Congress | సంగారెడ్డి, జనవరి 24 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ సర్కారు చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోకాలడ్డుతోంది. కేసీఆర్ సర్కారు మంజూరు చేసిన పనులను ఎక్కడిక్కడ నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. దీంతో జిల్లాలో వందలకోట్ల అభివృద్ధి పనులకు గ్రహణం పట్టింది. ప్రజల కోసం కేసీఆర్ సర్కారు మంజూరు చేసిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా అడ్డుకోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.సర్కారు తీరుపై జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను పూర్తిచేయాలని, పథకాలను కొనసాగించాలని ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పంచాయతీలు, పీహెచ్సీ, కమ్యూనిటీ భవనాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ‘మనఊరు-మనబడి’ పాఠశాలల అభివృద్ధి పనులు అటకెక్కాయి. రహదారుల మరమ్మతు పనులు, మురుగుకాల్వల నిర్మాణ పనులు పూర్తిగా నిలిపివేశారు. జిల్లాలో పంచాయతీరాజ్ ద్వారా వేర్వేరు పథకాల కింద వందల కోట్ల రూపాయలతో చేపట్టాల్సిన 1328కి పైగా పనులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
కేసీఆర్ సర్కారులో పంచాయతీరాజ్ శాఖ మంజూరు చేసిన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం(సీడీపీ), రోడ్ల మరమ్మతులు (ఎంఆర్ఆర్), ఫ్లడ్ డ్యామేజ్ మరమ్మతు పనులు (ఎఫ్డీఆర్) పనులను ప్రభుత్వం నిలిపివేసింది. వీటితో పాటు పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన హెల్త్ సబ్సెంటర్లు, ‘మనఊరు-మనబడి’ కింద పాఠశాలల పునరుద్ధరణ పనులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పీఎంజీఎస్వై, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులతో చేపట్టాల్సిన పనులను నిలిపివేయాలని సూచించింది. సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజవర్గాల్లో అభివృద్ధి కోసం సీడీపీ ద్వారా కేసీఆర్ సర్కార్ రూ.39.94 కోట్లతో 664 పనులు మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు రూ.5.06 కోట్లతో 167 పనులు పూర్తయ్యాయి. 235 పనులు పురోగతిలో ఉండగా, ఇంకా 262 పనులు ప్రారంభం కాలేదు. ప్రారంభంకాని 262 అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం ద్వారా జిల్లాలో 329 పాఠశాలల పునరుద్ధరణకు రూ.126.37 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో రూ.51.84 కోట్లతో 178 పాఠశాలల్లో పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ఇంకా 151 పాఠశాలల్లో పనులు జరగాల్సి ఉండగా కాంగ్రెస్ సర్కార్ ఈ పనులను నిలిపివేయాలని పంచాయతీరాజ్ శాఖకు సూచించింది. పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతుల (ఎంఆర్ఆర్)కు సంబంధించి కేసీఆర్ సర్కార్ రూ.56.30 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇందులో రూ.1.68 కోట్లతో 15 పనులు పూర్తయ్యాయి.
ఇంకా 44 పనులు పూర్తి కావాల్సి ఉండగా ఈ పనులను నిలిపివేయాలని పంచాయతీరాజ్ అధికారులకు కాంగ్రెస్ సర్కార్ అల్టిమేటం జారీచేసింది. ఫ్ల్లడ్ డ్యామేజ్ మరమ్మతు పనులు(ఎఫ్డీఆర్) ద్వారా సంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ సర్కార్ రూ.37.48కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లో ఇప్పటివరకు రూ.93.20 లక్షలతో ఏడు పనులు పూర్తికాగా, 31 పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ పనులనూ ప్రభుత్వం నిలిపివేసింది. పీఎంజీఎస్వై కింద చేపట్టాల్సిన రహదార్లు, బ్రిడ్జిల నిర్మాణాలకు సంబంధించి రెండు పనులు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 57 పనులు ప్రారంభం కాలేదు. డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టాల్సిన 138 అభివృద్ధి పనులు ఇంకా ప్రారంభంకాలేదు. ప్రారంభం కాని 1328 అభివృద్ధి పనులు సైతం అటకెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టాల్సిన ఎస్డీఎఫ్, ఎంఆర్ఆర్, ఎఫ్డీఆర్ పనులను నిలిపివేయడంపై జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మహిపాల్రెడ్డి, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కారు మంజూరు చేసిన అభివృద్ధి పనులను నిలిపివేయకుండా యథావిధిగా కొనసాగించాలని ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్ సర్కార్ ఎస్డీఎఫ్ కింద మంజూరు చేసిన అభివృద్ధి పనులను నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సంగారెడ్డి జిల్లాలో పంచాయతీరాజ్శాఖకు సంబంధించి రూ.231 కోట్ల ఎస్డీఎఫ్ పనులకు బ్రేక్పడింది. సంగారెడ్డి జిల్లాలోని 647 పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం కేసీఆర్ సర్కార్ రూ.291.87 కోట్ల ఎస్డీఎఫ్ (ప్రత్యేక అభివృద్ధి నిధులు) విడుదల చేసింది. అందులో ఇప్పటి వరకు రూ.60.33 కోట్ల నిధులు ఖర్చు కాగా, ఇంకా రూ.231.54 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. ఎస్డీఎఫ్ పనులు నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడంతో పురోగతిలో ఉన్న, ప్రారంభంకాని రూ.231 కోట్ల విలువైన ఎస్డీఎఫ్ పనులు నిలిచిపోనున్నాయి. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎస్డీఎఫ్ ద్వారా బీటీ రోడ్ల పునరుద్ధరణ కోసం కేసీఆర్ సర్కార్ రూ.155.72 కోట్లు విడుదల చేసింది. వీటితో జిల్లాలో 428.45 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు పునరుద్ధరించాలి ఉంది. కానీ, ఇప్పటి వరకు 17.20 కిలోమీటర్ల రోడ్డు పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 411.25 కిలోమీటర్ల రోడ్ల పునరుద్ధరణ పనులు జరగాల్సి ఉంది. జిల్లాలోని 647 పంచాయతీల్లో ప్రతి పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున రూ.136.15 కోట్ల ఎస్డీఎఫ్ నిధులను కేసీఆర్ సర్కార్ విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో మురుగుకాల్వలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. జిల్లాలో మొత్తం రూ.136.15 కోట్లతో 2,723 పనులు చేపట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.60.33 కోట్లతో 1612 పనులు పూర్తయ్యాయి. ఇంకా 1111 పనులు పూర్తి కావాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కేసీఆర్ సర్కార్ రూ.250 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు విడుదల చేసింది. ఎనిమిది మున్సిపాలిటీల్లో ఇంకా రూ.150 కోట్ల వరకు ఎస్డీఎఫ్ పనులు పూర్తి కాలేదు. ఈ పనులు కొనసాగింపుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.