అక్కన్నపేట, మార్చి 11: అడుగంటిన భూగర్భజలాలు. రాత్రీపగలు తేడా లేకుండా వచ్చిపోయే దొంగ కరెంటు… కాలిపోతున్న మోట ర్లు… ఎండుతున్న పంట చేన్లు… సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల వ్యాప్తంగా కరువు పరిస్థితులు దాపురించడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాసంగి సాగు కు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి, ఆరుగాలం కష్టపడి పండించిన వరి పొలాలు కండ్ల ముం దే నీళ్లందక ఎండిపోతుండటంతో రైతులు అరిగోస పడుతున్నారు. ఎండిన పంట పొలాలను చూసి రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. కొన్నిచోట్ల పొట్ట దశలో ఉన్న వరి చేన్లు కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పండుతుండగా, మరికొన్ని చోట్ల పశువులకు మేతగా వదిలేస్తున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన యువ రైతు గొట్టె మహేందర్ నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఇప్పటికే రెండు ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. మరో రెండు ఎకరాలు కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు ట్యాంకర్తో నీళ్లు పోస్తూ వరి చేనును బతికించుకుంటున్నాడు. బోదర్వాగు తండాకు చెందిన జగన్నాయక్ ఎకరం వరి చేను చివరి దశలో ఉంటడంతో సుమారు లక్ష రూపాయలు అప్పు తెచ్చి బోరు వేస్తే చుక్కనీరు రాలేదు. మండల కేంద్రానికి చెందిన అమరగొండ ప్రమీల ఎకరం పొలం ఎండిపోతుండటంతో చూసి తట్టుకోలేక పక్కనే ఉన్న మరో రైతు అర్జున్నాయక్ నుంచి సగం పాలుకు(పండిన పంట చేరి సగం)తో ఒప్పందం చేసుకొని వరుస తాళ్ల పారకంతో వరి చేనును నెటుకొస్తున్నది. గొల్లపల్లికి చెందిన బండి తిరుపతి అనే రైతు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. చుట్టూ పంట చేన్లు ఉండటంతో ట్రాన్స్ఫార్మర్ను బయటకు తీసుకువచ్చే పరిస్థితి లేకుండాపోయి వరిచేను ఎండిపోతున్నది. చౌడుతండాకు చెందిన భూక్యా సమ్మయ్య అనే రైతు రెండు ఎకరాల మక్కపంట చివరి దశలో ఉండటంతో కనీసం రెండు, మూడు తడులు నీళ్లు అందించేందుకు ఓ రైతుకు రూ. 7వేలు ఇచ్చి పైపులు వేసి పారించాడు. ఇలా మండలంలో ఏ రైతును కదిలించినా క‘న్నీళ్ల’ ముచ్చటే చెప్పుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రవాణాశాఖ, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పంటలు దెబ్బతిన్న రైతులకు ఆర్థిక సాయం అందించాలని రైతులు కోరుతున్నారు.
నాలుగు ఎకరాల్లో వరి సాగుచేసిన. సుమారు రూ. 60 వేల వరకు పెట్టుబడి అయ్యింది. బోర్ల్లలో ఒక్కసారిగా నీళ్లు అడుగుకుపోయినై. పొలమంతా పొట్ట, ఈత దశలో ఉంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. దీంతో ఓ రైతు వద్ద రూ. 10 వేలకు బోర్ నీళ్లు మాట్లాడుకొని ట్యాంకర్ను అద్దె తీసుకొని వరి చేనుకు పోస్తున్న. ఇలా సుమారు రెండు ఎకరాలకు వరకు పారుతుంది. మిగిలిన రెండు ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. ఏడేనిమిదేళ్లుగా నీళ్ల కరువు లేకుండా ఉండేది. ఏప్రిల్, మేలో కొంచెం ఇబ్బంది అయ్యేది. అసొంటిది ఇప్పుడే (ఫిబ్రవరి చివరి వారం నుంచి) నీళ్లు అడుగంటినై. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంటలన్నీ ఎండిపోతున్నాయి. రైతు బాధలు రైతులకు మాత్రమే అర్థం అవుతాయి. సీఎం రేవంత్రెడ్డి నష్టపోయిన రైతుల గురించి ఏం ఆలోచన చేస్తారో చూడలే మరి.