మెదక్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 40 బృందాలతో 7 రోజుల్లో 33,221 మందికి కంటి పరీక్షలు చేశాయి. ఇందులో పురుషులు 16,661 మంది, మహిళలు 16,560 మంది ఉన్నారు. 5,714 మందికి కండ్లద్దాలు అందజేయగా, 5,313 మందికి అద్దాల కోసం రెఫర్ చేశారు. ఏడో రోజు సోమవారం 4,491 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 749 మందికి కండ్లద్దాలు అందజేశారు. 670 మందికి అద్దాల కోసం రెఫర్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో డాక్టర్ చందునాయక్ మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో 40 బృందాలు పాల్గొంటున్నాయన్నారు. గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదన్నారు. అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారన్నారు.
అంధత్వ నివారణకు కంటి వెలుగు
చిన్నశంకరంపేట, జనవరి 30: అంధత్వ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. సోమవారం చిన్నశంకరంపేటలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంటి పరీక్షలు ఎలా జరుగుతున్నాయనే విషయాన్ని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన వారికి కండ్లద్దాలు, మందులను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. ఆమె వెంట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయిసింధు తదితరులు ఉన్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి, జనవరి 30(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. సోమవారం జిల్లాలో 69 వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాల్లో 12,765 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో గ్రా మాలకు చెందిన 8259 మంది, మున్సిపాలిటీల్లో 3320 మంది, జీహెచ్ఎంసీలో 1186 మంది ఉన్నారు. 2010 మందికి కండ్లద్దాలు అందజేశారు. 1484 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు ఆర్డర్ చేశారు. పరీక్షల్లో 1512 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు.