే జరిగేవని, ఇప్పుడు 70 శాతం జరుగుతున్నాయన్నారు. పాలమూరును సస్యశ్యామలం చేస్తున్నాం, రికార్డు స్థాయి పంటలను పండిస్తున్నామని వివరించారు. కోర్టు కేసుల్లోనూ గెలుస్తున్నామని, ప్రతి గడపకూ మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో దేశంలోనే టాప్గా నిలుస్తున్నదన్నారు. ఈ మహానగరం అందరిదని, ఎవరైనా వచ్చి జీవించవచ్చన్నారు. బీహార్, యూపీ, రాజస్థాన్, అస్సాం, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్థిరపడిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించామని, ఎక్కడా పక్షపాతం లేదన్నారు. కొల్లూరు టౌన్షిప్లో సకల సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ ప్రాంతంలో ఎకరా భూమి రూ. 20 నుంచి రూ.30 కోట్లు ఉందని, ఇంత విలువైన చోట ఇండ్లు కట్టించి ఇచ్చామన్నారు.
ఉచితంగా తాగునీరు ఇస్తున్నామని, త్వరలో రేషన్ దుకాణాలు పెట్టి సరుకులు అందజేస్తామన్నారు. పూర్తి స్థాయి ఆట, పార్కు స్థలాలు, దవాఖాన, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాల్స్ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఆర్టీసీ బస్సులు కూడా వేస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు మాపై విమర్శలు చేసే ముందు మీ రాష్ర్టాల్లో ఇలాంటి డబుల్ బెడ్రూమ్లు కట్టించారా? అని మంత్రి ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో రాజీవ్ స్వగృహ, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా అవి నాసిరకంగా ఉండేవని విమర్శించారు. పైగా ఆ ఇండ్ల కాగితాలు బ్యాంకుల్లో పెట్టుకుని రుణంకింద రూ. 60వేలు ఇచ్చేవారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిన కొల్లూరు డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు నాణ్యతతో ఉన్నాయన్నారు.
కొల్లూరు టౌన్షిప్ను త్వరలో మున్సిపాలిటీగా మారుస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా మీరు మాత్రం కేసీఆర్ను మరవద్దని లబ్ధిదారులనుద్దేశించి అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందజేసిన మహానాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనే తేడా చూపించకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రజలందరూ మా బిడ్డలే అని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మీకు చక్కటి వసతులు కల్పించి, సొంతబిడ్డల్లా చూసుకుంటాడని మంత్రి తెలిపారు. మీరు ఎక్కడున్నా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మేలును మరువొద్దని మంత్రి హరీశ్రావు కోరారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో వెనుకబడ్డ తెలంగాణ రాష్ర్టాన్ని తొమ్మిదేండ్లలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపామన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో దేశానికే మన రాష్ట్రం ఆదర్శమని, హైదరాబాద్ను అభివృద్ధి పథంలో ఉరకలెత్తిస్తున్నామన్నారు.
తమిళ సినిమా సూపర్స్టార్ రజనీకాంత్ సైతం హైదరాబాద్ను చూసి న్యూయార్క్లో ఉన్నట్టుగా ఉందని ఆనందం వ్యక్తం చేశారని, ఇదంతా ప్రతిపక్షాలకు పట్టదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమం చేపట్టవని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రజలను మభ్యపెట్టేందుకు పథకాలు ప్రకటిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాయ మాటలకు మోసపోవద్దన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిరుపేదలకు వరం, మీ సగం జీతం ఇంటి కిరాయిలకే సరిపోయేవని ఇక నుంచి ఆ బాధ తప్పిందన్నారు. హైదరాబాద్లోని గరీబుల కోసం లక్ష డబుల్బెడ్రూమ్లు సీఎం కేసీఆర్ కట్టిస్తున్నారని, పారదర్శకంగా కంప్యూటర్ లాటరీ ద్వారా ఇండ్లు కేటాయిస్తున్నామన్నారు. ఎవరైనా సొంతిల్లు కడితే మేస్త్రీకి బట్టలు పెట్టాలి, ఆడబిడ్డలకు బట్టలు పెట్టి గౌరవించాలి. మరి సీఎం కేసీఆర్ మీకు ఉచితంగా సొంతిల్లు కట్టిచ్చిండు. మరి మీరు సీఎం సార్కు ఏమి పెడ్తారో చెప్పాలని మంత్రి తన్నీరు హరీశ్రావు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను నవ్వుతూ అడగడంతో లబ్ధిదారులంతా ఓటు వేసి గెలిపిస్తామని ముక్తకంఠంతో చెప్పడంతో సభలో చప్పట్ల వర్షం కురిసింది.
– పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
సీఎం కేసీఆర్ అందరి సంక్షేమం కోరే వ్యక్తి. గరీబోళ్ల జీవితాలను ప్రత్యక్షంగా చూసిన సీఎం కేసీఆర్ వ్యయ ప్రయాసాలను లెక్క చేయకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. కుల, మత, వర్గ, ప్రాంతాలను పక్కకు పెట్టి అందరికీ ఇండ్లు కేటాయిస్తున్నారని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిన వారంతా తన వద్దకు వచ్చి దీవెనలు ఇస్తున్నారన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా కంప్యూటర్ డ్రా తీసి పేర్లు ఇస్తున్నదని, కంప్యూటర్ ద్వారానే బ్లాకులు కేటాయిస్తున్నామని వివరించారు. పటాన్చెరు నియోజకవర్గం అంటేనే మినీ ఇండియా. ఇక్కడ 28 రాష్ర్టాల ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారన్నారు. ఆంధ్ర, తెలంగాణ, బీహార్, యూపీ, రాజస్థాన్వాసులకు సైతం డబుల్ బెడ్రూమ్లు వచ్చాయని తెలిపారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో పనిచేస్తున్నానని, పేదలను గుండెల్లో పెట్టుకుని సంక్షేమ పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. కొల్లూర్ టౌన్షిప్ ఇప్పుడు ఆసియా ఖండంలోనే పెద్ద టౌన్షిప్, ఇక్కడ ఒక వైపు ధనవంతుల విల్లాలు, మరో వైపు గరీబుల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయన్నారు. అందరి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తానని, కొల్లూరులో అన్ని మౌలిక వసతులు కల్పించి అద్భుతమైన టౌన్షిప్గా అభివృద్ధి చేస్తామన్నారు.
కొల్లూర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది. 30 సంవత్సరాలుగా కిరాయి ఇంట్లో ఉంటున్నాం. నా భర్త చనిపోవడంతో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. ప్రతినెలా రూ.8వేలు ఇంటి కిరాయి కడుతున్నాం. నాకు ఇద్దరు పిల్లలు. జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డా. ఇప్పుడు సీఎం కేసీఆర్ మా కష్టాలను దూరం చేశారు. రూపాయి ఖర్చు లేకుండా ఇంత మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం ఎంతో గొప్ప విషయం.
– కోరెక్క సునీత, బోరబండా, ఖైరతాబాద్
రామచంద్రాపురం, సెప్టెంబర్21: రాష్ట్ర ప్రభుత్వం కొల్లూర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రెండో విడుతలో భాగంగా గురువారం లబ్ధిదారులకు అందజేసింది. ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరై నగరంలోని తొమ్మిది నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు గురువారం ఎమ్మెల్యేలతో కలిసి ఇండ్ల పట్టాలు అందజేశారు. గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో ఇండ్ల నిర్మించి కేటాయించడంతో పేదలు సంతోషం వ్యక్తం చేశారు. లబ్ధిదారులు, కుటుంబసభ్యులు, బంధు మిత్రులతో కలిసిరావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. తమకు కేటాయించిన ఇండ్లను చూసుకుని మురిసిపోయారు.
లబ్ధిదారులను ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో కొల్లూర్కి తీసుకువచ్చారు. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఇంటి పట్టాలు అందించడంతో పాటు వచ్చిన వారికి తాగునీరు, భోజన సదుపాయాన్ని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ శరత్కుమార్, జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, కార్పొరేటర్లు సింధూఆదర్శ్రెడ్డి, మెట్టుకుమార్, పుష్పానగేశ్, చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి, వైస్చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
సొంతిల్లు లేకపోవడంతో 20 ఏండ్లుగా కిరాయి ఇంట్లో ఉంటున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడంతో ఎంతో ఆనందంగా ఉంది. నేను, నా భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ నెలకు రూ.5వేలు కిరాయి కడుతున్నాం. ఇప్పుడు మా బాధలు తీరాయి. రూపాయి ఖర్చు లేకుండా లక్షలు విలువ చేసే డబుల్ బెడ్రూమ్ ఇంటిని సీఎం కేసీఆర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి కృతజ్ఞతలు.
– జి.మంగ, లబ్ధిదారు, పటాన్చెరు, సంగారెడ్డి జిల్లా
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కొల్లూర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం. పేదలకు దేవుడిగా మా అందరికీ అండగా ఉన్నారు. సీఎం కేసీఆర్ నూరేండ్ల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలి. మరోసారి బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి రావాలి. ఈ రోజు మా కష్టాలు దూరం చేసి సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది.
– బన్నె సోమేశ్వరి, కృష్ణానగర్, ఖైరతాబాద్