గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు నిర్వహించగా.. అప్పుడు ఎన్నికైన సర్పంచ్లు, వార్డు మెంబర్ల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1తో ముగుస్తున్నది. ఈమేరకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని, ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేయాలని ఎన్నికల కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 499, మెదక్ జిల్లాలో 469, సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉండగా.. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం కేవలం 53 రోజులు మాత్రమే ఉన్నది. 200 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక పోలింగ్ ఆఫీసర్.. 201 నుంచి 400 ఓట్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు.. ఓటర్ల సంఖ్య 401 నుంచి 650 ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించాలని సూచించింది. ప్రతి జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది.
సిద్దిపేట, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసి..నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. దీంతో అందరి దృష్టి పంచాయతీ ఎన్నికలపై పడింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత గ్రామ పంచాయతీల పాలకవర్గం 2024 ఫిబ్రవరి 1వ తేదీతో గడువు ముగియనున్నది. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గడువుకు ముందే ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. ఎన్నికలు కాలానుగుణంగా నిర్వహిస్తారా..? మరి కొద్ది రోజులు గడువును పొడిగిస్తారా..? అనేది వేచి చూడాలి. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లా అధికారం యంత్రాంగం తమ పనుల్లో నిమగ్నమైంది.
ఎంత మంది సిబ్బంది అవసరం పడుతారు, ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఎంత మంది సిబ్బందిని వినియోగించుకున్నారు. తదితర లెక్కలను తీసే పనిలో జిల్లాల అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఆయా గ్రామాల రిజర్వేషన్ల డేటాను జిల్లా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి నుంచి సేకరించింది. అన్నింటిని క్రోడీకరించి ఒక నివేదికను సిద్ధం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ మొత్తంలో సిబ్బంది అవసరం ఉంటుంది. ఒక్కో జిల్లాలో రెండు లేదా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రతి 200 మందికి ఒక ప్రిసైండింగ్ అధికారితోపాటు ఒక పోలింగ్ అధికారిని నియమించాల్సి ఉంటుంది. 200 నుంచి 400 మంది ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు ఇద్దరు పోలింగ్ అధికారులను నియమిస్తారు. 401 నుంచి 650 మంది ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించేలా అధికారులు సిద్ధం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో 650 మంది ఓటర్లు దాటితే రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అక్కడి ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేయడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 499, మెదక్ జిల్లాలో 469, సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుత పాలక వర్గం పదవీ కాలం కేవలం 53 రోజులు మాత్రమే ఉంది. 2024 ఫిబ్రవరి 1వ తేదీతో ముగుస్తుంది. కేవలం 53 రోజులు మాత్రమే ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం ఉంది. ఈ లోగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించే విధంగా జిల్లా అధికార యంత్రాం గం ఏర్పాటు చేస్తుంది. 2019 జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. గత ఎన్నికల సమయంలో నూతనంగా పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చింది. దాని ప్రకారం రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ అందుబాటులో ఉంటుంది. ఆయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పాత రిజర్వేషన్ విధానం కొనసాగిస్తారా..? లేక నూతనంగా మళ్లీ రిజర్వేషన్లు అమలు చేస్తారా..? అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే…ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపితే నూతన సంవత్సరం 2024 జనవరిలో పంచాయతీ ఎన్నికల పోరు ఉండనున్నది. మరో వైపు 1 జనవరి 2024 నాటికి 18 ఏండ్లు నిండిన వారు అంతా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లు తెలిపారు.