తెలుగు సాహిత్యరంగంలో మెతుకు సీమకు జాతీయస్థాయిలో ఖ్యాతి తెచ్చిన కోలాచల మల్లినాథసూరికి తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. ఆయన పేరుతో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. దీనిపై అధ్యయనం చేసేందుకు కాళిదాస్ సంస్కృత విశ్వవిద్యాలయం రాంటెక్ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ పెన్నా మధుసూదన్, సంస్కృత అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలకంఠం, కళాశాల విద్యా కమిషనర్ నవీన్మిట్టల్తో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా, గత బుధవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, మెదక్ కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి కొల్చారంలో స్థలాలను పరిశీలించారు. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. యూనివర్సిటీలో డిగ్రీ, డిప్లొమా, పీజీ కోర్సులను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
– కొల్చారం, మే 21
కొల్చారం, మే 21: మహా మహోపాధ్యాయుడు. వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచల మల్లినాథసూరి పుట్టిన ఊరు కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ యూనివర్శిటీ ఏర్పాటుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించడంతో విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుపై అధ్యయనం కోసం కాళిదాస్ సంస్కృత విశ్వవిద్యాలయం రాంటెక్ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ పెన్నా మధుసూదన్, సంస్కృత అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలకంఠం, కళాశాల విద్యా కమిషనర్ నవీన్మిట్టల్తో త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవల ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, మెదక్ కలెక్టర్ రాజర్షిషా, స్థానిక ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి వర్శిటీ ప్రతిపాదిత ప్రాంతమైన కొల్చారంలో స్థలాలను పరిశీలించారు. ఎమ్మెల్యే, కలెక్టర్ ఆయా స్థలాలపై పూర్తి సమాచారం ఇచ్చారు. స్థలం ఎంపికకు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆయా పనులు పూర్తయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిగ్రీ, డిప్లొమా, పీజీ కోర్సులను యూనివర్సిటీలో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో సాహితీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పశువుల కాపరి నుంచి ప్రపంచ ప్రఖ్యాతుడు..
బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మల్లినాథసూరి వంశమంతా పండితవంశమే. మల్లినాథసూరి తాత మహా శతావధాని. కాకతీయ రాజుల నుంచి అనేక సన్మానాలు పొందినట్లు చరిత్ర చెబుతున్నది. సూరి తండ్రి కపర్థి సోమయాజీ సైతం సంస్కృత పండితుడే కాక, ఈశ్వరాధన తత్పరుడు. మల్లినాథుడి బాల్యం ఆటపాటలతో గడిచినా విద్య వంటబట్టకపోవడంతో పశువులు కాసేందుకు అతడిని పంపేవారట. గ్రామానికి సమీపంలోని (ప్రస్తుతం బస్టాండు సమీపంలోని) తిరుమలయ్యగుట్టపై త్రికాలజ్ఞాని ఉన్నాడని తెలిసి, మల్లినాథసూరి నిత్యం అక్కడికి వెళ్లి సపర్యలు చేసేవాడు.
యోగి అవసాన దశలో మల్లినాథసూరిని పిలిచి వీణాపాణి మహాసరస్వతీ మంత్రోపదేశం చేసి నాలుకపై బీజాక్షరాలు లిఖించిన అనంతరం సారస్వతమంత్రం ఉపదేశించి, వనదుర్గామాత సాక్షాత్క్యార్యం పొంది, మహాపండితుడవు అవుతావని ఆశీర్వదించడంతో ఈ క్షేత్రంలో కొంతకాలం తపస్సు చేశారు. అక్కడి నుంచి వారణాసికి వెళ్లి కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని, అక్కడ ఓ గురువు వద్ద తర్క, మీమాంస, న్యాయ, వ్యాకరణ, చంధోశాస్ర్తాలు, వేదాంత, వైద్యశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, సంగీత, అశ్వ, గజ, రత్న, రాజనీతి వంటి 19 శాస్ర్తాల్లో ప్రావీణ్యం సాధించి మహా భాషకర్తగా, విద్యాసారంగతుడిగా కీర్తి సాధించాడు. మల్లినాథసూరి వ్యాఖ్యానాలపై ఆచార్య పీజీ లాలే 1981లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మల్లినాథ మనీషా పేరిట ఒకటి, కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి మల్లినాథ పేరిట
పరిశోధనా గ్రంథాలు వెలువరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ రజతోత్సవాల సందర్భంగా మెదక్ మండల పరిషత్, జిల్లా సాంస్కృతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో 1981 నవంబర్ 21న మల్లినాథసూరి స్వస్థలమైన కొల్చారంలో మొదటి స్మారకోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు మెదక్ మండల సాహిత్య పరిషత్తు అధ్యక్షుడు శాస్ర్తుల విశ్వనాథశర్మ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా నాటి సాంస్కృతిక వ్యవహారాలశాఖ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి, అప్పటి కలెక్టర్ కుమారి గాయత్రి రాంచంద్రన్ హాజరై గ్రామ ప్రజలకు మల్లినాథసూరి గొప్పతనం గురించి తెలియజేశారు. కొల్చారంలోని మల్లినాథసూరి వంశస్తుల ఇంటిని 1981లో అప్పటి ప్రభుత్వం రూ.18 వేలకు కొనుగోలు చేసింది. ఆయన స్మారకార్థం ఆ ఇంట్లో వేదపాఠశాల, గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని సంకల్పించింది. 2006లో కోలాచల మల్లినాథసూరి సాహితీపీఠం ఏర్పడింది.
అప్పటి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సౌజన్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మల్లినాథసూరి విగ్రహాన్ని తయారు చేయించి, విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో జాప్యం కారణంగా స్థానిక జైన దేవాలయంలో చాలాకాలం ఉండిపోయింది. ఆ తర్వాత స్థానిక లైబ్రరీకి మల్లినాథసూరి లైబ్రరీగా నామకరణం చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2012 సెప్టెంబర్ 9న మల్లినాథసూరి వైభవసభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి, ప్రస్తుత రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, మంత్రి తన్నీరు హరీశ్రావు హాజరై మల్లినాథసూరి గొప్పతనాన్ని చాటారు. అప్పట్లో సూరి వంశస్తులైన రిటైర్డు తెలుగు పండితులు కోలాచల కాశీనాథశర్మ అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి తన్నీరు హరీశ్రావు దృష్టికి మల్లినాథసూరి కవిత్వాల గురించి వివరించారు. ఆయన జన్మించిన గ్రామంలో స్మారక చిహ్నాలుగా లైబ్రరీ, వేద పాఠశాల ఏర్పాటు ఆవశ్యకత గురించి వివరించారు.
ఆ తర్వాత 2017 డిసెంబర్ 15 నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో మెదక్ జిల్లాలో తెలుగు మహాసభల ప్రారంభ కార్యక్రమాన్ని కొల్చారంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అప్పటి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి మల్లినాథసూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జన్మస్థలాన్ని సందర్శించారు. తెలుగు సాహిత్యరంగంలో మెతుకు సీమకు జాతీయస్థాయిలో ఖ్యాతి తెచ్చిన సూరి గొప్పతనం కలకాలం నిలిచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్తో ప్రభుత్వం సాంస్కృతిక సలహాదారు డా.కేవీ రమణాచారి, స్థానిక ఎమ్మెల్యే మదన్రెడ్డి కొల్చారంలో సంస్కృత విశ్వ విద్యాలయ ఏర్పాటు గురించి ప్రస్తావించారు.
నిర్మాణానికి కావాల్సిన 30 ఎకరాల స్థలాన్ని సేకరించామని ఎమ్మెల్యే సీఎంకు నివేదించగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో ఎన్నో ఏండ్లుగా ఇక్కడి ప్రజల చిరకాల కోరిక సంస్కృత విశ్వవిద్యాలయాన్ని కొల్చారంలోనే ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక వారసత్వ ఉంది. పురాతన ఆలయాలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. రంగంపేట గడికోట, వీరభద్రస్వామి శైవాలయం, జైనుల పవిత్ర పార్శనాథ ఆలయం. తెలుగు కీర్తి పతాకను ప్రపంచానికి చాటిన కోలాచల మల్లినాథసూరి వారసత్వం. అన్నింటికి మించి పవిత్ర మంజీరానది ప్రవహిస్తుండడం, చుట్టూ పచ్చని అడవులతో ఆహ్లాదకర వాతావరణం, నిర్మాణానికి కావాల్సినంత ప్రభుత్వభూమి అందుబాటులో ఉన్నాయి.
సంస్కృత మహా కావ్యాలకు ఆయన వ్యాఖ్యలే శరణ్యం
మరుగున పడిన మహాకవి కాళీదాసుడిని తన వ్యాఖ్యానంతో జీవంపోసిన మహా మహోపాధ్యాయుడు మల్లినాథసూరి. సంస్కృత పంచ మహాకావ్యాలైన మహాకవి కాళీదాసు విరచిత రఘువంశం, మేఘసందేశం, కుమార సంభవం సంజీవని (పునరుజ్జీవింపచేసే) వ్యాఖ్యగా, నైషధీయ చరితం జీవాతు వ్యాఖ్యగా, కవి మాఘుడు రచించిన శిశుపాల వధ సర్వకష వ్యాఖ్యగా, భారవి రాసిన కిరాతుర్జనీయం ఘంటాపథ వ్యాఖ్యానాలు రాశారు. నేటికీ మల్లినాథుడి వ్యాఖ్యానాలను చదవనిదే సంస్కృత మహాకావ్యాలు అర్థం కావు. మూలంలో కవులు ఏది చెప్పారో, దాన్నే తాను పాఠకులకు అందిస్తానని సూరి ప్రతిజ్ఞ చేశాడు. అవసరం ఉన్నచోట అవసరం ఉన్నంత మేరకే చెబుతానని, అవసరం లేని పొల్లు మాటలను చెప్పననీ అన్నాడు. అంతటి నిబద్ధతతో రాసినందువల్లనే ఆయన వ్యాఖ్యానాలను లోకమంతా ఆదరించింది. మల్లినాథసూరి సకల శాస్ర్తాలలో పారంతగుడు. వేదాలలోని రహస్యాలు తెలిసినవాడు. ఆయన వ్యాఖ్యానాల్లో చందస్సు, వ్యాకరణం, అలంకారాలు, లోకోక్తులు, నిఘంటువులు, ఎన్నో ప్రసక్తానుప్రసక్తాలవుతాయి.
ఏది చెప్పినా ప్రామాణికంగా చెప్పడం ఆయన విశిష్టత. మల్లినాథుడు తన జీవిత కాలంలో అనేక రాజ ఆస్థానాలను దర్శించి తన పాండిత్య ప్రతిభా పాటవాలతో ఎన్నో సత్కారాలను అందుకున్నారు. నేటి వరకు సంస్కృత మహా కావ్యాలకు మల్లినాథుడి వ్యాఖ్యలే శరణ్యాలుగా ఉన్నాయంటే ఆయన ప్రతిభ ఎంతటిదో అర్థమవుతుంది. కాశీ పీఠ మహామహోపాధ్యాయుడై జగమెరిగిన కవి, పండితుడు. నైషదీయ చక్రవర్తి తంత్ర వార్తిక స్వర్ణమంజరీ భట్టికావ్య ఏకావళి నలోదయ కావ్యతార్కిక రక్షాధుల కూడా గొప్ప వ్యాఖ్యానం రాసి రఘువీరచరిత్ర, వైశ్యవంశసుధార్ణవములాంటి మౌలిక రచనలను కూడా అందించిన ఘనుడు. మెతుకుసీమలో పుట్టి తెలంగాణ మాగాణానికే కాక యావత్ ప్రపంచానికి తెలంగాణ కీర్తిని దశదిశలా చాటిన మహామేధావి, తొలి తెలుగు వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథసూరి. సకలశాస్త్ర పారంగతుడిగా గుర్తింపు పొందిన ఆయన పాండిత్యం అపారం. వ్యాకరణం, తర్కం, వేదాంతం, పూర్వ మీమాంస, పురాణేతిహాసాల్లో, అలంకరాల్లో, అర్థ, కామ, నృత్య, సాముద్రిక, జ్యోతిశాస్ర్తాల్లో, కవిత్వంలో, ఆయుర్వేదంలో పరిజ్ఞానం కల్గిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
మల్లినాథుడికి ‘మహా’ బిరుదులెన్నో..
మల్లినాథసూరి సంస్కృత పంచ మహాకావ్యాలను విద్యార్థులకు క్రమపద్ధతిలో బోధించారని చరిత్ర చెబుతున్నది. కాళీదాసు రచించిన ప్రథమ కావ్యం రఘువంశాన్ని బోధించి సదాచారాలు, ధర్మరక్షణ నేర్పి ఉత్తమ సంస్కారులుగా తీర్చిదిద్దారు. ఎంతో మంది విద్యార్థులకు సాహితీ పాఠాలు చెప్పడం వల్ల ‘మహా మహోపాధ్యాయ’ అనే బిరుదు. కాళీదాసు రచనలకు వ్యాఖ్యానాలు రాయడం వల్ల ‘వ్యాఖ్యాన చక్రవర్తి’. వ్యాకర్ణం, తర్కం, మీమాంస అనే మూడు శాస్ర్తాల్లో పారంగతుడు కావడంతో ‘పదవాక్య పారాధార పారీణుడు’ అనే బిరుదులు లభించాయి. రాచకొండ సర్వజ్ఞ సింగభూపాలునిచే సత్కరింపబడిన మహావ్యాఖ్యా అని పరిశోధకులు చెబుతుండగా, 16వ శతాబ్దంలో రాయలవంశంలో విజయనగర సామ్రాజ్యంలో ఆస్థాన పండితుడిగా పనిచేశాడని మరికొందరు చెబుతున్నారు.
నా హయాంలో కావడం అదృష్టం
– మదన్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే
తెలంగాణ కీర్తిని ప్రపంచస్థాయికి చాటిన మహాకవి మల్లినాథసూరి పేరున సంస్కృత విశ్వ విద్యాలయం నా హయాంలో కావడం నా అదృష్టం. సుమారుగా ఏడు శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో జన్మించిన కవి స్మారక చిహ్నాల గురించి ఈ ప్రాంతవాసులు ఎన్నో రోజులుగా ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు పట్టించుకోలేదు. అన్ని విషయాలపై అవగాహన ఉన్న మన సీఎం కేసీఆర్ కొల్చారంలో మల్లినాథసూరి సంస్కృత విశ్వ విద్యాలయం ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేయడంతో ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి.
వ్యాఖ్యాన ప్రక్రియకు ప్రాణం..
క్లిష్టమైన వ్యాఖ్యాన ప్రక్రియకు ప్రాణం పోసి, సంస్కృత పంచమహాకావ్యాలకు సంజీవినీ వ్యాఖ్యానంతో చిరస్మరణీయం చేసిన గొప్ప విద్వాంసుడు కోలాచల మల్లినాథసూరి. ఒక రాజు తన రాజ్యంలోనే గౌరవించబడతాడు. కానీ, ఒక పండితుడు ఎక్కడైనా గౌరవించబడతాడనడానికి మల్లినాథసూరి ప్రత్యక్ష నిదర్శనం. సంస్కృత పండితుడిగా పేరు గాంచిన మల్లినాథుడి పేరు మీద దేశంలోనే ప్రసిద్ధ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంస్కృత డిపార్ట్మెంట్ ఉందంటే అతిశయోక్తికాదు. ఈ విశ్వవిద్యాలయంలో ఏటా ఒక సంస్కృత పండితుడికి మల్లినాథుడి పేరిట అవార్డు ప్రదానం చేస్తారు. కావ్య రచన కన్న వ్యాఖ్యానం కష్టతరమంటారు.
కవి మనస్తత్వాన్ని, అతడి ఆలోచన, గుణగణాలు, వారిలోని పాండిత్యం వెలికితీసి మరో కొత్త కోణంలో పాఠకులకు అందించడమే వ్యాఖ్యానం. పద్యకవితకు నన్నయ, గద్యకవితకు పింగళి సూరన ప్రాణం పోస్తే, వ్యాఖ్యాన ప్రక్రియకు ప్రాణం పోసింది కోలాచల మల్లినాథసూరి. మహాపండితుల కావ్యాలకు వ్యాఖ్యానాలు అందించిన ఘనత ఆయన పాండిత్య ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం. సాహిత్య చరిత్రలో తెలంగాణ మణిహారంగా తిరుగులేని స్థానాన్ని పొందింది సూరి. ఫ్రౌఢ దేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న కాలంలో శెట్టి, వైద్య జగాదులైన తెగలలో చతుర్వింశతి నగరాల్లో వ్యాపారాలు చేసుకోవడానికి ఎవరు అర్హులనే వివాదం ఏర్పడినప్పుడు ధర్మనిర్ణయం చేసిన ఘనత సూరిదే. మల్లినాథుడు చేసిన ధర్మ నిర్ణయంతో వైశ్యవంశ సుధాకరమన్ పేరుతో ఒక గ్రంథమే ఉందంటే అతడి ఘనత ఏపాటిదో అర్థమవుతుంది.
గత వైభవం వస్తుంది
– కరెంటు ఉమాదేవి, కొల్చారం సర్పంచ్
కొల్చారంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి జాతీయస్థాయి ఖ్యాతి పొందిన ప్రముఖ కవి మల్లినాథసూరి. భావితరాలకు గుర్తుండేలా మల్లినాథసూరి స్మృతివనం, లైబ్రరీ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వాలను కోరినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే మదన్రెడ్డి సహకారంతో సీఎం కేసీఆర్ కొల్చారంలో మల్లినాథసూరి సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం హర్షణీయం. సాహిత్య రంగంలో కొల్చారానికి గత వైభవం వస్తుంది.